నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్13 (నమస్తే తెలంగాణ) : భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమర్థవంతంగా పని చేస్తున్నది. 90 శాతం భూముల క్రయ, విక్రయాల్లో ఎలాంటి ఆటంకాలూ, అవినీతి, జాప్యం లేకుండా చకచకా పనులు సాగిపోతున్నాయి. భూములు అమ్మేవారు, కొనేవారు రోజుల తరబడి తిరుగాల్సిన పని లేకుండా రిజిస్ట్రేషన్.. ఆ వెంటే మ్యుటేషన్, పాస్పుసక్తం ఉంటే వెంటనే అందులో అప్గ్రెడేషన్ లేకుండా పక్షం రోజుల్లో నేరుగా ఇంటికే కొత్త పాస్పుస్తకం వస్తున్నది.ఒకసారి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిన రుసుము చెల్లించి కేటాయించిన సమయం ప్రకారం రిజిస్ట్రేషన్కు వెళ్తే తర్వాత అన్ని రకాల హక్కులు చట్టబద్ధం అవుతున్నాయి. దీనిపై మెజార్టీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సాంకేతికంగా కొన్ని, ఇతరత్రా కొన్ని భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటి కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన ఆపన్లకు అవకాశం కల్పిస్తూ వచ్చింది. అయినా, కలెక్టర్లే నేరుగా క్లియర్ చేయాల్సి రావడంతో కొన్ని పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి. ప్రస్తుతం వాటిపైనా ప్రభుత్వం దృష్టి సారించడంతో కలెక్టర్లు క్లియర్ చేసే పనిలో పడ్డారు. నల్లగొండ జిల్లాలో 12 వేలకు పైగా సమస్యలు పెండింగ్లో ఉండగా 50 శాతానికిపైగా క్లియర్ చేశారు. సూర్యాపేట జిల్లాలో 95శాతం దరఖాస్తులకు పరిష్కారం చూపారు.
పెండింగ్ రిజిస్ట్రేషన్లు సైతం
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్లోని పెండింగ్ దరఖాస్తులను రెవెన్యూ యంత్రాంగం చకచకా పరిష్కరిస్తున్నది. గతేడాది ఇదే సమయంలో పోర్టల్ అందుబాటులోకి రాగా.. అంతకుముందు ఉన్న రికార్డుల డిజిటలైజేషన్ ఆధారంగా పోర్టల్ను తీర్చిదిద్దారు. ప్రారంభంలో మాత్రం ఏ సమస్య లేకుండా ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న అంశాలపైనా ప్రభుత్వం దశల వారీగా దృష్టి సారించింది. ఇలా ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతూ అదనపు ఆప్షన్లను కల్పిస్తూ దరఖాస్తులను స్వీకరించింది. ఇలా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారాలను ఆయా జిల్లా కలెక్టర్లకు మాత్రమే అనుమతించింది. దీంతో ఈ దరఖాస్తులన్నీ మీ సేవా కేంద్రాల ద్వారా నేరుగా కలెక్టర్ లాగిన్లోకి వచ్చి పడ్డాయి. ఇప్పటికే వస్తూనే ఉన్నాయి. అయితే తిరిగి వీటన్నింటినీ సంబంధిత తాసీల్దార్లకు పంపిస్తూ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్తితులపై రిపోర్టులను తెప్పించుకుంటున్నారు. రిపోర్టుల ఆధారంగా ఆయా జిల్లాల కలెక్టర్లు ఒక్కో సమస్యను నేరుగా పరిష్కరిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకా రం 12వేలకు పైగా దరఖాస్తులు కలెక్టర్ లాగిన్కు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలోనూ 6912 పెండిం గ్ దరఖాస్తులు ఉన్నట్లు తెలిసింది. ఇవి కాకుండా నిత్యం కనీసం 200 నుంచి 300 వరకు కొత్త దర ఖాస్తులు జిల్లాలోని ఆయా మండలాల నుంచి వస్తున్నట్లు ఓ అంచనా. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేయడం అంత సులువుగా లేదు. కలెక్టర్లకు ఇతర పాలనాపరమైన వ్యవహారా లు కూడా చాలా ఉంటుండడంతో వాటిని చూస్తూనే వీటిపైనా దృష్టి సారించాల్సి వస్తుంది. ఈ క్రమంలో నల్లగొండతో పాటు సూర్యాపేట జిల్లాలోనూ పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో పది రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ వీటిపై దృష్టి సారించారు. పెండింగ్ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్లను ఆదేశించారు.
12 వేలకు పైగా పరిష్కారం…
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 12వేలకు పైగా పెండింగ్ దరఖాస్తులకు కలెక్టర్లు పరిష్కారం చూపారు. రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా అత్యధిక మండలాలు ఉన్న జిల్లా నల్లగొండలో 12వేల పైచిలుకు ధరణి దరఖాస్తులు కలెక్టర్ లాగిన్లో పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. అయితే వీటిపై పది రోజులుగా కలెక్టర్ దృష్టి సారించడంతో ఇప్పటి వరకు 6వేల దరఖాస్తులను క్లియర్ చేసినట్లు సమాచారం. ఒక్కో రోజూ కనీసం 300 నుంచి 400 దరఖాస్తుల వరకు పరిష్కరిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందితో షిఫ్టుల వారీగా పనిచేయిస్తుండడంతో దరఖాస్తుల క్లియరెన్స్ ప్రక్రియ సాగుతున్నది. ఇక సూర్యాపేటలో 6912 దరఖాస్తులు కలెక్టర్ లాగిన్లో పెండింగ్లో ఉండగా బుధవారం సాయంత్రానికి 6650 క్లియర్ చేసినట్లు తెలిసింది. మిగిలిన వాటిని కూడా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా అగ్రస్థానంలో ఉన్నట్లు సమాచారం. అయితే 12 రకాల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు లాగిన్లో పెండింగ్ ఉన్నాయి. వీటికి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల పరిశీలన అనంతరం ధరణి ఆప్షన్ల ప్రకారం పరిష్కారం చూపుతున్నారు. ఇవి కాకుండా నిత్యం మరో 200 నుంచి 300 వరకు జిల్లాల వారీగా కొత్తగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే పాతవి క్లియిర్ చేస్తూనే కొత్త వాటిపైనా దృష్టి సారిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
పెండింగ్లో ప్రధానమైనవి ఇవే…
గత గ్రీవెన్స్ల్లో పెండింగ్ దరఖాస్తులు, సర్వే నంబర్లలో తప్పులు, భూముల విస్తీర్ణాల్లో హెచ్చు తగ్గులు, ధరణి కంటే ముందు రిజిస్ట్రేషన్ పూర్తయి పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లు, ఎన్ఆర్ఐలకు పట్టాదారు పాసు పుస్తకాల జారీ, ఆధార్ సీడింగ్ లేనివి, నాలా పర్మిషన్లు, మ్యుటేషను అయినా కొత్త పాసుబుక్ లేనివి, డిజిటల్ సంతకాలు కానివి… పలు రకాల సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు ఆపన్షలను కొత్తగా కల్పిస్తూ మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ వస్తుంది. యుద్దప్రతిపాదికన పరిష్కారం చూపాలని ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. త్వరలోనే అన్ని దరఖాస్తులకు ఓ పరిష్కారం దొరకనుందనడంలో సందేహం లేదు.