సీఎం కేసీఆర్ సహకారంతో అన్నిరకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూ సిద్దిపేటను విద్యాక్షేత్రంగా అభివృద్ధి చేస్తున్నానని ఆర్థిక, వైద్యాఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. చిన్నకోడూరు మండల పరిధిలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ సమీపంలోని రామంచలో సోమవారం బీ ఫార్మసీ కళాశాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యాసంస్థల ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదన్నారు. వందలాది చెరువులు, చెక్డ్యామ్లు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఫలితంగా భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయని చెప్పారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేట విద్యాక్షేత్రంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని, ఒక్కొక్కటిగా అన్ని కళాశాలలను సమకూర్చుకుంటున్నట్లు ఆర్థిక, వైద్యాఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండల పరిధిలోని (రంగనాయక సాగర్ రిజర్వాయర్ పక్కన) రామంచలో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ వారి నేతృత్వంలో నిర్మాణం చేపట్టనున్న రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలకు బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి హరీశ్రావు భూమిపూజ చేశారు.
ఈ కళాశాలను రూ. 26 కోట్లతో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… సిద్దిపేటకు బీఫార్మసీ కళాశాల మంజూరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైద్యవిద్యలో ప్రభుత్వ, ప్రైవేట్ రెండు కళాశాలలు కలుపుకొని, ఇక్కడ 1,350 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ సిద్దిపేటకు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అడిగి మంజూరు చేసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నత చదువులు అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఏర్పడక ముందు మహిళా డిగ్రీ కళాశాల కావాలని ఎన్నో ఏండ్ల కోరిక ఉండేదని, అది తెలంగాణ రాష్ట్రం వచ్చాక సాధ్యమైందన్నారు.
మహిళా డిగ్రీ కళాశాలతో పాటుగా సిద్దిపేట చుట్టూ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి తెలిపారు. మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు, కేంద్రీయ విద్యాలయం, పీజీ కళాశాల, నర్సింగ్ కళాశాల, బీవీఎస్ఈ వెటర్నరీ కళాశాల, ప్రభుత్వ గురుకులాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాలకు నూతన భవన నిర్మాణం జరుగుతోందన్నారు. ఎల్అండ్టీ వారు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోచింగ్ సెంటర్ను తీసుకు వస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఐదు ట్రేడ్లలో 500 మందికి 6 నెలల పాటు శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ పూర్తి చేసినవారికి వారే జాబ్ చూపిస్తారని తెలిపారు. ఇప్పటికే సిద్దిపేట కేంద్రంగా సెట్విన్ శిక్షణ కేంద్రం నడుస్తున్నదన్నారు.
యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూరల్ డెవలప్మెంట్ స్కీం కింద శిక్షణ ఇస్తున్నారని తెలపారు. తాజాగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో వేలాది మందికి విద్యను అందించేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ సంస్థకు తాను అధ్యక్షుడిగా ఉండడంతో దీని ద్వారా ఇక్కడ ఒక బీఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేయాలని బోర్డు సభ్యులను కోరినట్లు తెలిపారు. దీనికి బోర్డు సభ్యులు వెంటనే ఆమోదం తెలుపడం, ఇక్కడ ఈ కళాశాలకు భూమిపూజ చేసుకోవడం చాలా సం తోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులకు మంత్రి ప్రత్యే క కృతజ్ఞతలు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని మంత్రి హరీశ్రావు చెప్పారు. వందలాది చెరువులు, చెక్డ్యామ్లు నింపుతున్నట్లు చెప్పారు. తద్వారా భూగర్భజలాలు పెరిగాయన్నారు. ఫలితంగా భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయని చెప్పారు. ఇక్కడి ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ చేతినిండా పని దొరికిందని వివరించారు. బీ ఫార్మసీ కళాశాల నిర్మాణానికి సహకరించిన వారందరికీ మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ప్రభాశంకర్, దేవేందర్రెడ్డి, చంద్రశేఖర్, జైశ్వాల్, అశ్వక్ హైదర్, స్థానిక ప్రజాప్రతినిధులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
దరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ సంస్థ విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు. దీనికి 75 ఏండ్ల చరిత్ర కలిగి ఉందని, ఇలాంటి సంస్థకు ఎంతోమంది హేమాహేమీలు అధ్యక్షులుగా పనిచేశారని తెలిపారు. ప్రతిసారి ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయంతోనే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయంలో 85శాతం విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్తర తెలంగాణలో కూడా ఈ సంస్థ సేవలను విస్తరించేలా చూడాలని బోర్డు సభ్యులను మంత్రి కోరారు. భవిష్యత్తులో ఈ సంస్థను యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.