ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో విద్యా బోధనకు కాంట్రాక్ట్ లెక్చరర్లు వస్తున్నారు.. గెస్ట్ ఫ్యాకల్టీలో భర్తీ చేసేందుకు ఇప్పటికే ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసి, నియామకాలు చేపట్టింది. గతంలో పని చేసిన వారికి మరోసారి అవకాశం కల్పించింది. దీంతో నేటి నుంచి అతిథి అధ్యాపకులు విధులకు హాజరుకానున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 మంది అతిథి అధ్యాపకులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 17 : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకుల పోస్టులు భర్తీ చేశారు. గెస్ట్ ఫ్యాకల్టీలో భర్తీ చేసేందుకు ఇంటర్ బోర్డు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,654 అతిథి అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండగా, ఉమ్మడి మెదక్ జిల్లా 243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మెదక్ జిల్లాలో 72, సంగారెడ్డి జిల్లాలో 94, సిద్దిపేట జిల్లాలో 77 పోస్టులు ఉన్నాయి. అతిథి అధ్యాపకుల నియామకంతో కొరత తీరనుంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. గత విద్యా సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అతిథి అధ్యాపకులను ఇంటర్ బోర్డు నియమించింది. గతంలో పనిచేసే వారికే ఇంటర్ బోర్డు మరోసారి అవకాశం కల్పిచింది. నేటినుంచి అతిథి అధ్యాపకులు విధులు హాజరుకానున్నారు.
ఉమ్మడి జిల్లాలో 243 మందికి అవకాశం..
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 53 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, మెదక్ జిల్లాలో 16 కళాశాలలు, సిద్దిపేట జిల్లాలో 18 కళాశాలలు, సంగారెడ్డి జిల్లాలో 19 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 243 మంది అతిథి అధ్యాపకులకు ప్రభు త్వం అవకాశం కల్పించింది. ఇంటర్ బోర్డు ఆదేశాలతో ఖాళీలను భర్తీ చేశారు. భర్తీతో ఆయా కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత తీరనుంది. నెలరోజులుగా తరగతులు కొనసాగుతున్నా అతిథి అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతో పాఠ్యంశాలకు సంబంధించిన బోధన కాస్త వెనుకబడ్డది. అతిథి అధ్యాపకులకు ఒక పీరియడ్కు రూ.300 చొప్పున నెలకు 72 పీరియడ్లకు మించకుండా నెలకు రూ.21,600 చెల్లించేవారు. ఇటీవల ప్రభుత్వం పీరియడ్కు రూ.90 పెంచింది. ఖాళీల భర్తీచేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయంతో అతిథి అధ్యాపకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
బోర్డు మార్గదర్శకాల మేరకు భర్తీ
ఇంటర్మీడియట్ బోర్డు మార్గదర్శకాల మేరకు మెదక్ జిల్లాలో 16 జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 72 అధ్యాపకుల పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేశాం. బోర్డు సూచనలతో గతంలో విధు లు నిర్వహించిన వారికి అవకాశం కల్పిం చాం. నేటి నుంచి విధులకు హాజరు కానున్నారు.
-సత్యనారాయణ, మెదక్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి