57ఏండ్లు దాటిన వృద్ధులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో అర్హులున్నా గడువులోగా దరఖాస్తు చేసుకోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరోమారు గడువు పొడిగించింది. వేలాది మంది పేదల కుటుంబాల్లో ఆసరా ఆర్థిక వెలుగులను నింపనున్నది. ఈనెల చివరి వరకు గడువు పొడిగించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : పేదల కుటుంబాల్లో ఆసరా పథకం ఆర్థిక కష్టాలను తీర్చుతున్నది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఎయిడ్స్, పైలేరి యా వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం ప్రతి నెలా పిం ఛన్ అందజేస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన త ర్వాత వితంతువులకు గతంలో రూ.200 ఉన్న పింఛన్లను రూ.1000, వికలాంగులకు రూ. 500 నుంచి రూ.1500 పెంచారు. 2018 ఎన్నికల తర్వాత వృద్ధులు, వితంతువులకు రూ. 1000 నుంచి రూ.2,016, వికలాంగులకు రూ.1,500 నుంచి రూ.3,016 చొప్పున పెం చారు. అయితే, వృద్ధులకు పింఛన్ అర్హతకుగానూ పింఛన్ వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకుంటున్నారు. ఇందుకుగానూ గత నెలలో 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. దీంతో 57 ఏండ్లు దాటిన వేలాది మంది మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో మీ సేవ కేంద్రాలకు బారులు తీరుతుండడంతో ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించాలని విన్నవించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సీఎం తాజాగా ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తుల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వేలాది మంది దరఖాస్తులు చేసుకొన్నారు. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువు పొడిగించడం విశేషం. మీ సేవ కేంద్రా ల్లో దరఖాస్తులు కూడా ఉచితంగానే చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ఆసరా పింఛన్లతో పేదల్లో ముఖ్యంగా వృద్ధుల్లో ఆర్థిక కష్టాలు తీరాయి. సమైక్య రాష్ట్రంలో గ్రామంలో ఎవరో ఒకరు చనిపోతేనే కొత్త వారికి పింఛన్ ఇచ్చే పరిస్థితలు ఉండేవి. ఇప్పుడు అర్హులందరికీ ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లోని వృద్ధులు చికిత్సలకు, మందులకు, ఇతర ఖర్చులకు కుటుంబ సభ్యులపై ఆధారపడే పరిస్థితులు దూరమయ్యాయి. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ఈ పింఛన్ డబ్బులు జమ అవుతుండడంతో దళారులు, కుటుంబీకుల ప్రమేయం లేకుండా పోయింది. నేరుగా అర్హులే పింఛన్లను తీసుకొంటూ ఆసరా పొందుతున్నారు. కాగా, నాగర్కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 98,100 మంది పింఛన్దారులు ఉన్నారు. ఇందులో 39,737 మంది వృద్ధులు, 40,984 మంది వితంతువులు, 12,711 మంది దివ్యాంగులు, 3,663 మంది ఒంటరి మహిళలు, 722 మంది గీత కార్మికులు, 239 మంది చేనేత, 23 మంది బీడీ కార్మికులు, 11 మంది పైలేరియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 2019 జనవరిలో వెల్లడించిన ఓటరు జాబితా ప్రకారం 9,542 మంది అర్హులుగా ఉంటారని అంచనా వేశారు. కాగా గత నెలలో 18 వేల మందికిపైగా ప్రజలు వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వం దరఖాస్తు గడువు పొడిగించడంతో లబ్ధిదారుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది.