ఏడేండ్ల కిందటి దాకా ఇక్కడ ఎవుసమంటే యాతన. నేల తల్లిని నమ్ముకుని బతికే లక్షల రైతు కుటుంబాలకు జీవన్మరణ సమస్య. బర్కత్ సంగతి దేవుడెరుగు! బతుకు జీవుడా అంటూ వలస పట్టకుంటే చాలనుకునే దుస్థితి!! ఎగువన కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా, మూసీ పరవళ్లు తొక్కినా చివరి భూములు బీళ్లుగానే దర్శనమిచ్చేవి. ఎడమ కాల్వను ఎండబెట్టి డెల్టాకు సాగర్ నీళ్లను తీసుకుపోతుంటే రైతు గుండెలు రగిలిపోయేవి. ఏండ్లకేండ్లు సర్కారు తుమ్మలు మొలిచి ఎస్సారెస్పీ కాల్వలు వెక్కిరించేవి. ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని కరంటుతో పారిన భూములే పారి, మిగతా పైరు పశువులపాలో, అన్నదాత ఆవేదనకు ఆహుతో అయ్యేది. ఎరువులు కావాలన్నా, పంట అమ్ముకోవాలన్నా ఆందోళనలు, లాఠీ దెబ్బలు తప్పేవి కాదు. ఇలా వ్యవసాయానికి దూరమైన రైతులు చాలామందే ఉన్నారు.
స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లా సాగు చిత్రం సమూలంగా మారిపోయింది. చరిత్రలోనే తొలిసారిగా డెడ్ స్టోరేజీలోనూ సాగర్ ఎడమ కాల్వకు నీళ్లందాయి. ఎస్సారెస్పీ కాల్వల్లో కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతూ కరువు నేలను తడిపాయి. వడ్డీ వ్యాపారుల ఆగడాల నుంచి యావత్ రైతాంగాన్ని రైతు బంధు బయట పడేసింది. మిషన్ కాకతీయ, 24 గంటల విద్యుత్తో బీడు భూములు సస్యశ్యామలం అయ్యాయి. 2014లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 13.16 లక్షల ఎకరాలు సాగులో ఉండగా, ప్రస్తుతం 21.58లక్షల ఎకరాల్లో పంటలు పండుతుండడమే ఇందుకు నిదర్శనం. దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా సాగులోకి రావడం విశేషం. నాణ్యమైన విత్తనాలు, చివరి గింజ వరకూ కొనుగోళ్లు, మార్కెట్లో మద్దతు ధర కూడా ఇందుకు దోహదపడ్డాయి. ఊళ్లో భూములను వదిలి పట్టణాలకు వెళ్లిన వారిని సైతం వెనక్కి తీసుకొచ్చి ఎవుసం చేయిస్తున్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయం.
రైతును రాజు చేస్తానన్న మాట ప్రకారం సీఎం కేసీఆర్ వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఒకప్పుడు పంట పెట్టుబడి, మద్దతు ధర, విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో అందకపోవడంతో వ్యవసాయాన్ని వదులుకొని పట్నం బాట పట్టిన రైతులు నేడు వెనుతిరిగి మట్టి వాసన వైపు కదులుతున్నారు. నీరు లేక మెట్ట పంటలే వేసుకున్న రైతులకు నేడు ప్రాజెక్టులతోపాటు 24 గంటల ఉచిత విద్యుత్ ద్వారా నిత్యం భూగర్భం నుంచి వచ్చే నీరు తోడయ్యింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014 నుంచి క్రమంగా సాగు పెరుగుతున్నది. ప్రధానంగా వరితోపాటు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. యువత సైతం పెద్దఎత్తున వ్యవసాయ రంగంలోకి దిగుతుండడంతో నూతన పద్ధతులు వెలుగులోకి వస్తున్నాయి.
బీడు భూములు సాగులోకి
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేండ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీడు భూములు ఎక్కువగా సాగులోకి వచ్చాయని వ్యవసాయ శాఖ యంత్రాంగం చెబుతున్నది. 2014 వరకు జిల్లాలో భౌగోళికంగా 35.09 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉండగా 13.12లక్షల ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నాయి. వాటిలో 4.50 లక్షల ఎకరాల్లో వరి, మరో 8.61లక్షల ఎకరాల్లో పత్తి, కంది, పెసర ఇతర పంటలు ఉండేవి. ఈ ఏడాది నాటికి ఏటా లక్ష ఎకరాలకుపైగా సాగు పెరిగి ప్రస్తుతం 21.58లక్షల ఎకరాలకు చేరుకుంది. అందులో వరి 8.37లక్షలు, ఇతర పంటలు 13.21లక్షలకు పెరిగాయి. మొత్తంగా ఈ ఏడేండ్లలో వరితోపాటు ఆయా పంటల సాగు 8.48 లక్షల ఎకరాల్లో పెరిగింది.
