రవాణా సౌకర్యాలు అభివృద్ధిని నిర్దేశిస్తాయి. వాహనాలు, రైళ్ల రాకపోకలతో వ్యాపారంతోపాటు అనుబంధ రంగాలు విస్తరిస్తాయి. ప్రత్యక్షంగా, పరోక్షంలో ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగుపడుతాయి. రైళ్ల రాకపోకలతో మిర్యాలగూడ పట్టణం శరవేగంగా మారిపోయింది. ప్యాసింజర్ రైళ్ల ఏర్పాటుతో రెండు దశాబ్దాల్లో దేశ వ్యాప్త వ్యాపార సంబంధాలు
మెరుగయ్యాయి. వర్తక, వాణిజ్య పరంగా, ఆహార పంటల ఎగుమతికి మిర్యాలగూడ
కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది.
మిర్యాలగూడ సహా పరిసర ప్రాంతాలు నాగార్జునసాగర్ ఆయకట్టు కావటంతో వరి పుష్కలంగా పండుతుంది. కూలీలకు సరిపడా పనులు దొరకటంతో ఇక్కడికి వలసలు పెరిగిపోయాయి. 1967 నుంచి ఎడమకాల్వకు నీటిని విడుదల చేయడంతో మిర్యాలగూడ ప్రాంతం ప్రధాన వ్యాపార కేంద్రంగా మారింది. రైసు ఇండస్ట్రీ క్రమక్రమంగా విస్తరించింది. సుమారు 100కు పైగా మిల్లులు నెలకొల్పడంతో ఆసియా ఖండంలోనే అత్యధిక మిల్లులు గల ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో బియ్యం తరలింపునకు అనుగుణంగా 1983 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మిర్యాలగూడకు గూడ్సు రైలును నడిపింది. 1990 సంవత్సరంలో ప్యాసింజర్ రైళ్లు కూడా ప్రారంభించడంతో మిర్యాలగూడ ప్రముఖ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది.
అంచెలంచెలుగా విస్తరించిన వ్యాపార రంగం..
గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల రాకతో మిర్యాలగూడ ప్రాంతం అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. గూడ్స్ రాకతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) గోదాములు ఏర్పాటు చేసి బియ్యం నిల్వలు ప్రారంభించింది. సేకరించిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు గూడ్స్ రైలు ద్వారా తరలించడంతో క్రమంగా రైస్ ఇండస్ట్రీ, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
రెండో ప్లాట్ఫాం మీదుగా రాకపోకలు
మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో రెండు ప్లాట్ఫాంలు ఉన్నాయి. హైదరాబాద్, గుంటూరు వైపు వెళ్లే రైళ్లు రెండో ట్రాక్పై నిలుపడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఫుట్ఓవర్ ఎక్కి దిగలేక అవస్థలకోరుస్తున్నారు. లగేజీతో ప్లాట్ ఫాం దిగి, రైలు ఎక్కడం ఇబ్బందిగా ఉన్నదని ప్రజా ప్రతినిధులు, అధికారులు రైళ్లు ఒకటో నంబర్ ప్లాట్పాంపై నిలిచేలా రైల్వే అధికారులతో మాట్లాడాలని పలువురు కోరుతున్నారు.
భారీ ఎత్తున బియ్యం ఎగుమతులు, ఎరువుల దిగుమతి…
మిర్యాలగూడలో మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక సహా ఉత్తరాది రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. అదే విధంగా మిల్లింగ్ కెపాసిటీకి తగిన విధంగా ధాన్యం అందుబాటులో లేని పరిస్థితుల్లో బిహార్, చత్తీస్గడ్ రాష్ర్టాల నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. అదే విధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఇతర రాష్ర్టాల నుంచి ఎరువులు గూడ్స్ ద్వారా మిర్యాలగూడకు చేరుకుంటున్నాయి. ఇక్కడి నుంచే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎరువులు సరఫరా అవుతున్నాయి.
దేశవ్యాప్తంగా రాకపోకలు వ్యాపార సంబంధాలు..
రైళ్ల రాకపోకలతో మిర్యాలగూడ దశ మారింది. ఇక్కడి నుంచి దేశం నలుమూలలకు వ్యాపార సంబంధాలు విస్తరించాయి. దాదాపు అన్ని రాష్ర్టాల నుంచి ఎగుమతి, దిగుమతులు కొనసాగుతున్నాయి. బియ్యం, ధాన్యం, ఎరువులు, పెస్టిసైడ్స్, వస్త్ర, ఆటోమొబైల్, రెడీమేడ్ దుస్తులు, ఎలక్ట్రికల్, మెడికల్ ఎక్విప్మెంట్ వంటి వాటిని ఇతర రాష్ర్టాల నుంచి క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. మిర్యాలగూడ పట్టణానికే గాకుండా గూడ్స్ రైలు ద్వారా వచ్చిన సరుకులు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు తీసుకెళ్తున్నారు.