ముషీరాబాద్:నాగుల పంచమిని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు అత్యంత పవిత్రంగా కొలిచే నాగుల పంచమి పర్వదినం సందర్భంగా నాగదేవత ఆలయాలు, పుట్టల వద్ద మహిళలు పాలుపోయడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి మహిళలు అమ్మవారి ఆలయాలు, పాముల పుట్టల వద్దకు చేరుకొని పుట్టలో పాలు పోసి, పూలు, నైవేధ్యాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ముషీరాబాద్ డివిజన్ గంగపుత్ర కాలనీలో నాగదేవత ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, సుధాకర్ గుప్త, గోవింద్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాంనగర్ రామాలయం, లలితానగర్ గండమ్మ దేవాలయాల్లో నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.