జహీరాబాద్ ప్రాంతంలోని జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నిమ్జ్)లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నదని, తద్వారా పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం జహీరాబాద్, ఝరాసంగం మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఎల్గోయి శివారులోని నిమ్జ్లో ‘వెమ్ టెక్నాలజీస్ ప్లాంట్’ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎంజీ వాయు ఎలక్ట్రిక్ మోటార్స్ పార్కు శిలాఫలకం ఆవిష్కరించారు. మహీంద్రా ట్రాక్టర్ల పరిశ్రమలో మూడు లక్షవ ట్రాక్టర్ను ఆవిష్కరించారు.ఆ తర్వాత జహీరాబాద్ బాగారెడ్డి స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. నిమ్జ్లో ఏర్పాటవుతున్న పరిశ్రమలతో ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తున్నదన్నారు.
నిమ్జ్ భూనిర్వాసితులకు తప్పక న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇప్పిస్తామన్నారు. స్థానిక మున్సిపల్ అభివృద్ధికి రూ.66 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బల్దియా విలీన గ్రామాల తాగునీటి గోస తీరుస్తామన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు.
జహీరాబాద్/ఝరాసంగం/న్యాల్కల్, జూన్ 22 : యువతకు ఉపాధి కల్పించేందుకు జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నిమ్జ్)లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, ఝరాసంగం మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయ పాల్గొన్నారు. ఎల్గోయి శివారులోని నిమ్జ్లో ‘వెమ్ టెక్నాలజీస్
ప్లాంట్’ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మహీంద్రా ట్రాక్టర్ల పరిశ్రమలో మూడు లక్షల ట్రాక్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్జ్లో ‘వెల్ టెక్నాలజీస్’ అధునాతన రక్షణ, ఏరోస్పేస్ పరికరాల తయారీ సంస్థ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నిమ్జ్లో రూ. 1,000 కోట్లతో పెట్టుబడితో 511 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడంతో 2000 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
రక్షణ రంగంలో దేశంలోనే ఇది ఒక పెద్ద పరిశ్రమ అన్నారు. రక్షణ, ఎరోనాటిక్స్, అంతరిక్ష రంగాల్లో ఉపయోగపడే ఎరోస్ట్రక్చర్స్, ఎరో ఇంజిన్స్ రాడార్ సిస్టమ్స్తోపాటుహెలికాప్టర్లు, విమానాలకు సంబంధించిన పరికరాలు తయారుచేస్తారని తెలిపారు. పరోక్షంగా 4వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలు ఉత్పత్తి చేస్తారన్నారు.
వెమ్ టెక్నాలజీతో పాటు ఇతర పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్బర్’ భారత్లో భాగంగా రక్షణ రంగ పరికరాలు ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్లోని పరిశ్రమలు ఎంతో కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. డిఫెన్స్ పరిశ్రమలు వెయ్యి వరకు ఉన్నాయని, దేశానికి సంబంధించిన డిఫెన్స్ రంగంలో 1988లో వెమ్ టెక్నాజీస్ ఏర్పాటు జరిగినట్లు తెలిపారు. ప్రపంచలోనే వెమ్ టెక్నాజీస్ గుర్తింపు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమకు సంబంధించిన 511 ఎకరాల భూమి అప్పగించినట్లు తెలిపారు. ఆగస్టు నుంచి పనులు ప్రారంభించాలని సంస్థ యాజమాన్యాన్ని ఆయన కోరారు.
జహీరాబాద్ మున్సిపల్లో విలీనమైన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రూ. 66 కోట్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రామారావు అన్నారు. జహీరాబాద్ పట్టణంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… జహీరాబాద్ మున్సిపల్ ఏర్పాటు చేసినప్పుడు రూ. 50 కోట్ల నిధులు సీఎం కేసీఆర్ ఇచ్చారన్నారు. గతంలో మున్సిపల్కు రూ.50 వేల నిధులు వస్తే స్వీట్లు పంచుకునే పరిస్థితి సమైక్య రాష్ట్రంలో ఉండేదన్నారు.
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ మున్సిపల్లో అభివృద్ధి పనులు చేసేందుకు రూ. 50 కోట్లు మంజూరు చేశారన్నారు. ప్రధాన రోడ్డు మధ్య మొక్కలు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచినట్లు తెలిపారు. జహీరాబాద్లో రూ.14.50 కోట్లతో సమీకృత వెజ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం చేశామన్నారు. రూ. 4 కోట్లతో వైకుంఠధామాలు, వార్డులో క్రీడా మైదానాలు ఏర్పాటు చేశామన్నారు. ముంబయి జాతీయ రహదారి పూర్తిగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రూ.2.55 కోట్లతో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు.
పట్టణ ప్రగతిలో పారిశుధ్య పనులు చేసేందుకు రూ. 18.79 కోట్లు మంజూరు చేశామన్నారు. పట్టణంలో పార్కులు, సామూహిక భవనాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జహీరాబాద్ మున్సిపల్ విలీన గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కలిపించేందుకు రూ. 66 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి హరీశ్రావు మిషన్ భగరీథ పనులు విలీన గ్రామాల్లో ప్రారంభిస్తారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మున్సిపల్కు నిధులు మంజూరు చేసే వారు కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో జహీరాబాద్ నుంచి మంత్రిగా పనిచేసిన వారు ఉన్నారన్నారు. వారు ఎందుకు మున్సిపల్ను అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. మంత్రిగా పనిచేసి ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదో చెప్పాలన్నారు.
