ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్న మునుగోడు ప్రజా దీవెన సభకు సర్వం సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం
2 గంటలకు ప్రారంభం కానున్న సభకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మునుగోడు మండల కేంద్రంలోని చౌటుప్పల్ రోడ్డులో భారీ బహిరంగ సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యవేక్షణలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు నేతృత్వంలో పలు బృందాలు సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఐదు రోజులుగా సభాస్థలాన్ని సిద్ధం చేయడంతోపాటు వేదిక నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేశాయి. ఇక సభకు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయల్దేరి చౌటుప్పల్, నారాయణపురం, పుట్టపాక మీదుగా మునుగోడు చేరుకోనున్నారు. బోనాలు, బతుకమ్మలు, బైక్ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ నాయకులు, అభిమానాలు సమాయత్తమవుతున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు.
సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రజాదీవెన సభకు మునుగోడు ముస్తాబైంది. పట్టణానికి నలువైపులా ఉన్న చౌటుప్పల్, చండూరు, నల్లగొండ, చిట్యాల, నార్కట్పల్లి తదితర రోడ్లలో సీఎం కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు, టీఆర్ఎస్ తోరణాలతో గులాబీమయంగా మారింది. సీఎం కేసీఆర్ రాకతో టీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. లక్ష మందికి పైగా పాల్గొనే ఈ సభ కోసం చౌటుప్పల్ రోడ్డులో సుమారు 25 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. 10 వేర్వేరు ప్రాంతాల్లో వంద ఎకరాల స్థలంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే అశేష జనవాహిని కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను సైతం సిద్ధం చేశారు. వెయ్యి మంది మహిళలతో బోనాలు, బతుకమ్మలతోపాటు భారీ బైక్ ర్యాలీతో సీఎం కేసీఆర్కు స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ)/ మునుగోడు,
ప్రజాదీవెన సభ సందర్భంగా పోలీసుశాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఐదుగురు ఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 80 మంది ఎస్ఐలతోపాటు సుమారు 2వేల మంది కానిస్టేబుళ్లు,టాస్క్ఫోర్స్, ప్రత్యేక బలగాల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఎస్పీ రెమా రాజేశ్వరి, డీఎస్పీ నర్సింహారెడ్డి పరిశీలించారు. సభా స్థలంలో బాంబు స్కాడ్, డాగ్ స్కాడ్లతో ముమ్మరంగా తనిఖీలు చేశారు.
సీఎం కేసీఆర్ కాన్వాయ్ నేరుగా వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేక రూట్ను సిద్ధం చేశారు. సభ అనంతరం హైదరాబాద్కు సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో వెళ్లనుండడంతో సభా వేదిక పక్కనే హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. వర్షాకాలం కావడంతో సభా వేదిక నిర్మాణానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. వేదిక అడుగు భాగాన ఫీటు లోతు తవ్వి రాతి పొడితో నింపి పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా వేదిక పైకప్పు నిర్మించారు. వేదిక స్థలం, సభకు వచ్చేవారు, కూర్చునే స్థలం, లోపలికి సులువుగా ప్రవేశించేలా, దారులు.. ఇలా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. సభకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే పార్క్ చేసే విధంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మొత్తం వంద ఎకరాల్లో పది చోట్ల మునుగోడుకు మూడు వైపులా పార్కింగ్ స్థలాలను ఎంపిక చేశారు. ఎటు వైపు నుంచి వచ్చే వాహనాలు ఆ వైపే నిలిపి అక్కడి నుంచి ప్రజలు సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. చౌటుప్పల్, నారాయణపురం, మర్రిగూడతోపాటు కొత్తగా ప్రతిపాదించిన గట్టుప్పల్ మండలాల వారు కొంపల్లి వైపు నుంచి, నాంపల్లి, చండూరు మండలాల వారు చండూరు రూట్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు.
ప్రజాదీవెన సభా ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పరిశీలించారు. సభా వేదికతోపాటు హెలిప్యాడ్ను పరిశీలించి సూచనలు చేశారు. ఒకవేళ వర్షం వస్తే సభికులకు ఇబ్బంది కలుగకుండా రెయిన్ ఫ్రూఫ్ టెంట్లను సైతం సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మంత్రి వెంట నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు. అంతకు ముందు సభా స్థలాన్ని టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి, బొల్ల శివశంకర్, మునుగోడు మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గుర్రం సత్యం తదితరులు పరిశీలించారు.
చౌటుప్పల్ : పేదల పక్షపాతిగా ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లగిరి, ఖైతాపురంలో కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను శుక్రవారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో రూ. 200 ఉన్న పింఛన్ను రూ. 2వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. వివిధ పథకాలతో లబ్ధి పొందుతున్న ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రిక్కల ఇందిరాసత్తిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, ఎంపీఓ అంజిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొత్త పర్వతాలు, ఉపసర్పంచ్ సాయిరెడ్డి బుచ్చిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి భావణి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
చండూరు : మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించనున్న ప్రజా దీవెన సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు జనసమీకరణ చేసి సభకు తరలిరావాలన్నారు. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భూతరాజు దశరథ, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కోడి వెంకన్న, మాజీ సర్పంచ్ కలిమికొండ జనార్దన్, చిలుకూరి శ్రీనివాస్, రమావత్ స్వామినాయక్, పున్న సైదులు, హైమద్, మొగుదాల వెంకన్న, తాందారి రవి పాల్గొన్నారు.
చౌటుప్పల్ : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని పెద్దకొండూరులో 20 మంది ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో సంజీవబాబు, గండని శంకర్, గండని మల్లేశ్, సంజీవ, కృష్ణ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పాక రమేశ్యాదవ్, మాజీ సర్పంచ్ జేజే రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ ముప్పిడి శ్రీనివాస్గౌడ్, నాయకులు గుండెబోయిన మల్లేశ్యాదవ్, ఇస్తారి యాదవ్, పృథ్వీరాజ్రెడ్డి, జంగయ్యాదవ్, బుచ్చిరెడ్డి, అశోక్రెడ్డి పాల్గొన్నారు.
ఆగస్టు19 : మునుగోడులో శనివారం నిర్వహించనున్న ప్రజా దీవెన సభకు ప్రతి ఇంటి నుంచి ఒక కుటుంబ సభ్యుడు రావాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు. చౌటుప్పల్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. మునుగోడులో ఎగురబోయేది గులాబీ జెండా అని అన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని కార్యకర్తలకు సూచించారు. నియోజకవర్గానికి వస్తున్న సీఎం కేసీఆర్కు ఘనస్వాతం పలికి అభిమానాన్ని చాటుకుందామని, ప్రజా దీవెన సభను విజయవంతం చేద్దామని కోరారు. టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశ్యాదవ్, యూత్ అధ్యక్షుడు తొర్పునూరి నర్సింహగౌడ్, ఆర్టీఏ జిల్లా మాజీ మెంబర్ తడక చంద్రకిరణ్, కౌన్సిలర్లు సుల్తాన్రాజు, బొడిగె అరుణ, బాలకృష్ణగౌడ్ పాల్గొన్నారు.
మునుగోడు ప్రజా దీవెన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై వస్తున్నందున శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగింటి వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందని నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఆ సమయంలో వాహనదారులు 65వ నంబర్ జాతీయ రహదారి మీదుగా కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి సహకరించాలని కోరారు.