హుజూర్నగర్, సెప్టెంబర్ 17 : సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఆస్తుల సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. నెల రోజులుగా మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి పక్కాగా కొలతలు తీసుకుంటున్నారు. వాటిని భువన్ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ 87.35 శాతం వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది.
ఆన్లైన్లో వివరాల నమోదు..
ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నుకు సంబంధించిన పాత వివరాలు అసంపూర్తిగా ఉండటంతో కొత్తగా లెక్కలు వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రేకులషెడ్డు, మట్టి ఇల్లు, పెంకుటిల్లు, పూరి గుడిసె, భవనాలు, కమర్షియల్ బిల్డింగ్, నివాస గృహాలు ఇలా ప్రతిఒక్క దాని వివరాలు సేకరించి కొలతలు తీసుకుంటున్నారు. వాటిని ఎప్పటికప్పుడు భువన్ యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 60,805 అసెస్మెంట్ నంబర్లు ఉండగా ఇప్పటి వరకు 38,964 ఇండ్లను సర్వే చేసి యాప్లో నమోదు చేశారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో 87.35 శాతం వివరాలను నమోదు చేసి మొదటి స్థానంలో ఉండగా, సూర్యాపేట 47.16 శాతం నమోదు చేసి చివరి స్థానంలో నిలిచింది.
పాత కొలతలకు చెక్
మున్సిపాలిటీల్లో పాత కొలతలకు చెక్ పెట్టడంతో ఆస్తి పన్నుల విషయంలో భారీగా మార్పులు కనిపించే అవకాశం ఉంది. గతంలో చాలా మంది అధికారులను మచ్చిక చేసుకుని మ్యాన్యువల్గా తప్పుడు లెక్కలు చూపి ఆస్తిపన్ను ఎగ్గొట్టేవారు. ఇకపై ఆస్తులను సమగ్రంగా సర్వే చేసి పన్నులను కచ్చితంగా నిర్ణయించనున్నారు. వాటి వివరాలను భువన్ యాప్లో నమోదు చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో బిల్కలెక్టర్లతో పాటు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రతిఇంటికీ వెళ్లి కొలతలు తీసుకొని యాప్లో నమోదు చేస్తున్నారు.
రాష్ట్రంలో 13వ స్థానం
రాష్ట్రంలో 139 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో భువన్ యాప్లో వివరాలు నమోదు చేయడంలో హుజూర్నగర్ 13వ స్థానంలో నిలిచింది. కోదాడలో 14,419 అసెస్మెంట్ నంబర్లు ఉండగా ఇప్పటి వరకు 12,413 ఇండ్ల వివరాలను (86.09 శాతం) హుజూర్నగర్లో 6943కు గానూ 6065(87.35 శాతం), సూర్యాపేటలో 30,674కు గానూ 14,469 (47.16 శాతం) నేరేడుచర్లలో 2819కు 1739(61.69 శాతం) పూర్తయ్యాయి. తిరుమలగిరి మున్సిపాలిటీలో 5950 అసెస్మెంట్ నంబర్లుండగా, 4278(71.90శాతం) నమోదు చేశారు.
వంద శాతం పూర్తి చేస్తాం
మున్సిపాలిటీలోని రికార్డుల ప్రకారం పట్టణంలోని భవనాల సర్వే చేనపడుతున్నాం. పాత, కొత్త భవనాలను, అంతస్తులను పరిశీలించి ఆస్తిపన్ను వివరాలు నమోదు చేస్తున్నాం. వందశాతం సర్వే పూర్తి చేసి మున్సిపాలిటీకి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యం.
-నరేశ్రెడ్డి, కమిషనర్, హుజూర్నగర్