జహీరాబాద్,నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లో భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేసేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా చేసి బీడు భూముల్లో బంగారు పంటలు పండించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గోదావరి నీరు మల్లన్న సాగర్లో నింపి, అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్టుకు తరలించి వ్యవసాయానికి సాగునీరు అందిస్తామన్నారు.ఈ ఎత్తిపోతలతో సంగారెడ్డి జిల్లా సాగు స్వరూపం పూర్తిగా మారుతుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
గతంలో ఎవరైనా చనిపోతే నీటికోసం కరెంట్ అధికారులకు ఫోన్చేసే పరిస్థితి ఉండేదని, ఇప్పడు వైకుంఠధామాలు ఏర్పాటు చేసి నిరంతర కరెంట్ సరఫరా చేసి నీరు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామాల్లో తాగునీరు కష్టాలు, కరెంట్ సమస్యలు లేవన్నారు. గతంలో పింఛన్ రూ. 200 ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.2016 ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు గతంలో రూ. 500 ఉంటే, తెలంగాణ ప్రభుత్వం రూ. 3016 ఇస్తున్నదన్నారు.
రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో అర్హులందరికీ ఫించన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 12 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. సర్కారు దవాఖానలో మహిళలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. ప్రసవల సంఖ్య పెరిగిపోయిందని, సర్కార్ దవాఖానలో ప్రసవం జరిగితే కేసీఆర్ కిట్తో పాటు డబ్బులు ఇస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యలక్ష్మి పేరిట మహిళలకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 973 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయగా, అందులో 5 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇంటర్, డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు స్కాలర్షిష్లు మంజూరు చేస్తున్నామన్నారు. విదేశాలో చదువుకోనే వారికి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, ఆరోగ్యం కోసం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మున్సిపల్ కార్మికులకు ప్రతినెలా రూ.12 వేలకు పైగా జీతం ఇస్తున్నామన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి కేటీఆర్ కోరారు.
జహీరాబాద్ ప్రాంతంలో నైపుణ్యం ఉన్న యువకులకు ఉపాధి కలిపించాలని మంత్రి కేటీఆర్ పరిశ్రమ వర్గాలను కోరారు. ప్రైవేట్ రంగంలో డిఫెన్స్ విభాగంలో వెమ్ టెక్నాలజీ పెద్ద పరిశ్రమన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కలిపించాలని కోరారు. సీఎస్ఆర్ ద్వారా గ్రామాల్లో వైద్యం, విద్య, హరితహారంలో మొక్కల పెపంకానికి చేయూతనివ్వాలని కోరారు. పరిశ్రమలో 10 వేల మొక్కలు పెంచేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి లభించాలి, కాలుష్యం లేని పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా కృషిచేస్తున్నట్లు చెప్పారు.
పర్యావరణ పరిరక్షణకు పరిశ్రమలు కృషి చేయాలన్నారు. భారత ప్రభుత్వం నిమ్జ్గా గుర్తించినా, భూమి సేకరణ ఇంకా పూర్తి చేయలేదన్నారు. భూముల ధరలు భారీగా పెరిగిపోయాయని, భూసేకరణ చేస్తే రైతులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. నిమ్జ్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన, కోల్పోతున్న రైతులకు ఉపాధి కల్పించాలన్నారు. 12,600 ఎకరాల భూమి నిమ్జ్ కోసం సేకరిస్తామన్నారు. చదువుకున్న యువకులకు ఉపాధి కల్పించాలని, రైతులు పరిశ్రమలకు సహకరిస్తారన్నారు.
యువతకు ఉపాధి కలిపించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. స్థానికులకు ఉపాధి కలిపించేందుకు వెమ్ టెక్నాలజీస్ సీఎండీ వెంకటరాజు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. బెంగళూరు-హైదరాబాద్ మధ్య రక్షణ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని గతంలో రక్షణ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ను కోరామన్నారు. కానీ,వారు ఉత్తర్ప్రదేశ్లో ఏర్పాటు చేశారన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు. పరుగులు పెడుతున్న రాష్ర్టాన్ని ఆశీర్వదించాలన్నారు. నిమ్జ్లో ఏర్పాటు వేసే వెమ్ టెక్నాలజీ పరిశ్రమలో వేగంగా ఉత్పత్తులు ప్రారంభిస్తారని కేటీఆర్ అన్నారు.
దేశాన్ని, రాష్ర్టాన్ని 50ఏండ్ల పాటు పాలించిన వారు ఎందుకు సమస్యలు పరిష్కరించలేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామని కల్లబొల్లి మాటలు మాట్లాడడం తగదని హితవు పలికారు. 50 ఏండ్లలో చేయని అభివృద్ధిని ఇప్పుడు ఎలా చేస్తారన్నారన్నారు. ఒక పార్టీ వారు ఒకసారి అవకాశం అంటున్నారు..మరో పార్టీ వారు కులం, మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి పది అవకాశాలు ఇచ్చినా ఎందుకు అభివృద్ధి చేయలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ కృషిచేస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ అన్నారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్, రైతుబం ధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఝరాసంగం,న్యాల్కల్ మండలాల పరిధిలో నిమ్జ్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలతో ఈ ప్రాంతంలో ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.