నిత్యం బ్లాస్టింగ్లు.. దుమ్ము ధూళితో నరకం అనుభవిస్తున్నం
న్యాయం చేయాలని అధికారులను వేడుకున్న భూ నిర్వాసితులు
20 రోజులు సమయం ఇవ్వండి.. న్యాయం చేస్తాం : ఆర్డీవో
తాడిచెర్లలో భూ నిర్వాసితులతో అధికారుల భేటి
మల్హర్, ఏప్రిల్ 9 : ‘కంపెనీ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనుకున్నం. మా బతుకులు బాగు పడ్తయని ఆశపడ్డం. ఎంతో ఊహించుకున్నం. కానీ, ఇందులో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఇప్పుడు చావలేక బతుకుతున్నం. నిత్యం బ్లాస్టింగ్లు, దుమ్ము ధూళితో శ్వాస ఆడక చస్తున్నాం. ఏదో ఒకటి చేసి మాకు ఉద్యోగాలు ఇప్పించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పునరావాస కాలనీకి తరలించండి..’ అంటూ తాడిచెర్ల జెన్కో భూ నిర్వాసితులు గగ్గోలు పెట్టారు. మండలంలోని తాడిచెర్ల జీపీలో శుక్రవారం భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెన్కో సీఈ పెద్దయ్యతో నిర్వాసితులు సమావేశమయ్యారు. ముందుగా భూ నిర్వాసితులు తాము పడుతున్న బాధను వివరించారు. 2008లో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా డేంజర్ జోన్లో ఉన్న ఇండ్ల సేకరణతో పాటు జెన్కోలో 1,315 మందికి శాశ్వత ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామని మాట ఇచ్చారని, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నౌకరి ఇవ్వలేదన్నారు. అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా వర్తింపచేయలేదని వాపోయారు. జెన్కో అధికారులు వచ్చి గ్రామంలోని 1083 ఇండ్లను తీసుకుని నంబర్లు కేటాయించారని, తమ అందరికీ పునరావాసం, నష్ట పరిహారం వస్తుందనుకున్నామన్నారు. కానీ, ఇప్పటికీ ఏ ఒక్క ఇల్లును కూడా తీసుకోలేదని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తమకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇతర ప్రాంతాల కార్మికులతో పనులు చేయించడం అన్యాయమన్నారు. స్పందించిన ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ కొద్దిరోజులు సమయం ఇస్తే ఏఎంఆర్ కంపెనీ అధికారులతో మాట్లాడి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. డేంజర్ జోన్ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద వరకు ఉన్న 359.2 ఎకరాలు, మిగులు భూములు తీసుకునేందుకు జెన్కో సంస్థ నుంచి తమకు రెండో రోజుల క్రితమే ప్రతిపాదనలు వచ్చాయని, త్వరలోనే ఆ సర్వే పనులు పూర్తి చేస్తామన్నారు.
పది రోజుల్లో ఇండ్ల సేకరణపై పనులు మొదలు పెట్టి, ఆరు నెలల్లో నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జెన్కో సీఈ సిద్ధయ్య మాట్లాడుతూ తమకు 20 రోజులు సమయం ఇస్తే స్థానికులకు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో ఆ వివరాలు అన్ని సేకరిస్తామన్నారు. ఇకపై తమ పర్యవేక్షణలోనే కంపెనీలో ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు. ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి జోక్యం చేసుకొని ఏఎంఆర్ కంపెనీ అధికారులు ప్రజాప్రతినిధులతో అమర్యాదగా ప్రవర్తిస్తూ లెక్క చేయడం లేదన్నారు. కార్యక్రమంలో సీఈ మూర్తి, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ సుంకరి సత్తయ్య, సింగిల్ విండో చైర్మన్ చెప్యాల రామారావు, మాజీ జడ్పీటీసీ శీల లక్ష్మయ్య, నిర్వాసితులు కోట రవి, ప్రకాశ్రావు, బండి రాజయ్య, దండు రమేశ్, అక్కపాక సమ్మయ్య, ఇందారపు చంద్రయ్య, గుమ్మడి రవి, రాజయ్య, బండి స్వామి, మార్క్, ఆర్ని సత్యనారాయణ, కేసారపు చంద్రయ్య, నిర్వాసితులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఏపీలో కొత్తగా 2,765 కరోనా కేసులు