పాపన్నపేట, సెప్టెంబర్ 28 : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ఏడుపాయలకు చేరుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వనదుర్గా భవానీమాత ఆలయం ఎదుట నుంచి ప్రవహిస్తున్న మంజీర నదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజగోపురంలోని ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించగా, ఆలయ ఈవో సార శ్రీనివాస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి శాలువాతో సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మంజీర ఉధృతిని పరిశీలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గులాబ్ తుఫాన్ మూలంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఇతర రాష్ర్టాల్లో సైతం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోనికి పెద్ద ఎత్తున వరద వస్తున్నదని, రాత్రి వరకు ఈ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున మంజీర పరీవాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయని ప్రజలు అటువైపు వెళొద్దని సూచించారు.
పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే..
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఏడుపాయలకు వెళ్తున్న క్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచ్లు ఏడుపాయల కమాన్ వద్ద ఆమెకు స్వాగతం పలుకగా, ఎమ్మెల్యే కాన్వాయ్ ఆపి ఎక్కడెక్కడా ఎంత పంట నష్టం సంభవించింది? అని సర్పంచ్లు, స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ వ్యవసాయశాఖ అధికారులు సైతం పంట నష్టం వివరాలు సేకరిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో పోతంశెట్టిపల్లి దగ్గర ఉన్న రెండో బ్రిడ్జి వద్ద ఆగి వరద ఉధృతిని ఆమె పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, రైతుబంధు జిల్లా నాయకులు సోములు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ సంజీవరెడ్డి, పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తి గౌడ్, మిన్పూర్ సర్పంచ్ లింగారెడ్డి, ఇతర గ్రామాల సర్పంచ్లు శ్రీనాథ్రావు, వెంకట్రాములు, స్రవంతిశ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేశం, నాయకులు సిద్ధిరాంరెడ్డి, సొంగ దుర్గయ్య, బాబాగౌడ్, టీఆర్ఎస్ మండల మైనార్టీ అధ్యక్షుడు బాబర్ పటేల్ ఉన్నారు.