మెదక్, అక్టోబర్ 20 : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై కలెక్టర్ హరీశ్తో పాటు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎస్సీఐ ధాన్యాన్ని కొనకపోయినా, సీఎం కేసీఆర్ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులందరూ ధాన్యాన్ని ఒకేసారి తీసుకురాకుండా విడతల వారీగా తరలించాలని ఆమె సూచించారు. గురువారం నుంచి జిల్లాలో 311 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ హరీశ్ తెలిపారు. జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామని, అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. చేశారు. 147 రైస్, బాయిల్డ్ రైస్ మిల్లులకు ధాన్యం తరలించే విధంగా ట్రాన్స్పోర్టు లారీలకు జియో ట్యాటింగ్ చేయాలన్నారు. ధాన్యం రవాణా కోసం ఇద్దరు కాంట్రాక్టర్ల నుంచి 800 లారీలను ఏర్పాటు చేయాలని, మిల్లుల వారీగా లేబర్ను సమకూర్చాలని సూచించారు. ప్రతి మండలానికి ఎంపీడీవోలు, మండల వ్యవసాయాధికారులతో పర్యవేక్షిస్తూ ప్రత్యేక అధికారులను నియమించాలని, తహసీల్దార్లు కూడా బాధ్యత వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి, డీఆర్డీవో శ్రీనివాస్, డిఎస్వో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాంనాయక్, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్గౌడ్, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు రియాజ్, డీసీవో కరుణ, లీగల్ మెట్రాలజీ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయిలో రెండో బహుమతి
అక్కన్నపేట, అక్టోబర్ 20 : సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగుపందెం పోటీల్లో మండలంలోని రామవరం ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఐదోతరగతి విద్యార్థి పల్లపు అమరేందర్ అండర్ 12 విభాగంలో జిల్లా స్థాయిలో రెండో బహుమతి సాధించినట్లు పాఠశాల ఉపాధ్యాయుడు నోముల చంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 31న ఖ మ్మం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయిలో పోటీల్లో అమరేందర్ పాల్గొంటారన్నారు. జిల్లా స్థాయిలో రెండో బహుమతి సాధించడంపై గ్రామ సర్పంచ్ వనపర్తి స్వప్న నరేశ్, ఎంపీటీసీ వేముల శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.