హుస్నాబాద్/ సిద్దిపేట టౌన్, అక్టోబర్ 20 : 1990-91మధ్య కాలంలో హుస్నాబాద్ ఎస్సైగా పనిచేసిన జిల్లా జాన్విల్సన్ ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజల జ్ఞాపకాల్లో ఉంటా రు. పీపుల్స్వార్ నక్సలైట్లు అమర్చిన బాంబ్ బ్లాస్ట్లో ప్రాణాలు కోల్పోయిన ఆయనను ఈ ప్రాంత ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పిస్తుంటారు.
రామవరం సంఘటనలో 15మంది మృతి
1991 డిసెంబర్ 19న ఉమ్మడి హుస్నాబాద్ మండలంలోని రామవరం సమీపంలో రోడ్డుపై నక్సలైట్లు లాండ్మైన్ అమర్చి పేల్చిన సంఘటనలో సీఐ యాదగిరి, ఎస్సై జాన్విల్సన్తో సహా 15మం ది బలయ్యారు. బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ రామవరం సమీపంలో ఆర్టీసీ బస్సుకు నిప్పంటించిన నక్సలైట్లు, ఎట్లాగైనా పోలీసులు వస్తారని గమనించి ముందస్తుగానే మందుపాతర అమర్చారు. డిసెంబర్ 19న సాయంత్రం 4గంటల సమయంలో ఆర్టీసీ బస్సులో వెళ్లిన సీఐ, ఎస్సై సహా రెవెన్యూ, ఆర్టీసీ సిబ్బంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో సీఐ యాదగిరి, ఎస్సై జాన్విల్సన్, సీఆర్పీఎఫ్ సీఐ అబ్రహం, ఎస్సై కశ్మీర్లాల్, కానిస్టేబుళ్లు హోషియార్, కె.రాజన్, ఆర్టీసీ కంట్రోలర్ వెంకట్రెడ్డి, స్టేషన్ మేనేజర్ రంగనాథస్వామి, కండక్టర్లు దుర్గారెడ్డి, దుర్గయ్య, డ్రైవర్ ఎల్లయ్య, సుంకరులు కనకయ్య, వెంకటయ్య, మిలిటెంట్లు శంకర్, రమేశ్ ఉన్నారు. వీరందరికీ ఏటా జరిగే పోలీసు అమరవీరుల దినోత్సవం రోజున నివాళులర్పిస్తారు.
జాన్ విల్సన్కు విగ్రహం ఏర్పాటు
ప్రజలతో ఏంతో మమేకంగా ఉండే ఎస్సై జాన్ విల్సన్ అకస్మాత్తుగా బాంబ్ బ్లాస్టింగ్లో మృతిచెందడంతో హుస్నాబాద్ పట్టణంతో పాటు మండల ప్రజలు జీర్జించుకోలేకపోయారు. సంతాప కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ప్రతిరూపం చిరస్థాయిగా ఉండేలా హుస్నాబాద్ పోలీస్స్టేషన్ ఎదుట విగ్రహం ఏర్పాటు చేశారు. ఆయన చనిపోయిన రోజైన డిసెంబర్ 19న నివాళులు అర్పించడంతో పాటు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిలాల్లో ఒక ఎస్సై(సబ్ ఇన్స్పెక్టర్) విగ్రహాన్ని పోలీస్స్టేషన్ ఎదుట ప్రతిష్టించడం ఇక్కడ మాత్రమే జరిగింది. జాన్ విల్సన్ చిత్రపటం పలు దుకాణాలు, ఇండ్లలో కనిపిస్తున్నదంటే ఆయన అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎంత అభిమానమో తెలుస్తుంది. స్వర్గీయ జాన్ విల్సన్ పోలీసు అధికారులు, సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రతి డిసెంబర్ 19న జాన్విల్సన్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జాన్విల్సన్ వర్థంతిని నిర్వహిస్తున్నారు. వృద్ధులు, నిరుపేదలకు చీరెలు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.