పెన్పహాడ్, అక్టోబర్ 14 : ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజలు దగా పడితే, పోరాటాలు, ఆత్మబలిదానాల ఫలితంగా సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సుభిక్ష పాలన కొనసాగుతున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని జల్మాలకుంటతండాలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ అందించిన రూ.3లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటుకాకముందు తండాల పరిస్థితి దయనీయంగా ఉండేదని, అలాంటి తండాలు నేడు గ్రామ పంచాయతీలకు దీటుగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలే కాకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
పార్కును తలపించేలా ప్రకృతి వనం..
అనంతరం జల్మాలకుంటతండాలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన మంత్రి.. పట్టణంలోని పార్కును తలపించేలా పల్లె ప్రకృతి వనం ఉందని కితాబిచ్చారు. ఇంత తక్కువ ప్రదేశంలో ఇన్ని రకాల మొక్కలు, ఇంటీరియర్లో లాన్, వాకింగ్ రోడ్డు బాగుందన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఈ ప్రకృతి వనం దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వనంలో మొక్క నాటారు.
అనాథ పిల్లలకు అండగా ప్రభుత్వం..
అనాథ పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఉన్నత చదువులు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు. అనంతరం గిరిజన వృద్ధ మహిళలను ఆప్యాయంగా పలుకరించారు. పింఛన్ అందుతున్నదా? బతుకమ్మ చీర వచ్చిందా? అని వారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, సర్పంచ్ ధీరావత్ రేచల్నాగేందర్, సింగిల్విండో చైర్మన్ నాతాల జానకిరాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగంధర్, యూత్ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్గౌడ్, తూముల ఇంద్రసేనారావు, మండాది నగేశ్, మిర్యాల వెంకటేశ్వర్లు, పరెడ్డి సీతారాంరెడ్డి, గుర్రం అమృతారెడ్డి, బండి రామకృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ రవీందర్ పాల్గొన్నారు.
ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలి
శాసనమండలి మాజీ చైర్మన్ సుఖేందర్రెడ్డి
నల్లగొండ, అక్టోబర్14 : ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రజలకు గురువారం ఒక ప్రకటనలో విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన మహత్తర గొప్ప ఘట్టమే ఈ దసరా అని పేర్కొన్నారు. దర్గాదేవి ఆశీస్సులతో ఈ ఏడాది కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోవాలని, ప్రజల జీవనం మరింత మెరుగుపడాలని ప్రార్థించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.