మెదక్, (నమస్తే తెలంగాణ)/ అందోల్, అక్టోబర్ 3: దసరా పండుగకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లోని షాపింగ్ మాళ్లు, వ్యాపార కేంద్రాల్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. వస్త్ర, బంగారం, రెడీమేడ్ దుకాణాలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించడానికి వ్యాపారులు ప్రత్యేక గిఫ్ట్ ఆఫర్లు, డిసౌంట్లు అందిస్తున్నారు. పూలు, పండ్లకూ భలే గిరాకీ ఉంది. బతుకమ్మ వేడుకలు మరింత శోభను తెచ్చిపెట్టాయి. యువత ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్పై ఆసక్తి చూపుతున్నది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, మైత్ర, టాటా, జియో వంటి సంస్థలు ఆన్లైన్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో జిల్లావాసులు ఆన్లైన్ కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.
క్యాష్ బ్యాక్ ఆఫర్లు, సులభ వాయిదాలతో దుస్తులు, మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. జ్యువెల్లరీ దుకాణాలు కూడా జనంతో కిటకిటలాడుతున్నాయి. బంగారం కొనడానికి ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నారు. విజయదశమి పండుగ సందర్భంగా ఒక రోజుముందు పరిశ్రమల్లో కార్మికులు పనిముట్లు, యంత్రాలకు ఆయుధ పూజ చేస్తారు. అనంతరం యాజమాన్యాలు విందు భోజనాలతో పాటు స్వీట్ బాక్సులు అందజేస్తాయి. కొందరు బంగారం, వెండి నగలు కొంటారు. పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా బస్సులు, ఆటోలు జనంతో కిక్కిరిసిదర్శనమిస్తున్నాయి.
దసరాకు బోనస్లు కార్మికు ల్లో ఫుల్గా ఆనందాన్ని నిం పాయి. పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం, గడ్డపోతారం, పాశమైలారం, పటాన్చెరు, ఆర్సీపురం, రుద్రారం, కాజీపల్లి, గుమ్మడిదలలోని వేలాది పరిశ్రమల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది పరిశ్రమలు చక్కగా నడవడంతో భారీగా బోనస్లు ప్రకటిస్తున్నాయి. బీహెచ్ఈఎల్, బీడీఎల్ వంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు రెడ్డిల్యాబ్స్, ఎంఎస్ఎన్, అరబిందో, న్యూలాండ్, తోషీబా, కిర్బి, ఏషియన్ పేయింట్స్, టర్బోటెక్, ఇంపిరియల్ గార్డెన్, ఫెన్నార్, ఫరేక్ ప్లాస్ట్స్, బీఈ, మైలాన్ వంటి ప్రముఖ పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
ఈ పరిశ్రమల యాజమాన్యాలతో సీఐటీయూ, టీఆర్ఎస్కేవీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్ వంటి పలు కార్మిక సంఘాలు మాట్లాడి ఒప్పందం చేసుకుని కార్మికులకు బోనస్లు ఇప్పించాయి. పరిశ్రమల పనితీరు, లాభనష్టాలను బట్టి యాజమాన్యాలు బోనస్లు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. కార్మిక చట్టాల ప్రకారం 8.33 శాతానికి తక్కువ కాకుండా గరిష్టంగా 20 శాతం వరకు బోనస్ ప్రకటించారు. యావరేజ్గా రూ. 20వేల వరకు బోనస్ వచ్చినట్లు తెలుస్తున్నది. పలు పరిశ్రమలో ఒక నెల జీతం అదనంగా కార్మికులకు ఇస్తున్నది. బోనస్తో పాటు కొన్ని పరిశ్రమలు గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాయి. దీపావళి సందర్భంగాను కొన్ని పరిశ్రమలు బోనస్ ప్రకటిస్తాయి.
దేశంలోనే ఉత్తమమైన పారిశ్రామికవిధానం తెలంగాణలో ఉంది. నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ను ఇస్తున్నాం. తెలంగాణ సర్కారు అమలుచేస్తున్న పారిశ్రామిక విధానంతో కార్మికులకు ఉపాధి పెరిగింది. పరిశ్రమలు నిరంతరం ఉత్పత్తులు తీస్తూ లాభాల్లో దూసు కుపోతున్నాయి. టీఆర్ఎస్కేవీ కార్మిక సంఘం ఉన్న పరిశ్రమల్లో కార్మికులు సంతృప్తి చెందే స్థాయిలో బోనస్లు ఇప్పించాం. రాష్ట్ర ప్రభుత్వ టీఎస్ఐపాస్ పాలసీతో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. దేశం మొత్తం పటాన్చెరులోని పారిశ్రామిక వాడలను చూస్తున్నది.
– పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
కార్మికుల సంక్షేమమే మా ప్రధాన ఎజెండా. వారి సంక్షేమానికి ఏ పరిశ్రమతోనైనా పోరాడి న్యాయం చేస్తాం. సీఎం కేసీఆర్ అందజేస్తున్న కరెంట్తో మూడు షిఫ్టులు నడుస్తున్నాయి. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కావడంతో పరిశ్రమలు చక్కగా నడుస్తున్నాయి. ఉత్పత్తులు పెరిగాయి. దీంతో లాభాల్లో ఉన్నాయి. కార్మికులకు కూడా బోనస్ల రూపంలో నజరానాలు భారీగా అందజేస్తున్నాయి. ఈ దసరా పండుగ కార్మికుల్లో ఆనందాన్ని నింపింది. ఉత్తమమైన మా పారిశ్రామికవిధానం అందరి జీవితాల్లో భరోసా తెచ్చింది.
– యాదగిరి యాదవ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి