అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం కొత్త కార్యాచరణ
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక ప్రణాళిక
‘మూలాల్లోకి వెళ్దాం’ కార్యక్రమంతో ముందుకు..
నేటి నుంచి నవంబర్ చివరి వరకు కొనసాగింపు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,148 పాఠశాలల్లో
నిర్వహణవిద్యార్థులపై ప్రత్యక్ష బోధనకు దూరమైన ప్రభావం
రామగిరి, సెప్టెంబర్ 20 : కొవిడ్ నేపథ్యంలో ఏడాదిన్నరపాటు ప్రత్యక్ష బోధనకు దూరమైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచడంపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మూడు నుంచి ఎనిమిదో తరగతి పిల్లల్లో తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడంతోపాటు గణిత చతుర్వేద ప్రక్రియల్లో సామర్థ్యాలను పెంచేందుకు ఏబీసీ(అటైన్మెంట్ ఆఫ్ బేసిక్ కాంపిటెన్సీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం నుంచి నవంబర్ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రత్యక్ష బోధనకు దూరమైన విద్యార్థులు ప్రాథమిక భావనలు మర్చిపోయినట్టు అంచనాకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి జిల్లా 3,148 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా, రోజుకు ఒక పీరియడ్ను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ఇందుకోసం నిర్వహించనున్నారు.
గుణాత్మక విద్యకోసం..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించి వారి భవిష్యత్కు బాటలు వేయాలనేది ప్రభుత్వం, విద్యాశాఖ లక్ష్యం. కానీ చాలా సర్కారు పాఠశాలల్లో హైస్కూల్కు వచ్చినా విద్యార్థులకు చదువడం, రాయడం, గణితం అంశాల్లో వెనుకబడి ఉన్నారనేది నేషనల్ అచీవ్మెంట్ సర్వే-2017 వెల్లడించింది. కొవిడ్ అనంతరం ప్రత్యక్ష తరగతులకు వచ్చిన 3 నుంచి 8వ తరగతి విద్యార్థులు చదవడం, రాయడంతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియలను చేయలేకపోతున్నారని గుర్తించారు. దీంతో విద్యాశాఖ వాటిని పెంచేందుకు 2017కు పూర్వం త్రీఆర్స్(చదువడం, రాయడం, ఆర్థమెటిక్) అమలు చేయగా దాని స్థానంలో 2019-20 సంవత్సరానికి ‘మూలాల్లోకి వెళ్దాం’అనేపేరుతో ఏబీసీ(అటైన్మెంట్ ఆఫ్ బేసిక్ కాంపిటెన్సీ) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నెల 21 నుంచి నవంబర్ చివరి వరకు కొనసాగించేలా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలతో జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
3 నుంచి 8 తరగతుల విద్యార్థులకు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,148 (నల్లగొండ జిల్లాలో 1,486, సూర్యాపేట 950, యాదాద్రి భువనగిరి 712) ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఏబీసీ అమలు చేస్తున్నారు. 3నుంచి 8వ తరగతి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ విద్యార్థులు మాతృభాష, గణితం, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు విద్యార్థులకు తొలుత సామర్థ్య పరీక్ష నిర్వహించి వారి సామర్థ్యాలకు అనుగుణంగా వీటిని నేర్పించనున్నారు. రెగ్యులర్ తరగతులకు ఆటంకం కలుగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగనున్నారు. నవంబర్ చివరి వరకు రోజుకు ఒక పీరియడ్ దీనికి కేటాయించగా కార్యక్రమ వివరాలను ఎప్పటికప్పుడు విద్యార్థి వారీగా నివేదికలను ఉన్నతాధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీన్ని జిల్లా విద్యాశాఖాధికారి నేతృత్వంలో జిల్లా మానిటరింగ్ బృందాలు పర్యవేక్షిస్తాయి. నవంబర్ చివరిలోగా ఏబీసీని పూర్తి చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను రాష్ట్ర స్థాయికి ఆహ్వానించి ప్రశంసలు కూడా అందించనున్నట్లు సమాచారం.
ఏబీసీ నిర్వహణ ఇలా..
మంగళవారం నవంబర్ వరకు రోజుకు ఒక పీరియడ్ దీన్ని అమలు చేయాలి.
మాతృభాష, ఇంగ్లిష్, గణితంలో సామర్థ్యాలు పెంచాలి.
ఈ నెల 21, 22న ఎస్సీఈఆర్టీ ఇచ్చిన పరీక్ష పత్రాలతో పరీక్ష నిర్వహిస్తారు.
వాటి ఫలితాలను సీఆర్పీలు సేకరించి మండల ఎంఐఎస్ సహకారంతో నెట్లో అప్లోడ్ చేస్తారు.
కనీస సామర్థ్యాలు లేని వారిని గుర్తించి ఏబీసీ అమలు చేస్తారు.
ప్రతి 10 లేదా 15రోజులకు ఒకసారి స్లిప్ టెస్టులు నిర్వహిస్తారు.
స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు 15రోజులకు ఒకసారి పాఠశాలలను తనిఖీ చేస్తారు.
సామర్థ్యాల పెంపునకే..
త్రీఆర్స్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. వారిని ఇతర విద్యార్థులతో పోటీ పడే విధంగా ఏబీసీ విధానాన్ని అమలు చేస్తాం. ప్రణాళికాబద్ధంగా అన్ని పాఠశాలలు దీనిపై దృష్టి సారించాలి. ఉపాధ్యాయులు ఇందుకు సంసిద్ధులై ఉండాలి.