నల్లగొండ/సూర్యాపేట, ఆగస్టు 12: కృష్ణా, గోదావరి పరవళ్లు.. మంచి వర్షపాతం, నిండుకుండలా మూసీ జలాశయం.. వెరసి ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలం పైపైకి ఉబికివస్తున్నది. చెరువులు తొణికిసలాడుతుండడం.. రెండు, మూడు మీటర్లలోపే నీళ్లందుతుం డడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. భూగర్భ జల శాఖ తాజా నివేదిక ప్రకారం.. జూలై నెలాఖరున కృష్ణా పరీ వాహక ప్రాంతంలోని మఠంపల్లి మండలంలో 1.74,
దామరచర్ల మండలంలో 2.94 మీటర్లలోపే భూగర్భ జలాలు ఉండడం విశేషం. జిల్లా సగటును చూసినా నల్లగొండ జిల్లాలో 6.38, సూర్యాపేట జిల్లాలో 7.13 మీటర్ల దగ్గరే నీటి లభ్యత ఉంటున్నది.
కృష్ణా జలాల్లో నీటి కేటాయింపుల కారణంగా వస్తున్న నీటికి తోడు ఇటీవల కురుస్తున్న వర్షాలతో నల్లగొండ జిల్లాలో భూగర్భజలాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ వైపు చెరువుల్లోకి నీరు చేరి నిండుకుండలా మారుతుంటే మరో వైపు భూగర్భజలాలు ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో అన్నదాతల్లో ఆనందం పెల్లుబుకుతోంది. వానకాలం ఆరంభంలో నీటి నిల్వలను పరిశీలిస్తే మూడు మీటర్ల లోపే జలాలు ఉన్నాయంటే ఏ మేరకు పెరిగాయనేది తెలుస్తుంది. దామరచర్లలో అత్యల్పంగా 2.94 మీటర్లలోపే భూగర్భజలాలు ఉండగా గరిష్ఠంగా చందంపేట మండలంలో 12.43 మీటర్లలోపే ఉన్నాయి. జిల్లాలో సగటును పరిశీలిస్తే 6.38 మీటర్లలోపే ఉంది. భూగర్భజలాలకు తోడు ఇటీవల కురిసిన వర్షాలతో ఉమ్మడి జిల్లాలో 4,160 చెరువులకు ఇప్పటి వరకు 685 చెరువుల్లో 75శాతం నుంచి 100శాతం నీటి నిల్వలు చేరుకున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి నీటి నిల్వలు బాగా పెరిగినట్టు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ప్రధానంగా కృష్ణా నది సమీపంలో ఉన్న దామరచర్లలో 2.94 మీటర్లలోపే నీళ్లు ఉండటం గమనార్హం. గుర్రంపోడులో 3.49 మీటర్లు, కొండమల్లేపల్లిలో 3.96, పీఏపల్లిలో 4.62, మాడ్గులపల్లిలో 3.35, మిర్యాలగూడలో 3.14, తిరుమలగిరి సాగర్లో 4.75, త్రిపురారంలో 4.62, వేములపల్లిలో 3.75, కనగల్లో 3.24 , మునగోడులో 3.68, నకిరేకల్లో 4.15, నల్లగొండలో 4.44, తిప్పర్తిలో 3.90 మీటర్లలోనే భూగర్భజలాలు ఉన్నాయి. నాన్ ఆయకట్టులోనూ ఈసారి నీటికి ఇబ్బంది ఉండదు. 16 మండలాల్లో 10మీటర్లలోపే భూగర్భజలాలు ఉండగా, చందంపేట, చిట్యాలలో 10మీటర్ల కింద ఉన్నాయి.
