మెదక్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 16న నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షలు సజావుగా జరిగేలా పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గ్రూప్-1 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ప్రధానాచార్యులతో మాట్లాడారు. అక్టోబర్ 16 న టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో 3,295 అభ్యర్థులు పరీక్ష రాసేందుకు 13 కేంద్రాలు గుర్తించినట్లు తెలిపారు. మెదక్లో 6, నర్సాపూర్లో 4, తూప్రాన్లో 3 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎంపిక చేసిన కేంద్రాల్లో 24 మంది అభ్యర్థులు, 48 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వీలుగా రూములు గుర్తించి ఫర్నిచర్, లైట్స్, ఫ్యాన్స్, మంచినీటి సౌకర్యం వంటివి ఏర్పాటు చేయాలని, ప్రతీ గదికి సీసీ కెమెరాలు అమర్చి చీఫ్ సూపరింటెండెంట్ గదికి అనుసంధానం చేసి మానిటరింగ్ చేయాలని సూచించారు. ప్రశ్నాపత్రాలు, ఓఏంఆర్ షీట్లు కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్ నుంచి కేంద్రాలకు తరలించేందుకు రూట్మ్యాప్ రూపొందించుకోవాలన్నా రు. ఆర్డీవోలు తమ పరిధిలోని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందు వచ్చేలా చూడాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించవద్దని సూచించారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం పరీక్షా కేంద్రాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, ఆర్డీవోలు సాయిరాం, వెంకట ఉపేందర్రెడ్డి, డీఈవో రమేశ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ రవిచందర్, కలెక్టరేట్ ఏవో యూనూస్ పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 26: ఫుడ్ పాయిజన్పై జిల్లా కేంద్రంలోని గురుకుల, వివిధ పాఠశాలలు, వసతి గృహాల వంట సిబ్బంది, ప్రధానాచార్యులు, డిప్యూటీ వార్డెన్లు, స్టాఫ్ నర్సులకు ఈనెల 27 నుంచి 30 వరకు శిక్షణా కార్యక్రమాలను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాల కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీవీబీ, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో పనిచేస్తున్న వారికి ఫుడ్ పాయిజన్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిశుభ్రత పాటించుట, వంట, ఆరోగ్య నిర్వహణపై శిక్షణ ఉంటుందన్నారు. ఈనెల 27న వంట సిబ్బంది, 28న డిప్యూటీ వార్డెన్లు, 29న స్టాప్ నర్సులు, 30న ప్రధానాచార్యులకు శిక్షణ ఉంటుందన్నారు.