మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 17 : టెన్త్ పరీక్షలు ఈసారి ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల విధానంపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈనెల 11వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న 11 పేపర్లకు బదులుగా ఈసారి ఆరు పరీక్షలే నిర్వహించాలని ఒక్కో సబ్జెక్ట్కు ఒక పరీక్ష మాత్రమే ఉండాలని నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో జిల్లాలోని పాఠశాలల్లో సుమారు 55శాతానిక పైగా హాజరుశాతం నమోదవుతున్నది. దసరా తర్వాత హాజరు శాతం మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది కరోనా నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే అందరినీ ఉత్తీర్ణులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం తగ్గడంతో ఈ సారి ఆరు పరీక్షలే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 168 రోజుల ప్రత్యక్ష బోధన నిర్వహించాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇంకా గురుకులాలు ప్రారంభించలేదు.
సిలబస్ తగ్గింపు..
పాఠశాల విద్యార్థులకు సిలబస్ తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 10వ తరగతులకు 70 శాతం సిలబస్ బోధించాలని నిర్ణయించారు. సిలబస్ తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత ఏడాది ఉత్తర్వులను ఈ ఏడాది సైతం కొనసాగించాలని సూచించింది.
ఒక్కో పరీక్షకు 3.15 గంటల సమయం..
పదో తరగతి పేపర్లు తగ్గించడంతో పరీక్షల సమయం అరగంట పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒక్కో పరీక్ష 3 గంటల 15 నిమిషాల పాటు జరగనున్నది. సైన్స్ పరీక్షలో భౌతిక, జీవశాస్ర్తాలకు వేర్వేరు సమాధాన పత్రా ల ఉండనున్నాయి. బోర్డు పరీక్షకు 80 మార్కులు, ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షకు 20 మార్కులచొప్పున కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మార్చి, ఏప్రిల్లో పరీక్షలు..
ఒకటి నుంచి 10వ తరగతులకు ఫిబ్రవరి 28వతేదీ నాటికి సిలబస్ పూర్తి చేసి మార్చి 1 నుంచి పునశ్చరణ తరగతులు నిర్ణయించనున్నట్లు విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్లో వెల్లడించింది. మార్చి, ఏప్రిల్లో పదోతరగతి వార్షిక పరీక్షలు ఉంటాయని తెలిపింది.
రెండో భాషగా ఉర్దూ…
ఈ విద్యాసంవత్సరంలో విద్యాశాఖ పదోతరగతిలో ఉర్దూను ద్వితీయ భాషగా చేర్చింది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలే రెండో భాషగా ఉండగా.. తాజాగా ఉర్దూను చేర్చారు. విద్యాశాఖ నిర్ణయంలో ప్రథమ భాషగా తెలుగు, హిందీలో ఒక దానిని తీసుకున్న విద్యార్థి ద్వితీయ భాషగా ఉర్దూ ఎంచుకోవడానికి వీలుంటున్నది. ఉర్దూను ప్రథమ భాషగా తీసుకుంటే తెలుగు లేదా హిందీ ద్వితీయ భాషగా తీసుకోవచ్చు.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షల షెడ్యూల్
ఒకటి నుంచి 9వ తరగతి వరకు 2022 ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ పూర్తి చేయాలి.
పదో తరగతి విద్యార్థులకు 2022 జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయాలి.
ఫార్మేటివ్ అసెస్మెంట్ -1 పరీక్షలకు గడువు అక్టోబర్ 5
ఫార్మేటివ్ అసెస్మెంట్ -2 పరీక్షలకు గడువు జనవరి 31
డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ – 1 పరీక్షలు.
ఏప్రిల్ 7 నుంచి 18 వరకు సమ్మేటివ్అసెస్మెంట్ -2 పరీక్షలు
ఫిబ్రవరి 28 నాటికి పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేయాలి.
మార్చి లేదా ఏప్రిల్ మాసంలో పదో తరగతి వార్షిక పరీక్షలు.
ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి.