చేర్యాల, సెప్టెంబర్ 23 : హామీలు ఇవ్వడమే కాదు, వాటిని నెరవేర్చడంలో ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఎప్పుడూ ముందుంటారనే విషయం మరోసారి నిరూపితమైంది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఆగస్టు 9న మంత్రి హరీశ్రావు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాలతో పాటు చేర్యాల పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు.చేర్యాలలో ఇరిగేషన్, గ్రామీణ తాగునీటి సరఫరా సబ్ డివిజన్ కార్యాలయాలతో పాటు వ్యవసాయ సహాయ సం చాలకుల కార్యాలయం ఏర్పాటు ఆవశ్యకతను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి సమీక్ష సమావేశంలో కార్యాలయాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. మొదటగా రెండు రోజుల్లో చేర్యాల కేంద్రంగా ఆర్డబ్ల్యూఎస్ ఉపకార్య నిర్వాహక ఇంజినీర్ కార్యాలయంతో పాటు ఇరిగేషన్ సబ్ డివిజన్ ఆఫీస్ను ఏర్పాటు చేస్తామన్నారు.అవసరమైన నివేదికలు ప్రభుత్వానికి పంపించాలని అక్కడి నుంచే సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. చేర్యాల మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. హామీ మేరకు గతంలో చేర్యాలలో కొనసాగిన నీటి పారుదల గ్రామీణ తాగునీటి సరఫరా సబ్ డివిజన్ కార్యాలయాన్ని, ఇరిగేషన్ కార్యాలయాన్ని పునరుద్ధరించారు.
వారం రోజుల్లో ఏడీఏ కార్యాలయం
చేర్యాలలో వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయం మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. చేర్యాల మార్కెట్ యార్డు పరిధిలో వారం రోజుల్లో ప్రారంభించేందుకు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సాగునీటి వనరుల లభ్యత పెరిగింది. ఫలితంగా కరువు పీడిత ప్రాంతం చేర్యాల సబ్ డివిజన్ పరిధిలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాల పరిధిలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. విస్తీర్ణం పెరగడంతో రైతులకు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు అవసరమయ్యాయి. క్షేత్ర స్థ్ధాయిలో వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ, మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఏడీఏ కార్యాలయ ఏర్పాటుతో రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు వేగంగా అమలు కానున్నాయి. జిల్లాలో ఇప్పటికే సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, ములుగు వ్యవసాయ డివిజన్లు ఉండగా, చేర్యాలలో ఏర్పాటయ్యే ఏడీఏ కార్యాలయంతో ఆఫీసుల సంఖ్య ఆరుకు చేరనున్నది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాలో చేరిన చేర్యాల ప్రాంత అభివృద్ధికి ఇరిగేషన్, గ్రామీణ తాగునీటి సరఫరా సబ్ డివిజన్ కార్యాలయాలు, వ్యవసాయశాఖ ఏడీఏ కార్యాలయాల ఏర్పాటుకు మంత్రి హరీశ్రావు చొరవ చూపడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.