భువనగిరి అర్బన్, ఏప్రిల్17: ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన నలుగురిని భువనగిరి ఎస్వోటీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. పట్టణంలోని పరి హుస్నాబాద్కు చెందిన శివకుమార్రెడ్డి, వినయ్, ఆకుల నరేశ్, తారకరామనగర్కు చెందిన కోతా జానీలు శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో రెండింతలు డబ్బు సంపాదించొచ్చనే అత్యాశతో బెట్టింగ్కు పాల్పడ్డారు. శివకుమార్రెడ్డి తన మొబైల్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గేమ్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. వినయ్, జానీ, నరేశ్లు తమకు తెలిసిన స్నేహితులను తీసుకొచ్చి బెట్టింగ్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. ఈ క్రమంలో నల్లగొండ చౌరస్తాలోని ఓ షాపులో, నల్లగొండ చౌరస్తా సమీపంలో ఉన్న కారులో కూర్చుని ఇరువురు వేర్వేరుగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న భువనగిరి ఎస్వోటీ పోలీసులు పట్టణ పోలీసులతో నల్లగొండ చౌరస్తాలోని ఓ షాపుపై, సమీపంలోని కారు లో తనిఖీ చేయగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకు న్నారు. వారి నుంచి రూ.1.50 లక్షల నగదు, నాలుగు సెల్ఫోన్లు, బైక్ను సీజ్ చేసి నలుగురిని అరెస్టు చేసి పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో భువనగిరి సీఐ సుధాకర్, భువనగిరి ఎస్ఐలు, ఎస్ఓటీ పోలీసులు ఉన్నారు.