ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో మాస్ వ్యాక్సినేషన్కు సిద్ధమైంది. నేటి నుంచి జిల్లాలోని ప్రతి సబ్ సెంటర్ పరిధిలో గ్రామాలు, ఆవాసాల వారీగా ప్రత్యేక కమిటీ వేసి 18 ఏండ్లు నిండి టీకా వేసుకోని వారి జాబితాను గుర్తించనున్నారు. జాబితా సిద్ధం కాగానే తేదీని ప్రకటించి ఆరోజు మాస్ క్యాంపు నిర్వహించి ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా ఇచ్చేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులంతా వ్యాక్సిన్ తీసుకుంటే ప్రత్యేకంగా రూపొందించిన స్టిక్కర్ను ఇంటికి అతికిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసేవారికి టీకా తప్పనిసరి చేశారు. ఒకవైపు టీకాపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూనే మరోవైపు ఆరోగ్య కేంద్రాలు దవఖానలతోపాటు సబ్ సెంటర్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా టీకాలు వేసి నూరు శాతం వ్యాక్సినేషన్ జిల్లాగా మార్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 4,93,763 మందికి టీకాలు వేశారు. అందులో 3,88,870 మందికి మొదటి డోసు, 1,04,893 మందికి రెండో డోసు టీకాలు వేశారు.
కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న వైద్యారోగ్యశాఖ జిల్లా అధికారులు వ్యాక్సిన్ పంపిణీపై ప్రధానంగా దృష్టి సారించారు. జిలాల్లో మొదటగా జనవరి 16న వ్యాక్సినేషన్ను మూడు కేంద్రాల్లో ప్రారంభించడం విదితమే. దశల వారీగా కేంద్రాల సంఖ్యను పెంచుతూ 44 కేంద్రాల్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు ఇస్తున్నారు. ప్రారంభంలో ప్రజల నుంచి సరైన స్పందన కొరవడిన నేపథ్యంలో టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అధికారులు, వైద్య సిబ్బంది పట్టణాల్లో, గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఫలితంగా పీహెచ్సీ, యూహెచ్సీ, ప్రధాన వైద్యశాలల ఎదుట ప్రజలు బారులు దీరారు. ఈ క్రమంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జిల్లా జనరల్ దవాఖానతోపాటు ఏరియా, పీహెచ్సీ, యుహెచ్సీల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుంది.
సబ్ సెంటర్ యూనిట్గా వ్యాక్సినేషన్…
నూరు శాతం లక్ష్యంగా జిల్లాలో గురువారం నుంచి మాస్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. గ్రామస్థాయిలో ఒక సబ్ సెంటర్ ఒక యూనిట్గా, పట్టణాల్లో వార్డు ఒక యూనిట్గా ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ను విజయవంతం చేయనున్నారు. గ్రామస్థాయి యూనిట్లో అశ కార్యకర్తలు, అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కమిటీ ఉంటుంది. పట్టణంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, అంగన్వాడీ, మెప్మా సిబ్బంది ఉంటారు. వీరు కాకుండా మరో నలుగురితో కూడిన కమిటీ బృందం ఇంటింటికీ తిరిగి డేటాను సేకరిస్తుంది. వ్యాక్సిన్ వేయించుకోని వారి వివరాలు సేకరిస్తారు. ఆ ప్రకారంగా అందరికీ వ్యాక్సిన్ వేశాక ఇంటికి ఒక స్టిక్కర్ అతికిస్తారు.
4,93,763 మందికి వ్యాక్సిన్..
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 44 వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా 4,93,763 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మూడు దఫాలుగా నిర్వహించిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో తొలి దశలో ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్లైన్ వారియర్స్కు మాత్రమే టీకాలు వేశారు. రెండో దశలో ఫ్రంట్లైన్ వారియర్స్, ఆరోగ్య కేర్ సిబ్బందితోపాటు 45సంవత్సరాలు దాటిన దీర్ఘకాలిక రోగులకు, 60సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సినేషన్ నిర్వహించారు. మూడో దశలో మొదటి, రెండో దశలో వేసుకోని వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. నాలుగో దశలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. మొదటి దశలో ఆరోగ్యకేర్, అంగన్వాడీలకు వ్యాక్సినేషన్ నిర్వహించారు. రెండోదశలో ఫ్రంట్లైన్ వర్కర్లకు, మూడో దశలో 45 సంవత్సరాలు దాటిన దీర్ఘకాలిక రోగులకు, 60 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. నాలుగో దశలో ఏప్రిల్ మొదటి వారం నుంచి 18 సంవత్సరాలు నిండిని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించారు.
సూర్యాపేట జిల్లాలో 2,97,907మందికి మొదటి డోస్, 1,00,655 మందికి రెండోడోస్ చొప్పున మొత్తం 3,98,562మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,72,898 మందికి మొదటి డోస్, 1,41,977మందికి రెండో డోసు ఇచ్చారు.
నూరు శాతం లక్ష్యంగా మాస్ వ్యాక్సినేషన్…
జిల్లాలో నూరు శాతం వ్యాక్సిన్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో గురువారం నుంచి మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నెలాఖరు వరకు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించాం. ఇందుకు గాను గ్రామ, పట్టణాల వారీగా సబ్సెంటర్ను యూనిట్గా నిర్ణయించి ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలతో ప్రత్యేక కమిటీలు కూడా వేశాం. 12.20లక్షల మంది టీకాకు అర్హులుగా గుర్తించగా అందులో ఇప్పటికే సుమారు 5లక్షల మందికి వ్యాక్సిన్ వేశాం. వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వస్తున్నందున ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి.
భువనగిరి కలెక్టరేట్ సెప్టెంబర్ 15 : కొవిడ్ వ్యాక్సిన్ అందరికీ అందించేలా సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి, జడ్పీ చైర్మన్ ఎలిమిటి సందీప్రెడ్డి తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని హైదరాబాద్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్, వరంగల్ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, సబ్ సెంటర్ల వారీగా వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు మిగిలిన వారి సహకారం కోరి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసిన వారికి ప్రశంసా పత్రాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్ దీపక్తివారీ, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి పాల్గొన్నారు.