గుమ్మడిదల, అక్టోబర్ 21 : కోతుల బెడద పరిశ్రమ వర్గాలను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దండులుగా వస్తున్న కోతులు పరిశ్రమల ఉత్పత్తులను దెబ్బతీస్తుండడంతో యాజమాన్యాలు నష్టపోతున్నాయి. దీంతో వాటి పని పట్టేందుకు కొండముచ్చులను పెంచుతున్నారు.
ఇదీ పరిస్థితి..
పరిశ్రమల ఆస్తులకు నిఘా వేస్తూ ఎప్పటికప్పుడు రక్షించే బాధ్యత సెక్యూరిటీ సిబ్బందిది. మరి పరిశ్రమలో ఉత్పత్తి అవుతున్న రసాయన ముడి సరుకులకు చిందర వందరగా చేస్తూ కెమికల్(ఫార్మాను) సమీకరణాలను మార్చేస్తున్న కోతుల నుంచి రక్షణ పొందడానికి పరిశ్రమల యాజమాన్యాలు కొండెంగలు (కొండముచ్చులు) ఉపయోగిస్తున్నా యి. సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలంలో బొంతపల్లి, దోమడుగు, అన్నారం, అనంతారం, మంభాపూర్లో పారిశ్రామికవాడలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా రసాయన పరిశ్రమలే అధికం. ఇందులో ప్రధానంగా హెటిరో డ్రగ్స్, గ్రాన్యువల్ ఇండియా, శ్రీవాత్సవ, క్లారియంట్, క్లినివెంట్ తదితర పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే ఫార్మా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాగా, పరిశ్రమలో రసాయనాల ఉత్పత్తి జరుగుతుండగా వాటిని సపరేట్గా పెట్టి, వాటికి సంబంధించిన రసాయనాల సమ్మేళనంతో మరో కొత్తరకం ఫార్మాను తయారు చేస్తారు. గుమ్మడిదల, మంభాపూర్, నల్లవల్లి గ్రామ శివారుల్లో అటవీ ప్రాంతం ఉండడంతో కోతులు అధికంగా పరిశ్రమల్లోకి వస్తున్నాయి. వచ్చినవి ఊరికే ఉండకుండా ఎంతో శ్రమించి తయారు చేసిన కోట్లాది రూపాయల విలువైన ఫార్మాను చిందర వందరంగా చేస్తున్నాయి. దీంతో పరిశ్రమల యాజమాన్యాలు నష్టాలు వస్తున్నాయని తలలు పట్టుకుంటున్నాయి. ఈ సమస్య నివారణకు గానూ యాజమాన్యాలు బాగా ఆలోచించి కొండముచ్చులను పరిశ్రమలో పెంచి పోషించాలని ప్లాన్ చేశాయి. వెంటనే దూర ప్రాంతాల నుంచి కొండముచ్చులను తీసుకువచ్చాయి. వాటికి మచ్చిక చేసుకునేందుకు ఒక కార్మికుడిని ఏర్పాటు చేశాయి. కొండముచ్చును కార్మికుడి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాటికి ఉదయాన్నే పాలు, అరటి పండ్లు, జీడిపప్పు, మంచి ఆహారాన్ని అందిస్తూ పోషిస్తున్నారు. దీంతో పరిశ్రమల్లో కొండముచ్చు రోజు నాలుగైదు సార్లు చక్కర్లు కొడుతుండడంతో కోతులు భయపడి ఈ పరిశ్రమల చుట్టుపక్కలకు రావడం లేదు. దీంతో పరిశ్రమల్లో ఫార్మా ఉత్పత్తులను నిర్భయంగా తయారు చేస్తున్నారు. కోతులు రాకుండా కొండముచ్చు చేస్తున్న సాయానికి నిత్యం ఆలనా పాలనా అందిస్తూ పెంపుడు జంతువుగా మచ్చిక చేసుకుని పరిశ్రమలను నడిపిస్తున్నారు.
కొండముచ్చులను పెంచుతున్నాం..
పరిశ్రమలోకి కోతులు వచ్చి తయారుచేసిన ఫార్మాను నాశనం చేసి కోట్లాది రూపాయల నష్టం చేస్తున్నాయి. కోతులను ఎంత దూరంగా వెళ్లగొట్టినా తిరిగి వస్తున్నాయి. దీంతో ఆలోచించి వాటికి భయపడే జంతువును తీసుకు రావాలని కొండముచ్చును ఎంపిక చేసుకున్నాం. కొండముచ్చును గేటు దగ్గర కాపలా పెడుతున్నాం. దీనిని రక్షించడానికి ఒక కార్మికుడిని ఏర్పాటు చేశాం. కొండముచ్చకు నిత్యం పాలు, అరటి పండ్లు, జీడిపప్పు, మంచి ఆహారాన్ని అందిస్తున్నాం. పశుసంవర్ధక శాఖ వైద్యుడితో చికిత్స అందిస్తున్నాం. కోతులను తరిమి కొట్టడానికి నిత్యం పలుమార్లు పరిశ్రమ పరిసరాల్లో కొండముచ్చును తిప్పుతున్నాం. దీనిని చూసి కోతులు పరుగు తీస్తున్నాయి. ఇటువైపు రావడానికి జంకుతున్నాయి.
-ఉమామహేశ్వర్రెడ్డి, పరిశ్రమ ప్రతినిధి బొంతపల్లి