హుజూర్నగర్ టౌన్, సెప్టెంబర్ 16 : పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని తాసీల్దార్ కార్యాలయంలో 45 మంది లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఆడబిడ్డల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తనపై నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రాజకీయాల్లో పోటీపడటం కాదు.. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. గతంలో ఇక్కడ పాలించిన నాయకులు అందుబాటులో లేక ప్రజలకు ఇబ్బందులు పడ్డారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనారవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు గురువయ్య, ఉపేంద్ర, జడ్పీటీసీ సైదిరెడ్డి, తాసీల్దార్ జయశ్రీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని వినతి..
మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఆ సంఘం నాయకులు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం..
హుజూర్నగర్ : పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సత్కరించారు. మూడేండ్లుగా నియోజకవర్గంలోని పశువైద్యశాలల్లో స్వచ్ఛందంగా పనిచేస్తున్న 15 మందికి సాగర్ సిమెంట్ యాజమాన్యం సహకారంతో ప్రతినెలా రూ. పదివేలు గౌరవ వేతనం ఇప్పించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు 17వ వార్డులో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. యాదవ్ బజార్లో అయ్యప్పయూత్ గణేశ్ కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో దళపతి, కౌన్సిలర్లు శంభయ్య, గురువయ్య, అమర్నాథ్రెడ్డి, అమర్ పాల్గొన్నారు.