నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే గండ్ర
ట్రయల్ రన్ విజయవంతం
ఇటు రంగాయ చెరువు నుంచి దబ్బవాగుద్వారా పాకాల సరస్సులోకి నీటి రాక
రామప్ప వద్ద ఎమ్మెల్యే గండ్ర, పాకాల వద్ద ఎమ్మెల్యే పెద్ది పూజలు
పసుపు, కుంకుమ సమర్పించిజలాలకు ఘన స్వాగతం
నీటి వేడుకకు భారీగా తరలివచ్చిన ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 10 (నమస్తేతెలంగాణ)/వెంకటాపూర్/ఖానాపురం : దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప చెరువు నుంచి 0.2 ఫీడర్ చానల్ వద్ద ఏర్పాటు చేసిన గేట్లను ఎత్తి గోదావరి జలాలను జలవనరుల శాఖ అధికారులు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం విడుదల చేసి పసుపు, కుంకుమ సమర్పించి పూజలు చేశారు. అక్కడి నుంచి భూపాలపల్లి జిల్లా గణపసముద్రం చెరువులోకి పరుగులు తీశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనతి కాలంలోనే ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తుంటే ప్రతిపక్షాలకు అక్కసుగా మారిందని దుయ్యబట్టారు. తుపాలకుల గూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క బరాజ్తో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లికి సాగు నీటితో పాటు తాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. రామప్ప చెరువు నుంచి సుమారు 5కిలోమీటర్ల మేర చేపట్టిన గ్రావిటీ కెనాల్ పనులను రూ.10కోట్ల అంచనా వ్యయంతో 2018లో ప్రారంభించామని, 96శాతం పూర్తయ్యాయని, త్వరలో అన్ని మొత్తం పూర్తవుతుందని చెప్పారు. గోదావరి జలాలను గణపసముద్రంలోకి తరలించడం ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 24వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, తాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు.
కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు త్వరలోనే నష్ట పరిహారం అందుతుందని, అవసరమైన చోట ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతామని చెప్పారు. యాసంగి సాగుకు నీరందించాలని చూస్తుంటే విడుదలను అడ్డుకోవాలని చూడడం సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని, అయినా ములుగు ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చామని, ఆమె నాగార్జునసాగర్లో ఉన్నారని, ప్రొటోకాల్ పేరిట నీటి విడుదలకు అడ్డుపడడం ఏం పద్ధతని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు లేక పంటలు ఎండి పోతుంటే ప్రతి పక్షాలు రాజకీయం చేయడం హాస్యాస్పదమన్నారు. పనులన్నీ పూర్తయ్యాక మంత్రులను ఆహ్వానించి, అందరినీ పిలిచి ఘనంగా ప్రారంభోత్సవం చేసుకుందామని, ప్రతి దానిని రాజకీయం చేయొద్దని హితవుపలికారు. దేవాదుల ద్వారా ఉమ్మడి జిల్లాకు సాగునీటి కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నీటి విడుదల వేడుకకు టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. గోదావరి నీటి రాకను చూసి ఆనందంతో కేరింతలు కొట్టారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గెం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఎంపీపీ బుర్ర రజిత, జడ్పీటీసీలు గై రుద్రమదేవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరెళ్ల రామాచారి, ఇరిగేషన్ ఎస్ఈ సుధీర్, ఈఈ రమణారావు పాల్గొన్నారు.
పాకాలకు గోదావరి జలాల రాకతో జన్మసార్థకమైంది : ఎమ్మెల్యే పెద్ది
పాకాలకు గోదావరి జలాలను తీసుకురావడంతో చిరకాల స్వప్నం నెరవేరి తన జన్మసార్థకమైందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మొదట నల్లబెల్లి మండలంలో రంగాయచెరువు సంప్హౌస్ వద్ద పాకాలకు చేరుకునే గోదావరి నీటిని ఎమ్మెల్యే పరిశీలించారు. కీర్యతండా శివారులోని దబ్బవాగు నుంచి పాకాలకు చేరిన గోదావరి జలాలకు ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, జడ్పీ వైస్ ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారులతో కలిసి ముందుగా దబ్బవాగు వద్ద, తర్వాత పాకాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు పాకాల ఆయకట్టు రైతులకు శుభదినమన్నారు. సీఎం కేసీఆర్ కృషితో ఈ ప్రాంత రైతుల ఎన్నో ఏళ్ల కలను నిజం చేసుకున్నామన్నారు. పాకాల ఒడిలోకి గోదారమ్మ తల్లి చేరిందని, తన జీవితంలో ఇంత కన్నా సంతృప్తి మరొకటి లేదని సంబురపడ్డారు. 70 ఏళ్లు పాలించిన వారు ఏ నాడూ పాకాలను పట్టించుకోలేదని, ఎవరూ అడుగకున్నా కేసీఆర్ దయతో పాకాల ప్రాజెక్టును సాధించుకున్నామని చెప్పారు. రామప్ప -రంగాయ, రామప్ప-పాకాల ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. రామప్ప వద్ద పంప్హౌస్ల నుంచి రెండు ప్రాజెక్టులను సమాంతరంగా డిజైన్ చేశామన్నారు. ప్రస్తుతం రంగాయచెరువు ప్రాజెక్టు పూర్తవడంతో పాకాలకు గోదావరి జలాలను తీసుకువస్తున్నామని తెలిపారు.
రామప్ప -పాకాల ప్రధాన ప్రాజెక్టు పూర్తిదశకు చేరిందని, డ్రైరన్ పూర్తయిందని వచ్చే నెలలో ట్రయల్ రన్ పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్టును ప్రారంభించుకుందామని చెప్పారు. పాకాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీలు, రంగాయచెరువు ప్రాజెక్టుకు రెండు టీఎంసీల గోదావరి నీటిని ఏటా తరలించుకుని వాడుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం రంగాయచెరువు ద్వారా పాకాలను 0.20 టీఎంసీ నీటితో నింపుతున్నట్లు తెలిపారు.
పంట కాలువల మరమ్మతుల కోసం నిధులు తెస్తానని, మంగళవారిపేట, దబీర్పేట, బుధరావుపేటలో భూములకు అదనంగా నీటి సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, నర్సంపేట మార్కెట్ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, రైతు బంధు మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య, సర్పంచ్లు హఠ్య, ప్రవీణ్కుమార్, రమేశ్నాయక్, గొర్రె కవిత, వైస్ ఎంపీపీ రామసాయం ఉమారాణి, రైతుబంధు తుంగబంధం కన్వీనర్ వీ కిషన్రావు, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, కిషన్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జాబ్ పేరుతో హోటల్కు తీసుకువెళ్లి మహిళపై లైంగిక దాడి!
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం