సిద్దిపేట, సెప్టెంబర్ 29 : గ్రామాభివృద్ధి సంపూర్ణ బాధ్యత సర్పంచులదేనని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ అధికారుల సమన్వయంతో పూర్తి చేయించాలని సూచించారు. ప్రగతి పరుగులు పెట్టి, ఆదర్శ మండలంగా నిలువాలంటే మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నారాయణరావుపేట మండల ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మండలంలోని ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. మండల పరిధిలోని గ్రామాల వారికి చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులను ఆరా తీశారు. వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, నిర్మాణాల పురోగతిపై ఆరా తీస్తూనే.. గ్రామాల వారీగా మంజూరు చేసిన రోడ్లు, భవనాలు, వైకుంఠధామాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసే ఏర్పాట్లు చేయాలని సూచించారు. చిన్న మండలమైన నారాయణరావుపేట మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులంతా టీమ్ లీడరుగా వ్యవహరించి అసంపూర్తి పనులపై అధికారులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో చర్చించాలని సూచించారు. పలు గ్రామాల్లో చేపడుతున్న పనులపై అధికారులకు కనీస పర్యవేక్షణ కొరవడిందని పనితీరు మార్చుకోవాలని, గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను మంత్రి సుతిమెత్తగా ఆదేశించారు.
‘మనఊరు-మనబడి’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, మిషన్ భగీరథ తాగునీరు, విద్యుత్, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్ -డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనం, కొత్త పంచాయతీ భవనాలు, గ్రామాల్లోని పలు కుల సంఘ భవనాలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్డు నిర్మాణాల అసంపూర్తి పనులన్నీ త్వరితగతిన చేపట్టాలని ఆయా శాఖల అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పలు గ్రామాల వారీగా అవసరమైన అభివృద్ధి పనులతో పాటు కొత్త అభివృద్ధి పనులు కోరగా, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఎంపీపీ బాలమల్లు, జడ్పీటీసీ కుంబాల లక్ష్మీరాఘవారెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సిద్దిపేట పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం పట్టణంలోని 21వ వార్డులో, 23,24 వార్డుల్లో రైతుబజార్ పక్కన, 13వ వార్డులో బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సిద్దిపేట పట్టణంలోని రోడ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల, వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు విఠోబా, నాయకం లక్ష్మణ్, నజియా అక్తర్ పటేల్తో పాటు పలువురు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను పేదలు వినియోగించుకోవాలని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని 40వ వార్డులో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ఖాన్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం బస్తీ దవాఖాను తిరిగి పరిశీలించారు. బస్తీ దవాఖాన డాక్టరు చే కౌన్సిలర్ సాయి ఈశ్వర్గౌడ్కు బీపీ చెక్ చేయించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ పేదలకు వైద్య సహాయం అందించేందుకు పలు వార్డుల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్, ఆర్డీవో అనంతరెడ్డి, మాజీ మున్సిపల్ కడవేర్గు రాజనర్సు, నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్రెడ్డి, పూజల వెంకటేశ్వరరావుతో పలువురు పాల్గొన్నారు.