ఎప్పుడు ?: సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర..
ఎక్కడ ?: నల్లగొండ నడిబొడ్డు.. పోలీస్
హెడ్క్వార్టర్స్ బయటున్న హైదరాబాద్ రోడ్డుపై..
ఏం జరిగింది? : ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపై పరుగు తీస్తున్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఉరుకుతున్నారు. పోలీసులకు సాయంగా కొందరు స్థానికులు. అయినా ముందున్న వాళ్లు దొరుకలేదు.
ఎవరు వాళ్లు ?: 65వ నంబర్ జాతీయ రహదారి వెంబడి ఆలయాలే టార్గెట్గా చౌటుప్పల్ నుంచి నకిరేకల్ వరకు వరుస చోరీలకు పాల్పడిన నిందితులు. నకిరేకల్ పోలీసులు నాలుగు రోజుల కింద వరంగల్లో ఎనిమిది మంది ముఠాను అదుపులోకి తీసుకుని సీసీఎస్కు అప్పగించగా, విచారణ సమయంలో పోలీసుల కండ్లు గప్పి స్టేషన్ నుంచి ఆ ఇద్దరు తప్పించుకున్నారు.
సెంట్రల్ క్రైం స్టేషన్… ఈ పేరు వింటేనే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి! కానీ, ఇలాంటి ఘటనలతో నల్లగొండ సీసీఎస్ అంటే పిచ్చి లైట్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. చోరీలకు పాల్పడిన వారిని పట్టుకుని సివిల్ పోలీసులు ఇక్కడ అప్పగిస్తే.. ఇంటరాగేషన్ సమయంలో నిందితులు ఎంచక్కా పారిపోతుండడం విమర్శలకు తావిస్తున్నది. రెండు నెలల వ్యవధిలో ఇది మూడో ఘటన కావడం స్టేషన్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తున్నది.
నీలగిరి, సెప్టెంబర్ 20 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని సీసీఎస్ పోలీస్స్టేషన్ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఆ విభాగానికి తీరని మచ్చ పడుతున్నది. రెండు నెలల వ్యవధిలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురు సీసీఎస్ స్టేషన్ నుంచి పారిపోవడం ఆశాఖ పనితీరుకు అద్దం పడుతున్నది.
రెండు నెలల్లో మూడుసార్లు..
వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని ఇంటరాగేషన్ చేసేందుకు జిల్లా కేంద్రంలో ఉన్న సీసీఎస్ పోలీస్స్టేషన్కు పంపిస్తారు. నెలక్రితం చైన్ స్నాచింగ్ కేసులో పట్టుకొచ్చిన నిందితులు సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయారు. వారి బేడీలతో పారిపోతుండగా గమనించిన స్థానికులు సినిమా థియేటర్ దగ్గర పట్టుకుని టూటౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు సమాచారం. మరో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చి విచారిస్తుండగా పారిపోయినట్లు సమాచారం. తాజాగా శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు సీసీఎస్ పోలీసు స్టేషన్లో విచారణలో ఉన్న ఇద్దరు నిందితులు పారిపోతుండగా పోలీసులు సైతం వారి వెనకాలే పరిగెత్తడం స్థానికులు గమనించగా.. ఈ వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించింది. పారిపోయిన నిందితులు ఇటీవల నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా టెంపుల్, కట్టంగూర్, సూర్యాపేట, చిట్యాల, నార్కట్పల్లి, చౌటుప్పల్లోని ఆలయాల్లో జరిగిన దొంగతనంలో నిందితులని సమాచారం. వీరిని రెండు రోజుల క్రితం నకిరేకల్ పోలీసులు 8 మందిని అరెస్టు చేసి సీసీఎస్కు అప్పగించగా అందులో ఇద్దరు పారిపోయినట్లు సమాచారం.
ఎస్పీ హెచ్చరించినా..
సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఉన్న వారు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కరుడు గట్టిన నిందితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, వారిని ఇంటరాగేషన్ చేయాల్సి ఉండగా పోలీసులు ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించడం వల్లే నిందితులు పారిపోతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీఎస్ పోలీసు అధికారులు, సిబ్బంది తమ పనితీరు మార్చుకోవాలని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ సైతం పలుమార్లు హెచ్చరించారు. అయినా వారి తీరులో ఏమాత్రం మార్పు రాలేదనడానికి తాజాగా జరిగిన ఘటనలే నిదర్శనం.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు పారిపోయిన ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేశాం. పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు.