వృక్షాలే ప్రాణకోటికి జీవనాధారం. అవిలేని ప్రపంచాన్ని ఊహించలేం. ప్రాణవాయువును అందిస్తూ పర్యావరణాన్ని కాపాడడంలో మొక్కలే కీలకం. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నది. రోడ్ల వెంట, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆలయాల్లో, పాఠశాలల ఆవరణలో నాటిన మొక్కలతో పచ్చదనం వెల్లివిరుస్తున్నది.
పచ్చని కార్యాలయాలు
కట్టంగూర్, అక్టోబర్ 17 : కట్టంగూర్లోని పోలీస్స్టేషన్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, మండల పరిషత్, తాసీల్దార్ కార్యాలయంతో పాటు ఉన్నత పాఠశాలలో మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వివిధ పనుల కోసం ఇక్కడికి వచ్చే వారికి ఆహ్లాద వాతావరణం అందుతున్నది.
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి..
మొక్కలు పెంచడం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రభుత్వం చేపట్టే హరితహారం కార్యక్రమంతో పాటు మనవంతు బాధ్యతగా కనీసం ఒక్కొక్కరు పది మొక్కలు నాటి సంరక్షించాలి. మండల వ్యాప్తంగా హరితహారంలో భాగంగా గ్రామాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు పచ్చదనం పంచుతున్నాయి.
వెంకన్న సారు చదువు నేర్పిన ప్రతి పాఠశాల పచ్చదనమే
ఆత్మకూరు(ఎం), అక్టోబర్14: సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని అవగాహన కల్పిస్తున్నాడు మండల కేంద్రానికి చెందిన దడిపల్లి వెంకన్న అనే ఉపాధ్యాయుడు. తాను పనిచేసిన ప్రతి పాఠశాలనూ హరితమయం చేశాడు. మండలంలోని మొరిపిరాల, కొరటికల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం కప్రాయిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పాఠశాలల్లో ఏటా వందలాది మొక్కలు నాటి సంరక్షించడంతో నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
హరితహారంతో పచ్చదనం పెరిగింది..
మానవ మనుగడకు చెట్లే ఆధారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో గ్రామాలన్నీ పచ్చగా మారుతున్నాయి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందు తరాల కోసం ఇంటింటితో పాటు వీధుల వెంట మొక్కలను నాటి సంరక్షించాలి. విద్యతో పాటు మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.
హరితహారం చెట్ల నీడన సేదతీరుతున్న కూలీలు
కట్టంగూర్ సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా తొలి విడుత హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీడ నిస్తున్నాయి. ప్రయాణికులు, పాదచారులు చెట్ల నీడన భోజనం చేసి, విశ్రాంతి తీసుకుంటున్నారు.
మొక్కలే నా ప్రాణం..
‘నడిగూడెం మండలం కరివిరాల ఉన్నత పాఠశాలలో గతంలో నాటిన వందలాది మొక్కలు పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. గతంలో అక్కడ పనిచేసిన సమయంలో హరితహారంలో నాటిన మొక్కలు దారి పొడవునా దట్టంగా పెరిగాయి. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలి. విద్యార్థులకు మొక్కల అవశ్యకత, వాటి ఉపయోగాలపై ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తుంటాం.’
చిన్నారి సందేశం
నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన చిన్నారి గుర్రం మేఘన హరితహారం, బతుకమ్మ విశిష్టతపై బొమ్మలు గీస్తూ ప్రశంసలు అందుకుంటున్నది. గుర్రం వెంకన్న-మాధవి దంపతుల కూతురైన మేఘన ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నది. చిత్రలేఖనంపై ఆసక్తి చూపుతుండడంతో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. చిత్రలేఖనంలో మేఘన పలు
పురస్కారాలను అందుకున్నది.