రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం చదువుల కోవెల బాసర ట్రిపుల్ఐటీని సందర్శించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మధ్యాహ్నం 1.25 గంటలకు యూనివర్సిటీకి చేరుకున్న ఆయన, దాదాపు మూడున్నర గంటల పాటు క్యాంపస్లో గడిపారు. మొదట విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ మమేకమయ్యారు. ఆప్యాయంగా పలుకరిస్తూ.. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ భవనంలో గంటన్నరకుపైగా సమావేశమై మాట్లాడారు. ట్రిపుల్ఐటీలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తీరు ప్రశంసనీయమని అభినందించారు. కొవిడ్ ప్రభావం విద్యావ్యవస్థపైనా పడిందని, ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నామని, ఈ క్రమంలోనే ట్రిపుల్ఐటీ విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ వసతులను మరింత మెరుగుపరిచే బాధ్యతను తీసుకుంటామని స్పష్టం చేశారు.
– నిర్మల్ (నమస్తే తెలంగాణ)/బాసర, సెప్టెంబర్ 26
మీరడిగినవన్నీ చేస్తామని, సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ మీకు చెప్పమన్నారు. విద్యార్థుల కోరిక మేరకు కొత్త కోర్సులు ప్రవేశపెడుతాం. విద్యాశాఖతో కలిసి ఇందుకోసం ప్రతిపాదనలు రూపొందిస్తాం.
మంచి వీసీ, డైరెక్టర్ను మంత్రి సబితాఇంద్రారెడ్డి మీకందించారు. వారి ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీ రూపురేఖలు మారడం ఖాయం. వీసీ మంచి విద్యావేత్త అని, ఆయన చదువుకు ఈ యూనివర్సిటీ చాలా చిన్నది. వెంకటరమణ తండ్రి రామకృష్ణ ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా పనిచేశారని గుర్తు చేశారు.
మంత్రి కేటీఆర్తో విద్యార్థులు సరదాగా సెల్ఫీలు దిగారు. సెల్ఫీలను తీసుకున్న విద్యార్థులు ఒక్కొక్కరు తనకు రూ.500 ఇవ్వాలని మంత్రి విద్యార్థులను ఆటపట్టించి నవ్వించారు. దీనికి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తీసుకున్న సెల్ఫీలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ, స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేసుకున్నారు.
ట్రిపుల్ ఐటీని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. టీ -హబ్ సెంటర్, 3కోట్లతో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తాం. వెయ్యి కంప్యూటర్లతో అధునాతన ల్యాబ్, డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడి ఆడిటోరియంను కూడా ఆధునీకరిస్తాం. మీరడిగినట్లు 50 అదనపు తరగతి గదులను కూడా నిర్మించి ఇస్తాం. మళ్లీ నవంబర్లో వస్తా. మీ అందరికీ ల్యాప్టాప్లు అందిస్తాం. విద్యార్థుల కోరిక మేరకు కొత్త కోర్సులు ప్రవేశ పెడుతాం.
ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసి భవనాలు, ల్యాబ్లకు క్లాస్రూంలు నిర్మించినా, వాటిని బాగా చూసుకునే బాధ్యత మీదే. మీరు తలచుకుంటే ఎన్ఐటీ, ఐఐటీలతో పోటీపడి ట్రిపుల్ఐటీని మోడల్ క్యాంపస్గా మార్చవచ్చు. విద్యార్థులు క్యాంపస్ మెయింటనెన్స్లో భాగస్వాములు కావాలి. మన విద్యాసంస్థ కోసం నెలకోసారి శ్రమదానం చేయాలి. సొంత ఆస్తిని చూసుకున్నట్లే చూసుకోవాలి.
విద్యార్థులు మూసధోరణిలో కాకుండా ఇన్నోవేటివ్ పద్ధతిలో తమ పరిశోధనలను కొనసాగించాలి. పరిశోధనలే నవీన ఆవిష్కరణలకు ఊతమిస్తాయి. ఆవిష్కరణల నుంచే కంపెనీలు పుడతాయి. ఆ కంపెనీల నుంచి ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థులు ఉద్యోగాల కోసమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. సొంతంగా కంపెనీలు పెట్టాలి.
ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మీరు చేస్తున్న ఆందోళనలను ప్రతి రోజూ పేపర్లు, టీవీల్లో చూశా. రాజకీయాలకు తావులేకుండా శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తీరు నాకెంతో నచ్చింది. అందుకు మీకు అభినందనలు.