మంచి వాతావరణం, స్వచ్ఛమైన గాలికి తోడు ఇంటి అవసరాల కోసం చాలా మంది మొక్కల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఇంటి ఆవరణలో పండ్లు, పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలు పెంచుకుంటున్నారు. ఏపుగా పెరిగిన చెట్లు ఇంటికి అందాన్నివ్వడంతో పాటు మనస్సుకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఔషధ మొక్కలకు కేరాఫ్
కోదాడ పట్టణం శ్రీమన్నారాయణ కాలనీలోని ఓ ఇంట్లో ఔషధ మొక్కలు పెంచుతున్నారు. 150 గజాల స్థలంలో వందలాది మొక్కలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం తనకు స్ఫూర్తినిచ్చిందని ఇంటి యజమాని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయ సంచాలకుడు పెంటయ్య తెలిపారు.
హరిత పెరడు..
మండల పరిధిలోని శ్రీనివాసనగర్ గ్రామ పంచాయతీలో ఇంటింటికీ ఐదు పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. నర్సరీల నుంచి ఎంపిక చేసిన మొక్కలను అందించడంతో గ్రామస్తులు వాటిని అపురూపంగా పెంచుకుంటున్నారు. ఇంటింటా పెరిగిన పచ్చదనంతో ఊరంతా వనాన్ని తలపిస్తున్నది. పెరట్లో పెరిగిన మొక్కలతో ప్రతి ఇల్లూ కనువిందు చేస్తున్నది.
అక్టోబర్ 16 మిద్దె తోట
చండూరు మండల కేంద్రానికి చెందిన వడ్డెపల్లి గోపాల్ గౌడ్ తన ఇంటి పై భాగంలో పెరటి తోటను పెంచుతున్నాడు. పలు రకాల పూలు, కూరగాయలు, పండ్లు, తీగజాతి మొక్కలు నాటి సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తున్నాడు. దాంతో నాణ్యమైన కూరగాయలు, పండ్లు, స్వచ్ఛమైన వాతావరణం అందుతున్నదని గోపాల్గౌడ్ ఆనందం వ్యక్తం చేశాడు.
అల్లుకున్న ఆహ్లాదం
ఆ ఇల్లంతా పచ్చదనంతో నిండిపోయింది. ఇంటి పైన, కింద మొత్తం మొక్కలతో కళకళలాడుతూ ఆహ్లాద వాతావరణం ఏర్పడింది. మొక్కలపై ఇష్టంతో 20ఏండ్లుగా ఎంతో శ్రద్ధగా పెంచుకుంటున్నామని ఇంటి యజమాని డాక్టర్ చింతమళ్ల నిర్మల్ కుమార్ సతీమణి సుజాత తెలిపారు. రోజూ మొక్కలకు నీళ్లు పెడుతూ ఎరువులను సకాలంలో అందిస్తూ సంరక్షిస్తున్నామని చెప్పారు.
కష్టమే కానీ ఇష్టంగా చేయాలి..
మొక్కలను సంరక్షించడం చాలా కష్టమైన పనే. కానీ ఇష్టంగా చేస్తే అది ఒక అలవాటుగా మారి మనం ఎంత వద్దనుకున్నా మనసు మొక్కల మీదకు మళ్లుతుంది. రోజూ ఎండిపోయిన ఆకులను తీసేసి మొక్కలపై పురుగులు ఆశించకుండా సేంద్రియ ఎరువులను పిచికారీ చేస్తాము. వానకాలం ప్రారంభంలో ప్రతి చెట్టు వద్ద కొత్త మట్టిని నింపుతాం. మా పెరట్లో జపాన్ మల్లె చాలా ప్రత్యేకం. ఒక పువ్వు ఇల్లంతా సువాసన వెదజల్లుతుంది.
హాయిగా.. చల్లగా..
‘ఇంట్లో పెంచిన మొక్కలు ఎంతో చల్లదనాన్ని ఇస్తున్నాయి. ఇల్లు విడిచి పోవాలంటే మనసొప్పదు’ అంటున్నాడు.. హనుమాన్నగర్కు చెందిన రిటెర్డ్ ఎస్ఐ అవునూరి సంపత్రావు. ఇల్లు కట్టుకునే సమయంలో మామిడి, జామ, సపోటా సహా వివిధ రకాల పూల చెట్లను పెంచడంతో ఇప్పుడు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన చెప్పారు. ఆరుబయట చెట్ల కింద కూర్చుంటే చల్లని వాతావరణం, స్వచ్ఛమైన గాలితో సమయం గడిచిపోతున్నదని చెప్పుకొచ్చారు.
చెట్ల నీడన..
మండల పరిధిలోని మనిమద్దె ఎక్స్రోడ్డు సమీపంలో సైదులు అనే వ్యక్తి ఇంట్లో పెంచుకున్న చెట్లు చూడ ముచ్చట గొల్పుతున్నాయి. నీడ కోసం నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగి ఇల్లంతా చల్లని వాతావరణం ఏర్పడింది.