-వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమసింగ్
మెదక్, సెప్టెంబర్ 13: జిల్లాలో గణేశ్ నిమజ్జనం శాంతియుత వాతావరణంలో సజావుగా జరిగేలా అధికారులందరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమసింగ్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి కోరారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమసింగ్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 2,124 గణేశ్ మండపాలను ఏర్పాటు చేశారని, ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు వినాయక నిమజ్జనం జరిగే అవకాశము న్నందున శోభాయాత్ర మొదలుకొని నిమజ్జనం జరిగే వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 5 ఫీట్ల లోపు 909 విగ్రహాలు, 6 ఫీట్ల పైన 1215 విగ్రహాలు ఉన్నాయని, నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు తగలకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
నిమజ్జన ప్రదేశాల్లో, చెరువు కట్టలపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయుటకు అవసరమైన విద్యుత్ లైనింగ్, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని విద్యుత్ శాఖాధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు, గ్రామాల్లో, గ్రామ పంచాయతీలు లైటింగ్ ఏర్పాట్లు చూడాలని, అవసరమైతే జనరేటర్ను సమకూర్చుకోవాలన్నారు. శోభాయాత్ర, నిమజ్జనం, ట్రాఫిక్పై ప్రజలను అప్రమత్తం చేయుటకు పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఈ సంవత్సరం భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండుగా ఉన్నందున మెదక్లోని కొంటూర్, నర్సాపూర్లోని రాయిన్చెరువు, చేగుంట చెరువు, తూప్రాన్ చెరువు తదితర అవసరమైన ప్రాంతాల్లో భారీ కేడింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్అండ్బీ ఈఈకి సూచించారు. అదే విధంగా అవసరమైన ప్రాంతాల్లో క్రేన్లు ఏర్పాటు చేయడంతో పాటు మెకానిక్, అదనపు డ్రైవర్ను సమకూర్చుకోవాలన్నారు. పట్టణాల్లో పెద్ద పెద్ద చెరువుల దగ్గర నలుగురికి తగ్గకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో మత్స్యసహకార సంఘాల ద్వారా అవసరమైన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ సహాయ సంచాలకులకు సూచించారు. అలాగే ప్రథమ చికిత్స అందించుటకు ఫస్ట్ ఎయిడ్, అంబులెన్సులు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్వోకు సూచించారు. వర్షాలు పడే అవకాశమున్నందున షామియనాలు, తాగునీటి సదుపాయం, దాతల సహకారంతో పులిహోర ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
మండల కేంద్రాలు, గ్రామాల్లో నిమజ్జనం కార్యక్రమం సజావుగా నిర్వహించుటకు తగు ఏర్పాట్లకోసం తహసీల్దార్లు, ఎంపీడీవో, పోలీసు అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేసుకొవాలని సూచించారు. అనంతరం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో మాట్లాడుతూ మండల అధికారులు సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకొని ఎటువంటి ప్రమాదాలు, సంఘటనలు జరగకుండా నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఇందుకోసం సంబంధిత శాఖల సిబ్బందిని అవసరమైన ప్రాంతాలకు పంపిస్తామని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్కుమార్, ఆర్అండ్బీ ఈఈ శ్యాంసుందర్, విద్యుత్ శాఖ డీఈ కృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.