గత నెలలో భారీ వర్షాలు కురిసిన కారణంగా ఈసారి ఈ భూగర్భజలాలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా సగటు నీటి నిల్వలు 6.38 మీటర్లలోపే ఉండగా గతేడాది 10.72 మీటర్ల కింద ఉన్నాయి. గతంలో మర్రిగూడలో 30, చండూర్, నాంపల్లిలో 20 మీటర్లలో భూగర్భజలాలు ఉండగా ఈసారి చిట్యాలలో 10.48, చందంపేటలో 12.43 మీటర్ల లోతున నీరు ఉన్నది. ఇక అన్ని మండలాల్లో ఆ లోపే ఉండడం గమనార్హం.
ఉమ్మడి జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన కురిసిన వర్షాల కారణంగా నీరు విడుదల చేస్తుండటంతో చెరువుల్లోకి క్రమంగా నీటి నిల్వలు చేరుకుంటున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుతోపాటు మూసీ నిండటంతో ఆ ప్రాజెక్టు పరిధిలోని చెరువుల్లోకి భారీగా నీరు చేరుకుంటున్నది. ఉమ్మడి జిల్లాలో 4,160 చెరువులుండగా 685 చెరువుల్లో వంద శాతం నీరు చేరిందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. మరో 1,550 చెరువుల్లో 75శాతం మేర నీరు చేరినట్లు చెబుతున్నారు. ప్రధానంగా నల్లగొండ జిల్లాలోనే నాగార్జునసాగర్, మూసీ ప్రాజెక్టుల మూలంగా ఎక్కువ సంఖ్యలో చెరువులు నిండాయి.
ఈ ఏడాది ప్రారంభంలో జిల్లాలో మంచి వర్షాలు కురిశాయి. దీనికి తోడు కాళేశ్వరం జలాలు జూలైలోనే జిల్లాకు చేరాయి. ఇక మూసీ ఉగ్రరూపం దాల్చి డ్యామ్ పూర్తిగా నిండి కాల్వలతోపాటు దిగువకు నీటిని వదిలారు. దీంతో జిల్లాలో భూగర్భజలాలు పెరుగుతున్నాయి. గత నెలతో పోల్చితే ఈ నెలలో 1.66 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 4.61 మీటర్ల లోతునే జలాలు ఉన్నాయి. జూన్లో 6.27 మీటర్ల లోతులో ఉన్న జలాలు జూలై నాటికి 4.61 మీటర్లకు చేరాయి. ఆగస్టు చివరినాటికి ఇంకా పైకి వచ్చే అవకాశం ఉన్నది. జూన్లో 93.7మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం కురవాల్సి ఉండగా 133 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జూలైలో 196.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 271.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 38 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు సుమారు 230 చెరువులు అలుగులు పోశాయి. దీనికి తోడు జూలై 15 నాటికే జిల్లాకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలు వచ్చాయి. దీంతో మూడు నియోజక వర్గాల్లోని చెరువుల్లో నీరు చేరడంతో భూగర్భ జలాలు మరింత పైకి చేరాయి.
జిల్లాలో మండలాల వారీగా జూలై 30నాటి లెక్కల ప్రకారం భూగర్భ జలాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట డివిజన్ పరిధిలో 5.01 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా కోదాడ డివిజన్ పరిధిలో 3.90 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి. అనంతగిరి 2.36 మీటర్లు, చిలుకూరు 2.05, చింతలపాలెం 4.30, హుజూర్నగర్ 2.32, కోదాడ 2.70, మఠంపల్లి 1.74, మేళ్లచెర్వు 4.34, మునగాల 3.02, నడిగూడెం 3.15, ఆత్మకూర్(ఎస్) 3.83 , చివ్వెంల 2.96, గరిడేపల్లి 3.22, జాజిరెడ్డిగూడెం 5.27, మద్దిరాల 5.08, మోతె 2.10, నాగారం 3.58, నేరేడుచర్ల 3.56, నూతనకల్ 7.02, పాలకవీడు 7.05, పెన్పహాడ్ 4.19, సూర్యాపేట 7.13, తిరుమలగిరి 6.82, తుంగతుర్తి 4.20 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి. ఆగస్టు చివరి నాటికి మరో రెండు నుంచి మూడు మీటర్ల పైకి భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉన్నది.