నల్లగొండ, అక్టోబర్ 13 : పాలకవర్గ సభ్యుల సహకారం, ఉద్యోగుల కృషితో ఏడాదిలో రూ.900 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు నల్లగొండ డీసీసీబీ టర్నోవర్ సాధించిందని ఆ బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర బ్యాంకులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా రైతు రుణాలపై దృష్టి పెట్టి ఇప్పటి వరకు రూ.506 కోట్లు వారికే రుణ రూపంలో అందజేశామన్నారు. దీర్ఘకాలిక రుణాలు రూ.180 కోట్లు, బంగారు రుణాలు రూ.215 కోట్లు, గృహ, వ్యాపార రుణాలతోపాటు ఇతర రుణాలు మరో రూ.250 కోట్ల వరకు ఇచ్చినట్లు తెలిపారు. రైతులకు ఎంతో నమ్మకంగా ఉండే ఈ బ్యాంకులో రూ.470 కోట్లు డిపాజిట్ల రూపంలో వచ్చాయని, ఎంతో భద్రత కలిగిన లాకర్స్ ఉన్నాయని అన్నారు.
భూ మి తనఖాతో 200 మంది రైతు బిడ్డలకు విద్యా రుణాలిచ్చినట్లు తెలిపారు. దీర్ఘకాలిక అప్పులకు గతంలో ఎకరాకు రూ.2.50 లక్షల లిమిట్ ఉండ గా ప్రస్తుతం దానిని రూ. 5లక్షలకు పెంచినట్లు చెప్పారు. పంట రుణాలు గతంలో గరిష్ఠంగా లక్ష వరకు ఇవ్వగా ప్రస్తుతం దానిని రూ.3లక్షల వరకు పెంచినట్లు తెలిపారు. ఏడాది కాలంలో రూ.600 కోట్ల టర్నోవర్తో గ్రాస్ ప్రాఫిట్ రూ.11కోట్లు, నెట్ ప్రాఫిట్ రూ.6.5 కోట్లు ఉందని అన్నారు. ఉద్యోగులు బ్యాంకు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుండడంతో ఈ సారి ప్రతి ఉద్యోగికీ రెండు నెలల బోనస్ అందజేశామని తెలిపారు.
డీసీసీబీ పురోగతి బాగుంది
నాబార్డు సీజీఎం
నల్లగొండ డీసీసీబీ పురోగతి ఇటీవల బాగా పెరిగిందని నాబార్డు తెలంగాణ రీజినల్ సీజీఎం వై.కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ఆయన సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఎవరికి ఏయే రుణాలు ఇచ్చారు.. ఏ మేరకు ఇచ్చారు.. లాభ నష్టాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు రుణాలు ఇవ్వడంతోపాటు వ్యాపార రుణాలు సైతం పెంచుకుంటే బ్యాంకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డితో పాటు సీఈఓ మదన్ మోహన్, ఉద్యోగులు ఆయనను సన్మానించారు.