కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్లోని వ్యర్థాల వినియోగం
స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యం
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
హన్మకొండ, ఏప్రిల్ 10 : స్మార్ట్సిటీలో భాగంగా వరంగల్లో త్వరలో బయోగ్యాస్, బయోమాన్యుర్ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస గృహంలోని క్యాంపు కార్యాలయంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సీనియర్ సైంటిస్టుల బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లలో కూరగాయలు, పండ్లు, పూల వ్యర్థాలను వినియోగించి ఈ ప్లాంట్ ద్వారా బయోగ్యాస్, బయోమాన్యుర్లను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.
ఇలాంటి వ్యర్థాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లడమే కాకుండా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. వివిధ మార్కెట్ల నుంచి ఈ వ్యర్థాలను సేకరించి ఈ ప్లాంట్లో ఉపయోగించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించాలన్నదే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఒక్కో ప్లాంట్లో 10 టన్నుల వరకు వినియోగించి బయోగ్యాస్, బయోమాన్యుర్ ఉత్పత్తి చేస్తారన్నారు. ఒక ప్లాంట్కు రూ.5కోట్ల దాకా ఖర్చవుతుందని దీనికోసం స్మార్ట్సిటీ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఐసీటీ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ను నెలకొల్పనున్నట్లు వినోద్కుమార్ తెలిపారు. ఈ విషయంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, వరంగల్ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ భేటీలో ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్తలు ఎన్వీ సత్యనారాయణ, ఏ గంగాగ్నిరావు, సాంకేతిక ప్రతినిధులు సీహెచ్ సతీశ్రావు, కేఎల్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
రోడ్డు ప్రమాదంలో 10 మంది భక్తులు మృతి
ఐపీఎల్లో ఫ్రాంచైజీలకు ఆదాయం ఎలా వస్తుంది?