రామగిరి, సెప్టెంబర్ 16 : జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే.. పిల్లలకు భవిష్యత్ నిర్దేశాన్ని చేసేది ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేందుకు సంసిద్ధులను చేసే బీఈడీ, బీపీఈడీ విద్యా వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. కాలేజీల్లో వసతులు, అధ్యాపకులు, ప్రయోగ శాలలు, నాణ్యమైన విద్య, కరోనా పరిస్థితుల్లో వేతనాలు అందుతున్నాయా, లేదా అనేది తేల్చేందుకు రంగం సిద్ధమైంది. 2021-22 విద్యా సంవత్సరానికి అప్లియేషన్ (గుర్తింపు) ఇచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఎన్సీటీఈ ఆదేశాల మేరకు వర్సిటీ అధికారుల నిపుణుల బృందం తనిఖీలకు రానున్నారు. ఇదే విషయాన్ని ఎంజీయూ పరిధిలోని కళాశాలలకు గురువారం మొయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. తనిఖీల అనంతరం వారిచ్చే నివేదిక ఆధారంగానే టీఎస్ ఎడ్సెట్-2021 కౌన్సిలింగ్లో కళాశాలలకు చోటుదక్కనున్నది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు 2021-22 విద్యా సంవత్సరానికి అప్లియేషన్స్(గుర్తింపు)ను ఇచ్చే అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్) సూచనల మేరకు వర్సిటీ అధికారుల నిపుణుల బృందంచే తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గురువారం కళాశాలకు మొయిల్ద్వారా సమాచారం అందజేశారు. బృందం నివేదికల మేరకే ‘టీఎస్ఎడ్సెట్-2021’ కౌన్సిలింగ్లో కళాశాలలకు చోటు దక్కనుంది. రాష్ట్రంలో ఉన్నతమైన విద్యా ప్రమాణాలు అందించే దిశగా అటు ప్రభుత్వం. ఇటు ఉన్నత విద్యామండలి ముందుకు సాగుతున్నది. గతంలో అస్తవ్యస్తంగా మారిన బీఈడీ విద్యను రాష్ట్ర ప్రభుత్వం గాడిలోకి తెచ్చే విధంగా వర్సిటీ అధికారులతో ఎంజీయూ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో విస్తృతంగా తనిఖీలు చేసింది. అధికారులు గతంలో వసతులు లేని కళాశాలలకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో 56 కళాశాలలకు వీటి సంఖ్య ప్రస్తుతం 30కి చేరగా మిగిలినవి మూతపడ్డాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా తనిఖీ లేకుండానే కండిషనల్(షరతులతో)అప్లియేషన్స్ జారీచేసిన ఎంజీయూ అధికారులు ఈ పర్యాయం మళ్లీ తనిఖీలు చేస్తుండడంతో నిబంధనల మేరకు వసతులు లేనివాటికి అప్లియేషన్స్(గుర్తింపు) ఇవ్వవద్దనే ఆలోచనతో అధికారులు ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఎంజీయూ పరిధిలో ఈనెల చివరి వార ంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు జరపనున్నట్లు విశ్వనీయ సమాచారం.
ఎంజీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 బీఈడీ, 6 ఫిజికల్ ఎడ్యుకేషన్( 4బీపీఈడీ, 2 డీపీఈడీ) కళాశాలలు ఉన్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 18, సూర్యాపేట జిల్లాలో 8, యాద్రాద్రి భువనగిరిలో 4 ఉన్నా యి. ఫిజికల్ ఎడ్యుకేషన్లో నల్లగొండ జిల్లాలో 4, సూర్యాపేట- 1, యాదాద్రి భువనగిరి- 1 ఉన్నాయి. బీఈడీ కళాశాలల విషయానికి వస్తే ఒక ప్రభుత్వ బీఈడీ కళాశాల ఉండగా మిగిలినవి ప్రైవేట్ కళాశాలలు. ఆయా కళాశాలల్లో 2015-16 నుంచి రెండేండ్ల బీఈడీ కోర్సు కొనసాగుతుండగా ఛాత్రోపాధ్యా యులు(విద్యార్థులు) శిక్షణ పొందుతున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈ పర్యాయం కూడా నిబంధనలు పాటించకుండా ఉన్న కళాశాలపై చర్యలు తీసుకుంటారా లేదా అనే చూడాల్సి ఉంది.
ప్రమాణాలపై కచ్చితంగా వ్యహరించిన ఎంజీయూ
ప్రభుత్వ ఆదేశాల మేరకు 2015-16లో బీఈడీ కళాశాలలకు అనుమతులు ఇచ్చే విషయంలో తెలంగాణలోని అన్ని వర్సిటీల కంటే ఎంజీయూ అధికారులు కచ్చితంగా వ్యవహరించి తనిఖీలు చేయడంతో 48 కళాశాలకు 34కు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ విషయంలో కళాశాల యాజమాన్యాలు రాజకీయ ఒత్తిడి తేవడంతో పాటు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అధికారులు నిబంధనల మేరకు కచ్చితంగా వ్యవహరించడంతో 14 కళాశాలలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూతపడ్డాయి. 2016-17లో మాత్రం 26 కళాశాలలు మాత్రమే తరగతులను నిర్వహించగా మిగిలినవి స్లీపింగ్లో ఉన్నాయి. తర్వాత 2017-18కి వీటి సంఖ్య 34కు వెళ్లింది. ప్రస్తుతం ఎంజీయూ పరిధిలో 2021-22 విద్యా సంవత్సరానికి 30 బీఈడీ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి.
పరిశీలించే అంశాలివే
కళాశాల భవన డాక్యుమెంట్స్
కళాశాలల సొసైటీ వివరాలు, సంబంధించిన పత్రాలు
ఎన్సీటీఈ ఇచ్చిన గుర్తింపు పత్రాలు
ల్యాబ్స్, గ్రంథాలయాలు, మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్
గవర్నింగ్బాడీ సమావేశాల రిజిస్ట్రర్
పీహెచ్డీ ప్రిన్సిపాల్ ఉన్నారా..లేదా ?
ప్రిన్సిపాల్, అధ్యాపకుల వివరాలు
అధ్యాపకులకు వేతనాలు చెల్లించిన రిజిస్ట్రార్
బ్యాంక్ అకౌంట్స్ ద్వారా వేతనాలు ఇస్తు న్నారా..లేదా అనే అంశం
విద్యార్థుల, అధ్యాపకుల హాజరు రిజిస్టర్స్
టీచింగ్ డైరీ, విద్యార్థుల రికార్డులు
కొవిడ్లో ఆన్లైన్ తరగతుల నివేదికలు
కొవిడ్ కాలంలో అధ్యాపకులకు చెల్లించిన వేతనాల వివరాలు
బయోమెట్రిక్ హాజరు మిషన్స్
ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తనిఖీలు
ప్రభుత్వ, ఎన్సీటీఈ, వర్సిటీ నిబంధనల మేరకు కొనసాగే కళాశాలలకు అప్లియేషన్స్ (గుర్తింపు) లభిస్తాయి. ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి ఆదేశాలమేరకు ఉన్నత విద్యాశాఖ సూచనతో ఆయా విభాగాల్లో నిపుణుల బృందంతో ఈనెల చివరి వారంలో తనిఖీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వ లక్ష్యాన్ని అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నాం.