సూర్యాపేటసిటీ, ఆగస్టు 19 : పలు చోట్ల దొంగతనాలకు పాల్పడి దొంగిలించిన వస్తువులను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను హుజూర్నగర్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 13 తులాల బంగారం, 36 తులాల వెండి వస్తువులతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. చిలుకూరు గ్రామానికి చెందిన కిన్నెర మధు 2022 మే లో చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో జిల్లా జైలుకు వెళ్లాడు.
అక్కడ జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్దమడుగు గ్రామానికి చెందిన తాళ్లకుమార్, మాటూరి సంపత్ పరిచయమయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి టీమ్గా ఏర్పడి హుజూర్నగర్, వరంగల్ జిల్లా జనగామ, కొడకండ్ల, రఘునాథపాలెం, పాలకుర్తి, జాఫర్ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఆయా ఇండ్లలో దొంగిలించిన బంగారు, వెండి వస్తువులను హుజూర్నగర్లో విక్రయించేందుకు శుక్రవారం బైక్పై వస్తున్నారు.
హుజూర్నగర్ ఎస్ఐ తన సిబ్బందితో ఇందిరాచౌక్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో హుజూర్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, సీఐ రామలింగారెడ్డి, ఎస్ఐ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.