పచ్చటి పైరులు.. పారేటి జలాలు.. పక్షుల కిలకిలలు.. పైరగాలుల సవ్వడి.. కోయిలమ్మ కూతలు.. పిచ్చుక గూళ్లు.. జింకల పరుగులు.. మయూరాల నాట్యాలు.. సుందర సుకుమార సీతాకోక చిలుకలు.. తీరొక్క జీవజాలం.. ప్రకృతి రమణీయత.. నయనానందకర దృశ్యాలు మెతుకు సీమలో కనువిందు చేస్తున్నాయి. కొన్నేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అడవుల సంరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో అడవులు వృద్ధి చెందుతున్నాయి. హరితహారం కార్యక్రమంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా విరివిగా మొక్కలు నాటి, సంరక్షిస్తుండడంతో ఆహ్లాదకర వాతావరణ నెలకొంది. ఏటా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తీరొక్క జీవజాలం వృద్ధి చెందుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పోచారం అభయారణ్యం.. నర్సాపూర్ అర్బన్ పార్కు.. జహీరాబాద్లోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు, సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ వనాలు అటవీ సంపద, ప్రకృతి అందాలకు నిలయంగా మారాయి. దీంతో జీవ వైవిధ్యంతో జిల్లా అలరారుతోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రకృతి అందాలు వెల్లివిరుస్తున్నాయి. అభయారణ్యం.. గుట్టలు.. జలాశయాలు.. ప్రాజెక్టులు.. సారవంతమైన అటవీ ప్రాంతాలు.. తీరొక్క పంటల సాగుకు నిలయమైన ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం పెరుగుతున్నది. కొన్నేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అడవుల సంరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో అడవులు అభివృద్ధి చెందుతున్నాయి. హరితహారం కార్యక్రమంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా విరివిగా మొక్కలు నాటి, సంరక్షిస్తుండడంతో ఆహ్లాదకర వాతావరణ నెలకొంది. వాతావరణ సమతుల్యం సాధ్యమవుతున్నది. దీనికి తోడు వరుణుడు కరుణించి, మూడు, నాలుగేండ్లుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో నీటి వనరులు కళకళలాడుతున్నాయి. తద్వారా చెట్లు, చేమలు వృద్ధి చెంది, తీరొక్క జీవజాలం వృద్ధి చెందుతున్నాయి. అనుకూల వాతావరణం ఏర్పడడంతో కొన్నేండ్లుగా ఉమ్మడి జిల్లాలో అటవీ జంతువులు, వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. అడవి పందులు.. కుందేళ్లు.. దుప్పులు.. జింకలు.. చిరుతలు.. నెమళ్లు.. పక్షుల సంచారం ఎక్కువైంది. దేశ, విదేశీ పక్షులు జిల్లాకు వలస వస్తున్నాయి. పోచారం అభయారణ్యం.. నర్సాపూర్ అర్బన్ పార్కు.. జహీరాబాద్లోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో, సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ వనాలు అటవీ సంపదకు నిలయంగా మారాయి. హైదరాబాద్కు దగ్గరగా ఉండడంతో రోజురోజుకూ పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది.
మంజీరకు పోదామా.. మొసళ్లను చూద్దామా..
సంగారెడ్డి, సెప్టెంబర్ 25 : మంజీర ప్రాజెక్టు హైదరాబాద్ వాసుల దాహార్తి తీర్చేందుకు నిర్మించారు. నిత్యం సందర్శకులతో ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం సందడి వాతావరణాన్ని నెలకొంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాలు, సరిహద్దులోని కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా సందర్శకులు వస్తుంటారు. గతంలో రాజధాని వాసులకు మంచినీటి వనరుగా ఉన్న మంజీర ప్రాజెక్టు నేడు మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేస్థాయికి ప్రభుత్వం పెంచింది. ప్రాజెక్టు వచ్చే సందర్శకులు మొసళ్ల కేంద్రాన్ని సందర్శిస్తుంటారు. కొన్నేండ్లుగా వన్యప్రాణుల సంరక్షణ శాఖ అధికారులు మొసళ్ల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించారు. మొసళ్ల సంరక్షణ కేంద్రంలో ఒక మగ మొసలి, రెండు ఆడ మొసళ్లతో సంతానోత్పత్తి జరగడంతో ప్రస్తుతం పెద్దవి, పిల్లలు కలిపి 80 మొసళ్లు ఉన్నాయి. నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఆరేండ్ల క్రితం అధికారులు బోరుబావి తవ్వించి నీటిని అందిస్తున్నారు. మొసళ్ల సంతానోత్పత్తి వేసవి కాలంలో ఇసుక నేలల్లో గుంతలు చేసుకుని 10 నుంచి 40 గుడ్లు వరకు పెట్టి 40 రోజులు సంరక్షిస్తాయి. అధికారులు ఆహారంగా పెద్ద మొసళ్లకు 200 గ్రాముల చొప్పున పశువుల మాంసం (బీఫ్) మధ్యాహ్నం పూట అందజేస్తారు. రోజు తప్పించి రోజు మాంసం ఆహారంగా అందిస్తారు. మిగతా వాటికి వంద, యాభై గ్రాముల చొప్పున మాంసాన్ని అందిస్తూ పెంచుతున్నారు. ప్రత్యేకంగా నీటి కొలన్లను ఏర్పాటు చేసి నెలకోసారి నీటిని మార్చుతూ సంరక్షిస్తున్నారు. 9 ఫీట్లు పొడవు ఉన్న మొసళ్లు 3, 4 ఫీట్ల పొడవు గలవి 4, 3 ఫీట్లవి 8, మిగతా రెండు, మూడేండ్ల వయస్సు కలిగిన మొసళ్లు 65 ఉన్నట్లు అధికారులు తెలిపారు.
శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి..
ప్రతి శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో మంజీర ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరుగుతుంది. ప్రాజెక్టు గేట్ల కింద భాగంలో నీటిలో ఈత కొడుతూ సందర్శకులు సందడి చేస్తారు. నీటిలో రోజంతా ఈత కొడుతూ సేదతీరుతుంటారు. వేసవిలో ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవడానికి ఈత కొడుతుంటారు. సమీపంలోని మొసళ్ల క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. మంజీర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.6 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.