వరద పరవళ్లతో నాగార్జునసాగర్ జలకళ సంతరించుకున్నది. నాలుగు రోజులుగా ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. ఆదివారం జలదృశ్యాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణానదిలో జాలీ ట్రిప్పులు, నాగార్జున కొండకు లాంచీలు నడపడంతో ఆహ్లాద అనుభూతి పొందారు.
నందికొండ, ఆగస్టు 14 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. ఇదే సమయంలో వరుసగా సెలవులు రావడంతో నాగార్జునసాగర్లో పర్యాటకుల సందడి నెలకొన్నది. డ్యాం ప్రారంభంలో ఉన్న లాంచీ స్టేషన్ నుంచి ప్రధాన డ్యాం, జల విద్యుత్ కేంద్రం వరకు పర్యాటకులతో రద్దీగా మారాయి. కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి వచ్చిన పర్యాటకులతో శివాలయం పుష్కర్ఘాట్, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం సమీపంలో, కొత్తవంతెన, డ్యాం ముఖద్వారంతోపాటు లాంచీస్టేషన్లు జనంతో కిక్కిరిసిపోయాయి.
తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణానదిలో ఏర్పాటు చేసిన జాలీ ట్రిప్పునకు, నాగార్జునకొండకు పోవడానికి పర్యాటకులు ఆసక్తి కనపరచడంతో నాగార్జునకొండకు 2 ట్రిప్పులు, 3 జాలీ ట్రిప్పుల లాంచీలను పర్యాటకశాఖ నడిపింది. డ్యాం పరిసరాలు, లాంచీ స్టేషన్ వద్ద నదీ తీరంలో పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. అయితే పర్యాటకులు ఆసక్తి కనపరచడంతో బుద్దవనానికి సైతం తాకిడి నెలకొన్నది.