నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ లిమిటెడ్ (నార్మాక్స్) సంస్థకు ఈసారి కొత్త చైర్మన్ రానున్నారు. సంస్థలో గతేడాది ఖాళీ అయిన మూడు డైరెక్టర్ స్థానాలతోపాటు త్వరలో ఖాళీ కానున్న మరో మూడు స్థానాలకు ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. బుధవారం నామినేషన్ల స్వీకరణ ముగిసే సమయానికి మొత్తం 27 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖాళీ అవుతున్న డైరెక్టర్ స్థానాల్లో ప్రస్తుత చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి స్థానం కూడా ఉండగా, ఆయన పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని, పార్టీకి సేవలు అందిస్తానని వెల్లడించారు. 12 ఏండ్లు చైర్మన్గా పని చేసిన జితేందర్రెడ్డి సేవలను ఇక ముందు పార్టీకి నియోగించుకోనున్నట్లు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వానికి సహకరించే వారిని డైరెక్టర్లుగా ఎన్నుకుంటే సంస్థ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి సహకరించే వారినే ఎన్నుకోండి
నార్మాక్స్ ఎన్నికలు పార్టీలకు అతీతమైనవి. అయినా ప్రభుత్వానికి సహకరించే వారినే డైరెక్టర్లుగా ఎన్నుకుంటే డెయిరీ మరింత అభివృద్ధికి తోడ్పాటు నందించినట్లు అవుతుంది. సమస్యల పరిష్కారానికి సులువుగా ఉంటుంది.
జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్22(నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని నార్మాక్స్ సంస్థ కార్యాలయంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. సంస్థలో మొత్తం 15 మంది డైరెక్టర్ స్థానాలు ఉండగా ప్రతి సంవత్సరం అందులో మూడు డైరెక్టర్ స్థానాలు ఖాళీ అవుతుంటాయి. ఇందులో భాగంగా గతేడాది మూడు స్థానాలు ఖాళీ కాగా కరోనాతో ఎన్నికలు జరపలేదు. ఈ ఏడాదితో కలిపి మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో రెండు స్థానాలను మహిళలకు కేటాయించారు. మూడు రోజులుగా నామినేషన్లు స్వీకరించగా బుధవారంతో గడువు ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గానూ 26 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. రెండు మహిళా స్థానాలకు సంబంధించి ఆరు నామినేషన్లు వచ్చాయి. నాలుగు జనరల్ స్థానాలకు గానూ మరో 21 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో మోతె పూలమ్మాపిచ్చిరెడ్డి రెండు విభాగాల్లోనూ తన నామినేషన్ దాఖలు చేశారు. నేడు నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. రేపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు. అయితే ఉపసంహరణ నాటికి పోటీలో ఉన్న అభ్యర్థులు ఏకగ్రీవానికి అంగీకారానికి వస్తే ఎన్నిక అవసరం ఉండకపోవచ్చు. ఆ దిశగానూ ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిసింది. ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం వరకు ఎన్నికలు నిర్వహించి వెంటనే లెక్కింపు చేపడతారు. 29వ తేదీన చైర్మన్ ఎన్నిక కోసం సమావేశం నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన ఆరుగురితో పాటు ఇప్పటికే ఉన్న 9 మంది డైరెక్టర్లు కలిసి చైర్మన్ను ఎన్నుకుంటారు.
పోటీ నుంచి తప్పుకొన్న జితేందర్రెడ్డి
చిట్యాల మండలం ఉరుమడ్ల సోసైటీ చైర్మన్గా ఉంటూ నార్మాక్స్లో 21 సంవత్సరాల నుంచి డైరెక్టర్గా, 13 సంవత్సరాలుగా చైర్మన్గా కొనసాగుతున్న గుత్తా జితేందర్రెడ్డి ఈ సారి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ల ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తానని వెల్లడించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం హయత్నగర్లోని నార్మాక్స్ సంస్థ వద్ద జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సారి తాను చైర్మన్ బరిలో లేనని, ఖాళీ అవుతున్న తన డైరెక్టర్ స్థానంలోనూ పోటీలో ఉండడం లేదని తెలిపారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహాకారంతో ఐదేళ్ల కిందట టీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎలాంటి బాధ్యత అప్పజెప్పినా ముందుకు తీసుకుపోతానన్నారు. ఇన్నాళ్లు తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రభుత్వ అనుబంధంగా ఉండే డైరెక్టర్లనే గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వానికి సహకరించే వారినే ఎన్నుకోండి
మంత్రి జగదీశ్రెడ్డి పిలుపు
ఈ నెల 28వ తేదీన జరుగనున్న నార్మాక్స్ ఎన్నికలు పార్టీలకు అతీతమైనవే అయినా ప్రభుత్వానికి సహకరించే వారినే డైరెక్టర్లుగా ఎన్నికోవాలని మంత్రి జగదీశ్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి సహకరించే వారు ఎన్నికైతేనే డెయిరీ అభివృద్ధికి మరింత తోడ్పాటునందించినట్లు అవుతుందని సూచించారు. బుధవారం సాయంత్రం హయత్నగర్లోని నార్మాక్స్ సంస్థ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ ప్రభుత్వంతో కలిసిముందుకు వచ్చే పాలకవర్గాన్ని ఎన్నుకుంటే సమస్యల పరిష్కారం సులువవుతుందని పేర్కొన్నారు. డెయిరీ అభివృద్ధికి సహకారం పొందే అవకాశం కూడా ఉంటుందని, అందుకే అలాంటి డైరెక్టర్లనే ఎన్నుకోవాలని సూచించారు. 12 సంవత్సరాలు డైయిరీకి చైర్మన్గా పనిచేసిన జితేందర్రెడ్డి ఈ సారి పోటీ చేయడం లేదని, ఇక ముందు పార్టీకి సేవలు చేస్తానని స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్, కేటీఆర్ల సూచనల మేరకు వారి సేవలు వినియోగించుకుంటామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు.