బెజ్జంకి, సెప్టెంబర్ 20 : సీఎం కేసీఆర్ చొరవతోనే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య ఉత్సవం నెలకొందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్లో 7 లక్షల చేప, 1.85 లక్షల రొయ్య పిల్లలను రాష్ట్ర సాంస్కృతిక సారథిచైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డితో కలిసి మంత్రి వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో మత్స్యకార్మికులు లేనట్లు ఒక్క రూపాయి కూడా అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యరంగానికి పుష్కలంగా నిధులు కేటాయించిందన్నారు. మత్స్యరంగానికి ఊపిరిపోసిన ఘనత సీఎం కేసీఆర్దే పేర్కొన్నారు. గతంలో నీళ్లు, కరెంట్ లేక ఎన్నో అవస్థలు పడ్డామని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యదక్షతతో వ్యవసాయానికి సరిపడా సాగు నీరు, 24 గంటల కరెంట్ను అందిస్తూ సువర్ణ పాలన అందిస్తున్నారన్నారు. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా 75 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నదని, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే స్టేషన్ ఘణపూర్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనున్నదన్నారు. మిషన్భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటింటికీ సురక్షితతాగు నీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆరోగ్యవంతమైన పల్లెల నిర్మాణం కోసం పల్లెప్రగతి అద్భుతంగా ప్రభుత్వం చేపడుతున్నదని, దేశంలో ప్రతి గ్రామ పంచాయతీకి నేరుగా ట్రాక్టర్ ఉన్న రాష్ట్రం తెలంగాణే అన్నారు. సిద్దిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని జలాశయాల్లో 4.19 కోట్ల చేప, రొయ్య పిల్లలను వేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు పూర్తిగా నిరాధరణకు గురై విధ్వంసమయ్యాని ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులకు పునఃర్జీవం పోసేందుకు పెద్దపీట వేస్తున్నారన్నారు. మండలంలో మూడు ఫిష్ మార్కెట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా మండలానికి సరిపడా చేప, రొయ్య పిల్లలు, 20 లక్షల విలువైన మొబైల్ ఫిష్ ఔట్ లెట్ సంచార వాహనాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప, రొయ్య పిల్లలపై స్థానిక మత్స్యకారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకొని, ఆర్థిక అభివృద్ధి సాధించి, ఆదర్శంగా నిలువాలని కోరారు. జలవనరుల్లో కౌంటింగ్లో రాజీ పడకుండా క్వాలిటీ చేప పిల్లలను అందిస్తున్నామని, విడుదల ప్రక్రియ అంతా వీడియోలో చిత్రీకరిస్తున్నారన్నారు. మత్స్యకారులు, జిల్లా ఫిషరీష్ అధికారులు సమన్వయంతో పండుగా వాతావరణంలో చేప పిల్లలను వదులుతున్నారన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో రెండో విడుతలో ముఖ్యమంత్రి యూనిట్ ధర లక్ష 75 వేలకు పెంచారని, నియోజక వర్గంలో లబ్ధిదారులు ఉంటే, వెంటనే డీడీలు తీసి అందిస్తే త్వరగా గొర్రెలను అందిస్తామని తెలిపారు. తోటపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు దసరా పండుగ వరకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తామని, గ్రామంలో సంపూర్ణంగా కుల సంఘ భవనాలు పూర్తి చేస్తామని, రూ. 2 కోట్లతో ఫంక్షన్హాల్ ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నమని సాంస్కృతి సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వివరించారు. అడుగగానే ఫిష్మార్కెట్, చేప, రొయ్య పిల్లలు అందించిన మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాంనాయక్, అడిషనల్ డైరెక్టర్ శంకర్రాథోడ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సత్యప్రసాద్, మత్స్యశాఖ అధికారి మధుసూదన్, ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ విజయప్రకాశ్, ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కవిత, ఎంపీడీవో రఘువేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజయ్య, సర్పంచ్ నర్సింగరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.