ఉమ్మడి నల్లగొండ జిల్లాకే ఉన్నత విద్యా నిలయంగా వర్ధిల్లుతున్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ న్యాక్లో అత్యుత్తమ గ్రేడ్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. మూడు నెలల కిందట వీసీగా బాధ్యతలు తీసుకున్న ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి ఆ దిశగా పలు అభివృద్ధి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొత్త భవనాలను ప్రారంభించి అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎమ్మెస్సీ బాటనీ కోర్సును ప్రారంభిస్తున్నారు. ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సులకూ అనుమతులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓయూ రిజిస్ట్రార్గా పనిచేసిన అనుభవంతో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులకు దిశానిర్దేశం చేస్తూ విద్యా
ప్రమాణాల పెంపునకు సంసిద్ధులను చేస్తున్నారు.న్యాక్ అత్యుత్తమ హోదా దక్కించుకునేందుకు
ఎంజీ యూనివర్సిటీ యంత్రాంగం సర్వం సిద్ధమవుతున్నది. ఆ మేరకు సకల సౌకర్యాలతో నిర్మించిన నూతన భవనాల ప్రారంభోత్సవంతో పాటు పలు కొత్త కోర్సుల అనుమతిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎమ్మెస్సీ బాటనీ కోర్సు అందుబాటులోకి రానుండగా ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సులకు అనుమతులు సాధించేలా ప్రత్యేక ప్రణాళికలతో అడుగులు వేస్తున్నది.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి వీసీ చర్యలు తీసుకుంటున్నారు. అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులతో ఈనెల 8న నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. సమష్టి కృషితోనే న్యాక్ అత్యుత్తమ గ్రేడ్ సాధించే అవకాశాలున్నాయని సూచించడంతో ఆ దిశగా పలు స మస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు.
57మంది అకడమిక్ కన్సల్టెంట్స్ హోదా మార్పు..
2007లో ప్రారంభమైన మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత కారణంగా కాంట్రాక్టు పద్ధతిలో అకడమిక్ కన్సల్టెంట్ల నియామకం చేపట్టారు. గతంలో వర్సిటీని ‘న్యాక్’ బృందం సందర్శించిన సమయంలో అకడామిక్ కన్సల్టెంట్ అనే పదాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దాంతో ప్రస్తుత వీసీ ప్రొ.గోపాల్రెడ్డి 57 మందిన అకడమిక్ కన్సల్టెంట్ల హోదాను అసిస్టెంట్ ప్రొఫెసర్(సి)గా మార్పు చేశారు.
న్యాక్ హోదా రెన్యువల్కు గడువు పెంపు..
ఎంజీయూకు న్యాక్ గుర్తింపు గడువు సెప్టెంబర్ 15తో ముగిసింది. ఈ క్రమంలో వీసీ నివేదికలు సమర్పించడంతో దరఖాస్తు గడువును డి సెంబర్ వరకు పెంచారు. ఈ లోగా అంతర్గతంగా అన్ని డిపార్టుమెంట్స్ న్యాక్ వర్క్స్ పూర్తి చేసుకోవడంతోపాటు యూనివర్సిటీని సుందరంగా తీర్చిదిద్దాల్సి ఉన్నది. అంతేకాకుండా న్యాక్ హోదా (గ్రేడ్) కోసం ఎస్ఎస్ఆర్(సెల్ఫ్ స్టడీ రిపోర్టు) అందించారు. ఆ తర్వాతనే న్యాక్ బృందం తమ పర్యటన వివరాలను వెల్లడిస్తుంది. ఎంజీయూకు ప్రస్తుతం న్యాక్ ‘బి’ గ్రేడ్ ఉండగా అత్యున్నత గ్రేడ్కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
యూనివర్సిటీని ఉన్నత విద్యా నిలయంగా తీర్చిదిదేలా ప్రత్యేక లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం న్యాక్ గడువు ముగిసింది. తిరిగి దరఖాస్తు చేయడానికి మరో మూడు నెలల అవకాశం దక్కింది. ఇప్పటికే అన్ని విభాగాల హెడ్స్తో, అధ్యాపకులతో సమావేశం నిర్వహించి సర్వం సిద్ధం చేస్తున్నాం. బాటనీ కోర్సు అందుబాటులోకి తెచ్చాం.. ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం.