ఉమ్మడి మెదక్ జిల్లా ప్రకృతి అందాలు భూలోక స్వర్గాన్ని తలపిస్తున్నది. ఎన్నెన్నో హొయలతో ప్రకృతి ఆహ్వానం పలుకుతున్నది. పోచారం అభయారణ్యం.. నర్సాపూర్ ఫారెస్ట్.. ఏడుపాయల వనదుర్గమ్మ.. కొమురవెల్లి మల్లన్న.. వర్గల్ సరస్వతీ మాత.. మెదక్ చర్చి.. కోమటి చెరువు.. తేజోవనం, గజ్వేల్ అర్బన్ పార్కు.. అన్నపూర్ణ.. రంగనాయకసాగర్.. మల్లన్నసాగర్.. కొండపోచమ్మసాగర్.. మంజీర.. సింగూరు ప్రాజెక్టులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పచ్చని చెట్లు.. ఎటు చూసినా చల్లని వాతావరణం, దట్టమైన అడవులు.. వన్యప్రాణుల సందడి.. పులుల సంచారం.. లాంటి దృశ్యాలు ప్రకృతి రమణీయతకు అద్దంపడుతున్నాయి. అందమైన సరస్సులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని సందర్శన స్థలాలను ఒక్కసారి చూద్దాం రండి..
మెదక్, సెప్టెంబర్ 26: మెతుకు సీమ పర్యాటకంగా విరాజిల్లుతోంది. మెదక్-నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం అభయారణ్యం వన్యప్రాణులు, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మెదక్ జిల్లాలో ప్రధాన పర్యాటక స్థలంగా పేరొందింది. పచ్చని చెట్లు ఎటు చూసినా చల్లని వాతావరణం, వన్యప్రాణుల కేరింతలు, దట్టమైన అడవులు.. పులుల సంచారంతో మెదక్ సమీపంలో ఉన్న పోచారం అభయారణ్యం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నది. మెతుకు సీమగా పేరుగాంచిన మెదక్ జిల్లాలోని పోచారం అభయారణ్యంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మెదక్ జిల్లాకు 15 కిలోమీటర్లు, హైదరాబాద్కు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచారం అభయారణ్యంలో అందమైన సరస్సుతో పాటు అపారమైన జంతు, వృక్ష జాతులు ఉన్నాయి. 1989లో ఈ అభయారణ్యం పరిధిలోని పర్యావరణ పర్యాటక కేంద్రంలో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. మొత్తం 158 హెక్టార్లలో ఒక బ్లాక్, 34 హెక్టార్లలో మరో బ్లాక్గా ఏర్పాటు చేసి జింకల సంరక్షణ చేపట్టారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెండో చర్చిగా ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి, ఆధ్యాత్మికతకు నిలయమైన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం, మంజీర సోయగాలు ఇవన్నీ మెదక్ జిల్లాలో కనిపిస్తాయి. సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్న, వర్గల్ సరస్వతీమాత ఆలయం, కోమటి చెరువు, తేజోవనం, గజ్వేల్ అర్బన్ పార్కుతో పాటు అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, సంగారెడ్డి జిల్లాలో సింగూరు, పోచారం అభయారణ్యం, కేతకీ సంగమేశ్వరాలయంతో పాటు ఇతర ప్రాజెక్టులు అందాలకు నెలవుగా ఉన్నాయి.
మూడు ఆలయాలు.. మధ్యలో రిజర్వాయర్
చేర్యాల, సెప్టెంబర్ 26 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మండలంలో పలు పుణ్యక్షేత్రాలు, రిజర్వాయర్లు ఉన్నాయి. కొమురవెల్లి నుంచి తపాస్పల్లి రిజర్వాయర్ 6 కిలోమీటర్ల దూరంలో కొండపోచమ్మ ఆలయానికి వెళ్లే దారిలో ఐనాపూర్, తపాస్పల్లి గ్రామాల మధ్య ఉంది. కొమురవెల్లికి వెళ్లిన పర్యాటకులు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి చేర్యాల మండలంలోని నల్లపోచమ్మ, జగదేవ్పూర్ మండలంలోని కొండపోచమ్మ ఆలయాలను సందర్శించుకున్న అనంతరం మూడు ఆలయాల మధ్యలో ఉన్న తపాస్పల్లి రిజర్వాయర్ను సందర్శించవచ్చు.
కొంగొత్త అందాల కోమటి చెరువు..
సిద్దిపేట, సెప్టెంబర్ 26: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువును సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. చెరువు వద్ద ఏర్పాటు చేసిన వేలాడే వంతెన, పార్కు, బోటింగ్, నెక్లెస్ రోడ్డు, రాత్రిపూట అందాలు విరజిమ్ముతున్న లైటింగ్ పర్యాటకులను ఎంతగానో ఆకర్శిస్తున్నది. చిల్డ్రన్ పార్కుతో పాటు పచ్చదనం పర్చుకోవడంతో ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని పట్టణ ప్రజలకు అందిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట పక్కనే రంగనాయకసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో అనేక మంది పర్యాటకులు నిత్యం వస్తున్నారు. చుట్టూ నీరుండి మధ్యంలో ద్వీపంలా ఉండడంతో పర్యాటకులను రంగనాయకసాగర్ విశేషంగా ఆకర్శిస్తున్నది.