చిలిపికృష్ణుడి చిద్విలాసం
యాదాద్రిలో అంగరంగ అలంకారసేవలు
ఉదయం వటపత్రశాయి.. సాయంత్రం పొన్నవాహన సేవ
యాదాద్రి, మార్చి 19 : ఆబాలగోపాలం అలరించేలా యాదాద్రి లక్ష్మీ నరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అలంకార సేవల్లో భాగంగా ఐదోరోజైన శుక్రవారం స్వామివారు ఉదయం వటపత్రశాయి అలంకార సేవలో, రాత్రి కల్పవృక్ష సమాన బాసుడై పొన్న వాహనంపై బాలాలయంలో ఊరేగారు. తొలుత బాలాలయంలో వేకువజామున ద్వారతోరణ పూజ, ధ్వజకుంభారాధన, అగ్ని ఆరాధన, మూలమంత్ర, పంచసూక్త హవనం పూజలను ఆలయ ప్రధానార్చకులు, యాజ్ఞీకులు, రుత్వికులు, పారాయణీకులు, అర్చక బృందం వైభవంగా నిర్వహించి నిత్య పూర్ణాహుతి చేపట్టారు. అనంతరం దేవదేవుడిని వటపత్రశాయి అలంకారంలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించారు. రుత్వికులు, వేదపండితులు స్వామివారి అలంకార సేవ ముందు దివ్య ప్రబంధ వేద పారాయణాలు, మూలమంత్రజపాలు చేశారు. అనంతరం డోలు సన్నాయి, మేళాలతో స్వామివారిని మంగళకరమైన వాయిద్యాలతో ఊరేగించారు. వటపత్రశాయి విశిష్టతను భక్తులకు ప్రధానార్చకులు వివరించారు. వటపత్రశాయి అనగా మర్రి ఆకుపై శ్రీస్వామి, అమ్మవారికి సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తకోటికి దర్శింపజేయడం.
కరార విందేన పదార విందం ముఖార విందే వినివేశయంతంవటస్య పత్రస్య పుటే శయానంబాలం ముకుందం మనసాస్మరామివటపత్రంపై శయనించి పద్మం వంటి చేతితో బొటనవేలిని నోట్లో పెట్టుకొని చిద్విలాసం చేస్తున్న బాలగోపాలుడికి భక్తిపూర్వక నమస్సులంటూ బాల ముకుందాష్టకం చిన్ని కృష్ణుడిని వర్ణిస్తుంది. భాగవతంలో శ్రీకృష్ణుడి శయన భంగిమ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. అందుకే వటపత్రం (మర్రి చెట్టు ఆకు) పై శయనించిన ముకుందుడిని కొనియాడుతూ ఎన్నో భక్తిపూర్వక కీర్తనలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వటపత్రంపై శయనించి సేవలందుకున్నాడు.
పొన్నవాహన సేవలో శ్రీవారు
లోకకల్యాణార్థం అవతరించిన శ్రీమహా విష్ణువు అవతార రూపాల్లో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో దివ్య వాహన సేవలు అందుకుంటున్నారు. రాత్రి బాలాలయంలో స్వామిని పొన్న వాహనసేవలో అలంకరించి ఊరేగించారు. మండపంలో స్వామివారి సేవను అధిష్టించి వేదమంత్రాలు పఠించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనారసింహచార్యులు, ఆలయ అధికారులు భాస్కరశర్మ, శ్రవణ్కుమార్, రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రికి కుంభమేళా జలాలు
శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కుంభమేళా గంగా జలాలను స్వామివారికి సమర్పించారు. సుమారు రెండునెలల క్రితం యాదాద్రి నుంచి సైకిల్యాత్రను ప్రారంభించి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నుంచి గంగా జలాలను తీసుకొచ్చినట్లు యాత్రికుడు గౌరీశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవిరళ కృషితోనే యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్నదన్నారు. కుంభమేళాలో భాగంగా నాగసాధువులు చేసిన ప్రాంతం నుంచి గంగా జలాలు తెచ్చినట్లు చెప్పారు.