కరోనా కారణంగా తీవ్ర నష్టాల్లో కూరుకు పోయిన ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. పండుగకు గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం సంస్థ ప్రత్యేక బస్సులు నడిపించడంతో కొంత మేర ఆదాయం సమకూరింది. నల్లగొండ రీజియన్ పరిధిలో వారం రోజులకు రూ. 6.74 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లే వారి కోసం మరికొన్ని రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. దీంతో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆర్టీసీకి దసరా పండుగ ఆదాయాన్ని తీసుకొచ్చింది. పండుగకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. ప్రయాణికుల రద్దీని బట్టి హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలకు పత్యేక బస్సులను తిప్పారు. ఈ నెల 8 నుంచి 14 వరకు 14.18 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీకి ఏడు రోజులకు గానూ రూ. 6.74 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో పండుగ సందర్భాల్లో ప్రత్యేకంగా నడిపించే బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసేవారు. కానీ ఈ సారి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని అధికారులు ప్రకటించడంతో చాలా మంది ప్రయాణికులు బస్సుల్లోనే ప్రయాణించారు.
తిరుగు ప్రయాణంలోనూ..
బతుకమ్మ, దసరా పండుగలకు పట్టణ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వారు.. ప్రస్తుతం తిరిగి ప్రయాణమవుతున్నారు. పండుగ ముగియడం, సోమవారం నుంచి స్కూళ్లు, ఆఫీసులు తెరుచుకోనుండడంతో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. అధికారులు కూడా రద్దీకి అనుగుణం గా బస్సులు నడిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుంచి 364 పత్యేక బస్సులను వివిధ రూట్లల్లో తిప్పుతున్నారు. ఆదివారం అన్ని బస్టాండ్లలో రద్దీ అధికంగా ఉండగా, సోమవారం కూడా ఇదే రీతిన రద్దీ కొనసాగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కు అధిక బస్సులు నడిపిస్తున్నారు.
చార్జీలు పెంచక పోవడం వల్లే రద్దీ
గతంలో పండుగల సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసేవారు. దీంతో చాలా మంది ప్రయాణికులు సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించేవారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారులు ముందస్తుగానే ప్రకటించారు. దీంతో చాలా మంది సొంత వాహనాల కంటే ఆర్టీసీ బస్సులే నయమనే భావనకు వచ్చారు. అందుకే ఈ సంవత్సరం ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తిరుగు ప్రయాణంలోనూ ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకటలాడుతున్నాయి.