నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ) : తెలంగాణ విజయ గర్జన సభ సన్నాహాక సమావేశానికి నల్లగొండ, యాదాద్రి జిల్లాల నేతలు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో గురువారం జరుగనున్న కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి గుండకండ్ల జగదీశ్రెడ్డి సారథ్యం వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలు ఎమ్మెల్యేల నేతృత్వంలో తరలివెళ్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మొదలయ్యే సమావేశంలో ఒకేసారి రెండు నియోజకవర్గాల నేతలు పాల్గొనే షెడ్యూల్ ఖరారు చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, యువ నేత కేటీఆర్ విజయ గర్జన సభ ఉద్దేశం, సక్సెస్పై దిశానిర్ధేశం చేయనున్నారు. 10లక్షల మందితో కనీవినీ ఎరుగని రీతిలో సభ నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో గులాబీ యంత్రాంగమంతా కదిలి పని చేయడమే లక్ష్యంగా సమావేశం సాగుతుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2001లో పురుడుపోసుకున్న టీఆర్ఎస్ ఈ ఏడాదితో ఇరవై ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 15న వరంగల్లో 10లక్షల మందితో విజయగర్జన సభను నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ను కదిలించేలా కార్యాచరణ రూపొందించారు. అందులో మొదటగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.
దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్
తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పాల్గొంటున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్నగర్, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గాల సమావేశాలు పూర్తయ్యాయి. గురువారం యాదాద్రిభువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాలు, సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో కేటీఆర్ దిశానిర్దేశం చేయనుండగా జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సారధ్యం వహిస్తున్నారు.
హాజరు కానున్న ముఖ్యనేతలు
స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో ముఖ్య నేతలు హాజరవుతున్నారు. పార్టీ ముందుగా ప్రకటించిన విధంగా సమావేశాలకు జడ్పీ, డీసీసీబీ చైర్మన్లతో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు హాజరు కానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 25 మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఈ సమావేశంలో వరంగల్ సభను విజయవంతం చేయడంపైనే చర్చ జరుగనున్నది. పార్టీ ఏర్పాటు, ఉద్యమ నిర్వహణ, రాష్ట్ర సాధన, సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపిస్తున్న తీరు వంటి ప్రధాన అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు తెలిసింది.
అభివృద్ధిలో ఆదర్శం
ఏడేండ్లలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో వీటన్నింటినీ ఎలుగెత్తి చాటేలా వరంగల్ విజయగర్జన బహిరంగసభను నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. సభ విజయవంతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై కేటీఆర్ పార్టీ నేతలకు వివరించనున్నట్లు సమాచారం. పార్టీ విజయగర్జన సభ సందర్భంగా క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరినీ కదిలించేలా పార్టీ యావత్తు పనిచేసేలా కార్యోన్ముఖులను చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ భవన్లో సమావేశం అనంతరం జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నారు. తర్వాత మండల, గ్రామస్థాయి వరకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నట్లు తెలిసింది. అంతిమంగా విజయగర్జన సభకు ఉమ్మడిజిల్లా నుంచి పెద్ద సంఖ్యలో క్యాడర్ భాగస్వాములయ్యేలా చేయడమే లక్ష్యంగా సమావేశాలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.