ఆ గ్రామం పేరు మీద దస్ర్తాలు, భూములు ఉన్నాయి. కానీ అక్కడ భూమి, చెట్లు, పక్షులు, పశువులు తప్ప జనం కానరారు. వ్యవసాయ భూముల్లో సాగు వివరాలు, ఇతర విషయాలు రికార్డుల్లో నమోదవుతాయి. అదే బేచిరాగ్ తిమ్మాపూర్. కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామపంచాయతీ పరిధిలో తిమ్మాపూర్ ఉన్నది. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 59లో 500 ఎకరాల భూములున్నాయి. వీటిని 175 మంది రైతులు సాగు చేస్తున్నారు. గతంలో ప్రజలు ఇక్కడ నివసించిన ఆనవాళ్లున్నాయి. ఇప్పుడు పాడుబడిన బావులు, శిథిల గోడలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి గ్రామాన్ని బేచిరాక్గావ్(దీపం వెలిగించని గ్రామం)గా పిలుస్తుంటారు. అప్పట్లో అంటువ్యాధులు ప్రబలి కొందరు ఊరు వదిలి పోగా, మరికొందరు ఉపాధిని వెతుక్కుంటూ పలు కారణాలతో గ్రామాన్ని వదిలి వలస బాట పట్టారు. వారు హైదరాబాద్, నల్లగొండ, నెమ్మాని, వెంకటేశ్వర్లబావి, పరడ, ఏపీ లింగోటం, నార్కట్పల్లి, చిట్యాల, శేరిబావి గ్రామాల్లో నివసిస్తున్నారు.
ఆంజనేయ స్వామి విగ్రహం తరలింపు…
గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది. గ్రామస్తులు ఆ దేవాలయంలో నిత్యం పూజలు చేస్తుండేవారట. వలసల కారణంగా ఆలయం మూతపడింది. దాంతో స్వామివారి విగ్రహాన్ని ఎరసానిగూడేనికి తరలించి పునఃప్రతిష్ఠించినట్లు గ్రామస్తులు తెలిపారు.
నివాస స్థలాల్లో పంటలు..
గ్రామంలోని నివాస భవనాలు శిథిలావస్థకు చేరడంతో రైతులు వాటిని చదును చేసి తమకున్న వ్యవసాయ భూముల్లో కలిపి సేద్యం చేస్తున్నారు. వరి, పత్తి, కంది, పెసర పంటలతో పాటు పలు రకాల తోటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరంగా కనువిందు చేస్తున్నది.
జనాభా లెక్కల ప్రకారం..
2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం తిమ్మాపూర్ గ్రామంలో 5 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం 20 మంది జనాభాలో పురుషులు 12, స్త్రీలు 8 మంది మాత్రమే ఉన్నారు. కూలి పని చేసుకునేవారు 9 మంది (పురుషులు 8, స్త్రీ 1) ఉన్నారు. 55.56శాతం అక్షరాస్యత కలిగి గ్రామంలో ఇద్దరు మాత్రమే ఓటర్లు ఉండడం విశేషం.