అందివస్తున్న రైతు బంధు
వ్యవసాయం చేయాలంటే మొదట పెట్టుబడి బాధ. సీజన్ ఆరంభం అయిందంటే చాలు ఒకప్పుడు బ్యాంకులను లేదంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 2018 వానకాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్లో రైతు బంధు పేరుతో పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేస్తున్నది. 2018 వానకాలం, యాసంగి సీజన్లో ఎకరాకు రూ.నాలుగు వేల చొప్పున ఏడాదికి రూ.ఎనిమిది వేలు ఇచ్చిన సర్కార్ 2019, 2020 సంవత్సరాల్లో నాలుగు సీజన్లకు సీజన్కు రూ.ఐదు వేలుఏటా రూ.పది వేల చొప్పున అందించింది. ఇక ఈ ఏడాది వానకాలం సీజన్లోనూ రూ.ఐదు వేల చొప్పున రైతుల బ్యాంకుల్లో రైతు బంధు జమ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22.58 లక్షల ఎకరాలకు ఏటా సగటున రూ.1100 నుంచి రూ.1150 కోట్లు ఇచ్చింది. మొత్తంగా ఈ ఏడు సీజన్లలో సుమారు రూ. ఎనిమిది వేల కోట్లు.. తొమ్మిది లక్షల మంది రైతులకు అందజేసింది.
రూ.722 కోట్లతో చెరువుల పునరుద్ధరణ
మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 4160 చెరువులను ఐదు విడుతలుగా పునరుద్ధరించింది. 2014 నుంచి 2018 వరకు నాలుగేండ్ల పాటు 4160 చెరువులను మరమ్మతు చేసింది. సుమారు 3.20 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని ఆయా చెరువుల నుంచి బయటకు తీసి ఆయా చెరువుల గాఢతను పెంచింది. ఈ పథకం కింద మొత్తంగా ప్రభుత్వం రూ.722 కోట్లు ఖర్చు చేసింది. చెరువుల పూడికతీతతో ఉమ్మడి జిల్లాలో 1.18లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. అంతేగాక ఆ చెరువులపై పరోక్షంగా ఆధార పడ్డ రైతుల భూముల్లో భూగర్భ జలాలు పెరిగి మరిన్ని ఎకరాలు సాగులోకి వచ్చాయి.
పుష్కలంగా కృష్ణా, గోదావరి నీళ్లు
గతంలో కృష్ణా, గోదావరి నదుల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆంధ్రా పాలకుల వివక్ష వల్ల తెలంగాణకు అందున తలాపునే కృష్ణా నది పారుతున్నా నల్లగొండకు చుక్క నీరు రాని పరిస్థితి. అలాంటి దుస్థితిని తిప్పికొట్టిన సర్కార్ 2014లో డెడ్ స్టోరేజీలో ఉన్నప్పుడే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగు నీరు ఇచ్చింది. ఇప్పటికీ అదేస్థాయిలో సాగు నీరు రావటంతో సాగు నీటి కొరత తగ్గి క్రమంగా జిల్లాలో బీడు భూములు సాగులోకి వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులను నాగార్జునసాగర్ ప్రాజెక్టుతోపాటు ఏఎంఆర్పీ, మూసీ, ఎస్ఆర్ఎస్పీ, కాళేశ్వరం, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు అనుసంధానం చేసి నింపుతున్నారు.
మద్దతు ధరతో పంట కొనుగోలు
రైతు పండించిన పంటకు మార్కెటింగ్ సౌకర్యం ఉంటేనే రైతు ఎంతో ఇష్టపూర్వకంగా వ్యవసాయం చేస్తాడు. లేదంటే ఆ రంగానికి దూరం అయిన పరిస్థితులు మనం గతంలో చూశాం. ఆ పరిస్థితులు పునరావృతం కావద్దనే ఉద్దేశంతో సర్కార్ ప్రతి సీజన్ ఆరంభంలో పంటల సాగు అంచనాలు వేయించి ఆ పంటల ఉత్పత్తులకు మద్దతు ధర అందజేసి కొనుగోలు చేస్తున్నది.