పుల్కల్ రూరల్, సెప్టెంబర్ 23 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ‘సింగూరు’కి వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు వచ్చిన ఇన్ ఫ్లో వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. బుధవారం రాత్రి 11:15 గంటలకు 11,134 క్యూసెక్కులు ఇన్ ఫ్ల్లో పెరగడంతో అధికారులు 6వ నంబర్ గేటును 2మీటర్లు పైకి ఎత్తి నీటిని దిగువకు వదిలారు. గురువారం ఉదయం 10:30 గంటలకు ఇన్ ప్లో 13 వేల క్యూసెక్కులు పెరగడంతో 11వ గేటు, సాయంత్రం 5:00 గంటలకు 9వ గేటు మొత్తంగా మూడు గేట్ల ద్వారా రెండు మీటర్ల ఎత్తులో 34,673 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
అందోల్లో 10.4 సె.మీటర్ల వర్షపాతం..
సంగారెడ్డి, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : రెండు రోజులుగా జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం జిల్లాలో 1.4 సె.మీ. సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 37.6 సెం.మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని 11 మండలాల్లో 20 నుంచి 60 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, 15 మండలాల్లో 20 శాతం అధిక వర్షం కురిసింది. అందోల్ మండలంలో అత్యధికంగా 10.4 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. నాగల్గిద్ద మండలంలో 3.6 సెం.మీటర్లు, నారాయణఖేడ్లో 3.2 సెం.మీటర్లు, హత్నూర, కల్హేర్ మండలాల్లో 2.4 సెం.మీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. మనూరు మండలంలో 2.2 సెం.మీటర్లు, పుల్కల్లో 2.1 సెం.మీటర్ల్ల, వట్పల్లిలో 2.0 సెం.మీటర్ల వర్షం కురిసింది. మిగితా మండలాల్లో 1 నుంచి 2 సెం.మీటర్లలోపు వర్షపాతం నమోదైంది. నల్లవాగు ప్రాజెక్టుతో పాటు నారింజ వాగు పొంగిపొర్లుతున్నాయి.
న్యాల్కల్ మండలంలో…
న్యాల్కల్, సెప్టెంబర్ 23 : మండలంలోని గ్రామాల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుంటలు, చెక్డ్యాంలు, చెరువుల్లోకి వరద భారీగా చేరి అలుగుపోస్తున్నాయి. మండలంలోని చీకూర్తి గ్రామ శివారులో వాగు కల్వర్టుపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈరోడ్డు మార్గం మీదుగా మండలంలోని పలు గ్రామాల నుంచి కర్ణాటకకు వెళ్లే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మంజీరా నదిలోకి కర్ణాటక ఎగువ ప్రాంతంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కురుస్తున్న వర్షాలకు వాగుల నుంచి భారీగా వరద చేరుతున్నది. మంజీరనది తీరంలో ‘సింగూర్’ బ్యాక్ వాటర్ రావడంతో సాగులో ఉన్న పంటలు నీట మునిగిపోయాయని రైతులు వాపోతున్నారు.