టీఆర్ఎస్తోనే సాగర్లో అభివృద్ధికి బాటలు
భవిష్యత్ ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరిస్తారు
14 న సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం
టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్11(నమస్తే తెలంగాణ) : హాలియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభ విశేషాలపై టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలివి..
నమస్తే : ముఖ్యమంత్రి కేసీఆర్తో సభ ఏర్పాటు ఆవశ్యకత ఏమిటి..?
తక్కెళ్లపల్లి : అత్యధిక కాలం మంత్రిగా, ఎమ్మెల్యేగా చేసిన కాంగ్రెస్ ముఖ్య నేత హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతంతే. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలోనే సాగర్ అభివృద్ధికి బాటలు పడ్డాయన్నది నిజం. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, ఉచిత కరెంటు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు.. ఇలా ఎన్నో పథకాలు ప్రజల ముంగిటకు చేరాయి. ఇంకా ఇక్కడ వేలాది ఎకరాల చివరి భూములకు సాగునీరు అందాల్సి ఉంది. దీంతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సాగర్ ప్రజలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్తో సభ నిర్వహించాలని భావించాం. సభ ద్వారా నాగార్జునసాగర్ అభివృద్ధిపై మరింత స్పష్టత ఇవ్వాలన్నది పార్టీ లక్ష్యం. ఇన్నాళ్లూ నియోజకవర్గ వెనుకబాటుకు కారణాలు, స్వరాష్ట్రంలో చేపట్టిన దిద్దుబాటు చర్యలు, అభివృద్ధిపై టీఆర్ఎస్కు ఉన్న ప్రణాళికలను సభ ద్వారా ప్రజలకు వివరిస్తాం.
నమస్తే : బహిరంగ సభ నిర్వహణ, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
తక్కెళ్లపల్లి : ఈ నెల 14న సాయంత్రం నాలుగు గంటల సభ ప్రారంభం అవుతుంది. పెద్దవూర రోడ్డులోని ఐటీఐకి ఎదురుగా విశాలమైన స్థలంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 20ఎకరాల్లో సభాస్థలం, మరో 30ఎకరాల్లో పార్కింగ్ ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నాం. సభాస్థలంలో ప్రధాన వేదిక, కళాకారుల వేదిక, వివిధ గ్యాలరీల నిర్మాణం చకచకా జరుగుతున్నాయి. ఇవ్వాళ, రేపటి లోగా అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
నమస్తే: ఎండవేడిమి, కొవిడ్ నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఎమిటి?
తక్కెళ్లపల్లి : కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. సభకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్, శానిటైజర్ వినియోగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందరికీ తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నాం. సాయంత్రం నాలుగు గంటల తర్వాతనే సభ ప్రారంభం కానుంది. సభను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
నమస్తే: సభకు ఎంతమంది రావచ్చని అంచనా వేస్తున్నారు?
తక్కెళ్లపల్లి : సీఎం రాక కోసం సాగర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తుంటే భారీగా తరలొచ్చే అవకాశాలు ఉన్నాయి. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం ప్రతి గ్రామం నుంచి కనీసం 60నుంచి 70శాతం జనం సభకు వస్తారని అంచనా. వివిధ పథకాల లబ్ధిదారులే 1.53లక్షల మంది ఉన్నారు. వీరంతా స్వచ్ఛందంగా సభకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇవి కూడా చదవండి
స్మగ్లర్ల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి