మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని బోధన సాగించేలా
విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ప్రభుత్వ ఉన్నత పాఠశాల
ఉపాధ్యాయులకు ఇప్పటికే నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ ది హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ (నిష్ట) 2.0తో శిక్షణ ఇస్తుండగా తాజాగా ఎస్జీటీ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు నిష్ట 3.0 పేరుతో శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులు దీక్ష పోర్టల్లో లాగిన్ అయ్యి ఈ నెల 30లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బోధనా విధానంలో సమూల మార్పులే లక్ష్యంగా అక్టోబర్ నుంచి ఏప్రిల్ 2022 వరకు శిక్షణ కొనసాగనుంది. ఇందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 6,085 మంది ప్రైమరీ స్కూల్ టీచర్లు పాల్గొననున్నారు.
విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్న ప్రభుత్వం కాలానికి అనుగుణంగా ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నది. ఇప్పటికే ‘నిష్ట 2.0’ పేరుతో ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆగస్టు నుంచి శిక్షణ కొనసాగుతుండగా ఎస్జీటీ, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకు ‘నిష్ట 3.0’ శిక్షణకు ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ టైనింగ్)శ్రీకారం చుట్టింది. దీంతో ఆయా ఉపాధ్యాయులు ఈ నెల 25నుంచి 30వరకు అన్ని దీక్ష పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్టోబర్ నుంచి ఏప్రిల్ 2022వరకు ఈ శిక్షణ సాగుతుంది. జిల్లా విద్యాశాఖ -సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ ఆర్.రామచంద్రయ్య జిల్లా పర్యవేక్షకులుగా వ్యహరించనున్నారు.
నిష్ట శిక్షణ ఉపాధ్యాయులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుంది. మూస విధానంలో బోధన కొనసాగకుండా విద్యార్థుల శక్తి, సామర్థ్యానికి అనుగుణంగా శిక్షణ సాగనుంది. ఒకే వాతావరణంలో గాకుండా విద్యార్థులకు తరగతి గదిలో బోధన, క్షేత్ర పర్యటనలు, వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించి టెక్నాలజీ సాయంతో నైపుణ్యాలు పెంచేందుకు శిక్షణ ఉపయోగపడుతుంది. బోధనా వనరుల(టీఎల్ఎం) రూపకల్పనకు, బోధనా వ్యూహాలకు ఈ శిక్షణ నాంది పలుకనుంది. నూతన విధానాలతో బోధన సాగించడంతో విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా డిజిటల్ తరగతులు, సైన్స్, ఇతర సబ్జెక్టుల అంశంలో యానిమేషన్లు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, వివిధ అంశాల్లో సులభ రీతిలో విద్యార్థులకు బోధన అందుతుంది.
దీక్ష పోర్టలో లాగిన్తో ‘నిష్ట’3.0..
ఉపాధ్యాయులు నిష్ట శిక్షణ కోసం తెలంగాణ దీక్ష (డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాల్జెడ్ షేరింగ్)పోర్టల్ ద్వారా లాగిన్ కావాలి. అడ్రస్ బార్లో diksha.gov.in/telangana అని టైప్చేసి ఎంటర్ చేయాలి. సైన్ఇన్పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి. అందులో మొబైల్ నెంబర్ లేదా ఇ మెయిల్ ఐడీని ఎంటర్ చేసి పాస్వర్డ్ నమోదు చేసుకోవాలి. తర్వాత ఇయర్ బర్త్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. మొబైల్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలోని మొబైల్ నెంబర్ను, పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. తర్వాత రాష్ట్ర తెలంగాణ, మీడియం ఎంటర్ చేయాలి. లాగిన్లో టీచర్, స్టూడెంట్, ఇతరుల బొమ్మలు కనిపిస్తాయి. వాటిలో క్లిక్ చేయగానే జిల్లా ఇతర వివరాలు వస్తాయి. తర్వాత కోర్సు వివరాలు, మాడ్యూల్స్ వస్తాయి. ఏప్రిల్ 2022వరకు సాగే ఈ శిక్షణలో ప్రతి మాసంలో రెండు మాడ్యూల్స్ చొప్పున టీచర్ పెడగాగీ(సబ్జెక్టు) సంబంధించి 12 మాడ్యూల్స్ పూర్తి చేయాలి. 70శాతం హాజరుతోపాటు సమాధానాలు సరైనవి అయితే కోర్సు పూర్తిచేసిన సర్టిఫికెట్ వస్తుంది.
ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా నిష్ట 2.0..
స్కూల్ అసిస్టెంట్స్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, పీఈటీ, కేజీబీవీ, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు ఆగస్టులో ప్రారంభమైన నిష్ట 2.0 విజయవంతంగా అమలవుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8,775 మంది ఆయా విభాగాల్లోని ఉపాధ్యాయులు పాల్గొని దీక్ష పోర్టల్లో శిక్షణ తీసుకుంటున్నారు. డిసెంబర్ వరకు శిక్షణ కొనసాగనుండగా ఇప్పటికే 70శాతంపైగా హాజరుతో మూడు మాడ్యూల్స్ను విజయవంతంగా పూర్తిచేశారు.
ప్రాథమిక విద్యే పునాది..
విద్యార్థి జీవితానికి ప్రాథమిక విద్యే పునాది. అందుకే ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ బృందం బోధనా నైపుణ్యాలు మెరుగుపర్చుకునేలా ‘నిష్ట 3.0’తో శిక్షణ ఇచ్చేలా విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ‘నిష్ట 2.0’తో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల స్కూల్అసిస్టెంట్స్, హెచ్ఎంలకు ఆన్లైన్లో శిక్షణ విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి ఉపాధ్యాయుడు విధిగా శిక్షణలో పాల్గొనాలి.
శిక్షణలోని అంశాలివే
తరగతి గదిలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి దోహదం చేస్తుంది.
విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం, అభ్యసన సామర్థ్యాలను పెంచుతుంది.
విద్యార్థి ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సురక్షిత ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణాన్ని కల్పించడం.
విద్యార్థుల్లో సృజనాత్మకత, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా చైతన్యం చేయడం.
విద్యార్థి కేంద్రీకృతంగా బోధనా విధానం, అభ్యసన సామగ్రి, ఫలితాలు, సమ్మిళిత విద్య దిశగా చర్యలు చేపట్టడం.
ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలకు, టీఎల్ఎం తయారీలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం.
మాతృభాష, గణితం, సామాన్య, సాంఘీక శాస్ర్తాల బోధనా పద్ధతులపై విభిన్నమైన నూతన తరహా అంశాలను ఆచరణలోకి తేవడం, పాటించడం.
ఉపాధ్యాయులు బాధ్యతాయుతమైన నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడేలా చర్యలు తీసుకోవడం.