నవ రాత్రులు అంగరంగ వైభవంగా పూజలందుకున్న గణనాథులకు వీడ్కోలు కూడా ఘనంగా పలికేందుకు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. విగ్రహాలను తీయడం మొదలు.. శోభాయాత్ర జరిగే రూట్లు, నిమజ్జనం వరకు.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా, ప్రశాంతంగా వేడుక సాగేలా ప్రణాళిక రూపొందించారు. ఈసారి చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరుండడంతో ఎక్కడికక్కడే విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయనున్నారు. ప్రధాన ఘాట్ల వద్ద క్రేన్లు, గజ ఈతగాళ్లను రెడీగా ఉంచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేలకుపైగా గణనాథులు నేడు, రేపు నిమజ్జనానికి తరలనుండగా.. బందోబస్తుకు 3 వేల మంది పోలీసులు, ఇతర విధులకు వివిధ శాఖల సిబ్బందిని వినియోగిస్తున్నారు. వారందరికీ ఇప్పటికే ప్రాంతాల వారీగా విధులను కేటాయించారు. అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లు, పాత నేరస్తులు, కమ్యూనల్ క్రిమినల్స్పై ప్రత్యేక నిఘా పెట్టారు. అవసరమైన వారిని బైండోవర్ చేశారు. కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఎస్పీ ఆఫీసులకు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించనున్నారు.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్18(నమస్తే తెలంగాణ) : బొజ్జ గణపయ్యలు నవరాత్రులు సంప్రదాయబద్ధంగా పూజలందుకొని నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా నిమజ్జన కార్యక్రమం జరుగనున్నది. ఇందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్లగొండ జిల్లాలో 4272 విగ్రహాలు ఉన్నట్లు పోలీసుల అంచనా. అనధికారికంగా ఐదు వేల వరకు ఉండొచ్చు. ఇందులో కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల మూడో, ఐదో రోజు కూడా నిమజ్జనం పూర్తి చేశారు. మిగతా విగ్రహాలన్నీ నేడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పెద్ద సైజ్ గణపతులను నిడమనూరు సమీపంలోని 14వ మైలురాయి వద్ద సాగర్ ఎడమకాల్వలో నిమజ్జనం చేయనున్నారు. మిగతా వాటిని పట్టణ పరిధిలోని వల్లభరావు చెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
పాతబస్తీ నుంచి ప్రారంభం
నల్లగొండ పాతబస్తీలోని 1వ నంబర్ విగ్రహం వద్ద ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి పాతబస్తీ మీదుగా వన్టౌన్ పోలీసు స్టేషన్, క్లాక్టవర్కు విగ్రహాలు చేరుకుంటాయి. పెద్ద విగ్రహాలను సాగర్ రోడ్డువైపునకు, చిన్న విగ్రహాలను వల్లభరావు చెరువు వైపు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. శోభాయాత్ర జరిగే రూట్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి విగ్రహాన్నీ ఇప్పటికే జియోట్యాగింగ్ చేసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టనున్నారు. దారి పొడవునా 2400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీసు కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులు శోభాయాత్రను, నిమజ్జనాన్ని సజావుగా సాగేలా ప్లాన్ చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లను ఏర్పాటు చేసి పోలీసుతో పాటు రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, ఆర్అండ్బీ అధికారులను భాగస్వాములను చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్ ఏర్పాట్లను శనివారం స్వయంగా పర్యవేక్షించారు. అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. మధ్యాహ్నం తర్వాత నుంచి నిమజ్జనం మొదలు కావచ్చని సాయంత్రం వరకు ఊపందుకోవచ్చని భావిస్తున్నారు. తెల్లవారుజాము వరకు నిమజ్జనం కొనసాగే అవకాశాలున్నాయి. దీంతో అన్ని చోట్ల ప్రత్యేకంగా విద్యుద్దీపాలను కూడా ఏర్పాట్లు చేశారు. మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నకిరేకల్, చండూర్ వంటి పట్టణాల్లోనూ ప్రత్యేక బందోబస్తు చర్యలతో పాటు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి మండలంలోనూ నిమజ్జనం జరగనుండగా అన్ని స్థాయిల్లోనూ ఏర్పాట్లు పూర్తి చేశారు. 1500 మంది పోలీసులు, వివిధ శాఖలకు చెందిన వారంతా కలిపి 2 వేల మందికి పైగానే నిమజ్జన ఏర్పాట్లలో పాలుపంచుకో నున్నారు.
సూర్యాపేట జిల్లాలో
సూర్యాపేట జిల్లాలో గణేశ్ శోభాయాత్రకు, నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2500లకు పైగా విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. 600మందికి పైగా పోలీసు సిబ్బందితో పాటు ఇతరులు కలిపి వెయ్యి మంది వరకు విధుల్లో పాల్గొననున్నారు. ప్రధాన పట్టణాల్లో ప్రత్యేక సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. నిఘా బృందాలు కూడా నిరంతరం పనిలో ఉండనున్నాయి. నేర చరిత్ర ఉన్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రెగ్యులర్ పోలీసుతో పాటు టాస్క్ఫోర్స్ బృందాలు, షీ టీమ్స్ కూడా ముఖ్యమైన కూడళ్లల్లో ఉండనున్నాయి. సూర్యాపేటలోని సద్దుల చెరువులో జిల్లా కేంద్ర విగ్రహాల నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి జగదీశ్రెడ్డి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఇతర ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించనున్నారు. కోదాడలోని విగ్రహాలను పెద్ద చెరువులో నిమజ్జనం చేయనున్నారు. మేళ్లచెర్వు, మఠంపల్లి మండలాల పరిధిలోని కృష్ణానదిలోనూ నిమజ్జనాలు కొనసాగనున్నాయి. అందుకే నదీ తీరం వెంట కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ భాస్కరన్ ప్రకటించారు.
యాదాద్రి జిల్లాలో..
యాదాద్రిభువనగిరి జిల్లాలోనూ నేడు, రేపు వినాయక నిమజ్జన శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అన్ని విగ్రహాలను, సోమవారం మిగతా చోట్ల నిమజ్జనం పూర్తి చేయనున్నారు. పోలీసుల లెక్కల ప్రకారం జిల్లాలో 2500 విగ్రహాలను ప్రతిష్ఠించారు. భువనగిరిలోని విగ్రహాలను భువనగిరి, బీబీనగర్ పెద్ద చెరువులో, మిగతావి జిల్లావ్యాప్తంగా ఉన్న 15 చెరువుల్లో నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఏర్పాట్లను శనివారం ఆయన స్వయంగా పర్యవేక్షించారు. కలెక్టర్ సమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.